జగిత్యాల జిల్లాలో ఏడాది పొడుగునా ప్రవహిస్తున్న పెద్దవాగు నీరు వృథాగా పోకుండా ఆపడంతో పాటు సాగునీటి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ‘చెక్’ పెట్టింది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు మూడు మండలాల పరిధిలో రూ.40 కోట్లు వెచ్చించి 11 చెక్డ్యాంలు నిర్మించింది. వాగులో నీటి నిల్వలను చూసి రైతాంగం సంబుర పడుతున్నది. 2,800 ఎకరాల్లో రెండు పంటలు పండనుండగా తమ దశ తిరిగినట్టేనని సంతోషపడుతున్నది. భూగర్భ జలాలు ఉబికివస్తుండడంతో సాగు నీటికి గోస తప్పనున్నది. మరోవైపు విరివిగా చేపలు, రొయ్యల పెంపకానికి అవకాశముండగా మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం తొణికిసలాడుతున్నది.
మానేరునది సమీపంలో పుట్టి, వేములవాడ నుంచి దిగువకు ప్రవహిస్తూ, జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మండలాల మీదుగా బోర్నపెల్లి వద్ద గోదావరిలో కలిసే పెద్దవాగు జగిత్యాల జిల్లాకు కీలక సాగునీటి వనరు. సుమారు 60 కిలోమీటర్ల పొడవున్న వాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తూ నదిని తలపిస్తుంది. ఏడాది పొడుగునా జలసవ్వడులతో ఉట్టిపడుతున్నా సాగుకు మాత్రం ఉపయోగపడడంలేదు. భూగర్భ జలాల వృద్ధి సైతం పెద్దగా లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో సర్కారు ఈ వాగునీటిని సాగుభూములకు మళ్లించాలని నిర్ణయించింది. నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లతో సర్వే చేయించింది. అధికారుల నివేదిక మేరకు వాగుపై 11 చెక్డ్యాంలను నిర్మించాలని సంకల్పించింది.
– జగిత్యాల, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కారు మెట్పల్లి నుంచి బోర్నపెల్లి వరకు 11 చెక్డ్యామ్లను నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో చెక్డ్యామ్ మధ్య కనీసం కిలోమీటర్ దూరం ఉండాలని భావించి మూడు మండలాల పరిధిలో వాగుపైన రూ. 40 కోట్లతో 11 చెక్డ్యామ్ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఒక్కోదానికి రూ. 3.50 కోట్ల వరకు వెచ్చించారు. మెట్పల్లి మండలంఆత్మకూర్, మెట్పల్లి అర్బన్ శివారులో ఉన్న ఆరపేట, వేంపేట, చౌలమద్ది గ్రామాల్లో, కోరుట్ల మండలం అయిలాపూర్, ధర్మారం గ్రామాల పరిధిలో, రాయికల్ మండలం ఇటిక్యాల శివారులో రెండు, మూటపెల్లి, కొత్తపేట, బోర్నపెల్లి గ్రామాల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున 11 చెక్డ్యాంలు నిర్మించారు.
పెద్దవాగుపై 11 చెక్డ్యామ్ల నిర్మాణం పూర్తి కావడంతో దాదాపు 2,800 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనున్నది. ఇన్నాళ్ల్లూ వర్షాకాలంలో నీటి ఉధృతి, ఎండకాలంలో భూగర్భజలాల లేమితో గోసపడ్డ ప్రజానీకం ఇప్పుడు చెక్డ్యామ్లో నీటి నిల్వలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో చెక్డ్యామ్ పరిధిలో 200 నుంచి 300 ఎకరాలకు నీరందనున్నది. అలాగే భూగర్భ జలం అమాంతం పెరిగిపోయింది. బోరుబావుల్లో పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చింది. చెక్డ్యాం నిర్మాణంతో మూడు మండలాల పరిధిలోని 1100ల మంది రైతులు తమ పొలాలకు నీటిని మళ్లించుకొని 2800 ఎకరాల్లో సేద్యం చేస్తున్నారని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా నీరు నిలువ ఉంటుండడంతో విరివిగా చేపలు పెంచుకోవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. రాయికల్ మండలం ఇటిక్యాల శివారులోని చెక్డ్యామ్ వద్ద మత్స్యకారులు నిత్యం చేపలు పట్టి విక్రయిస్తున్నారు.
గతంల పెద్దవాగులో నీరున్నా పంటలకు ఉపయోగపడేదికాదు. చెక్డ్యాంల నిర్మాణంతో సాగునీటికి గోస తప్పింది. ఇప్పుడు నేరుగా పొలాలకు మళ్లించుకుంటున్నం. తనకున్న రెండున్నర ఎకరాల్లో ఏడాదిలో రెండు పంటలు పండించుకుంటున్న. భూగర్భజలాలు కూడా పెరిగాయి. మత్యకారులు చేపలు పెంచి ఉపాధిని పొందుతున్నారు.
– వంగ మల్లారెడ్డి, ఇటిక్యాల, పెద్దవాగు పరీవాహక రైతు
గతంల వాగు పక్కనే ఉన్నప్పటికీ ఒక పంటకే సరిపడా నీరందేది కాదు. పక్కనే బావులు తవ్వుకొనేది. వానకాలంలో వాగు ప్రవాహానికి పూడుకుపోయేది. దీంతో రైతులందరూ మస్తు తిప్పలు పడేది. సాగునీరులేక ఎన్నోసార్లు పంటలు ఎండిపోయి నష్టపోయినం. ఇప్పుడు చెక్ డ్యామ్ నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగినయ్.. రంది లేకుండా రెండు పంటలు పండించుకుంటున్నం.
– బొడుగం భూమన్న, రైతు ఇటిక్యాల