కరీంనగర్ నగర పాలక సంస్థలో మ్యుటేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఇంటి యజమాని చనిపోతే భార్య లేదా పిల్లల పేరిట ఆస్తి మార్పిడి చేయాలంటే కీలకమైన ఈ విధానానికి ఒక్కసారిగా బ్రేక్పడింది. సాధారణంగా దరఖాస్తుకు మరణ ధ్రువీకరణ పత్రం, అఫిడవిట్ జత చేసి అందిస్తే పని పూర్తిచేసే అధికారులు, మూడు నెలలుగా దరఖాస్తులను పెండింగ్లో పెడుతున్నారు.
అప్లికేషన్లు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోతుండగా, దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వేసారిపోతున్నారు. అయితే నిబంధనలు మారాయని, రిజిస్ట్రేషన్ చేసుకుంటే మ్యుటేషన్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తుండగా, పాత విధానంలో చేయాలని అర్జీదారులు కోరుతున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 19: ఇంటి యజమాని చనిపోతే భార్య లేదా పిల్లల పేరిట ఆస్తి మార్పిడి చేయాలంటే మ్యుటేషన్ తప్పనిసరి. దరఖాస్తుకు మరణ ధ్రువీకరణ పత్రం, వారుసుల సంతకాలతో నోటరీ జత చేసి అందిస్తే సరిపోతుంది. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పేరుమార్పిడి చేస్తుంటారు. కరీంనగర్ బల్దియాలో ఈ ప్రక్రియ ఏండ్లపాటు సజావుగా సాగింది.
అయితే, మూడు నెలలుగా అధికారులు దరఖాస్తులను పెండింగ్లో పెడుతుండగా, అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడిచిపోతున్నా మ్యుటేషన్ కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వేసారిపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మ్యుటేషన్ కావాలంటే ప్రస్తుతం మరణించిన వ్యక్తి భార్య లేదా వారసుల పేరిట రిజిస్ట్రేషన్ తప్పనిసరని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. ఇన్నాళ్లూ అడ్డురాని లేని నిబంధనలు ఇప్పుడెలా వచ్చాయని, ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని మ్యుటేషన్లు చేయాలని కోరుతున్నారు.
మ్యుటేషన్ నిబంధనలు మారాయి. మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తి భార్య లేదా పిల్లల పేరిట మార్చుకోవాలంటే ఆ ప్రాపర్టీ వాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి. మేం ఆ పద్ధతిలోనే వెళ్లాలని సూచిస్తున్నాం. వాస్తవానికి ఇటీవలికాలంలో మ్యుటేషన్లన్నీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ అనంతరం ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఇంకా మా వద్దకు వచ్చే దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తున్నాం.
– స్వరూపరాణి, నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్