తెలంగాణచౌక్, ఏప్రిల్ 17 : హైదరాబాద్లో అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ దేశంలో చరిత్రను సృష్టించారని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జెల కాంతం పేర్కొన్నారు. నగరంలోని శ్వేత హోటల్లో జిల్లా కమిటీ సభ్యులతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్మారక స్తూపం నిర్మాణాలు చేపట్టడం హర్షణీయమన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ర్టంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదో, కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 40 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కర్నాటక, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్లో దళిత రిజర్వేషన్లు కల్పించడం లేదని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో ఆర్ఎస్ఎస్, బీజేపీలకు భయం పట్టుకుందన్నారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని ఇప్పటి వరకు బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. బీజేపీ పాలనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞత తెలుపడానికి మే 10న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద, జూన్ 10న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయా కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ్ర సంపత్, సీనియర్ నాయకుడు గజ్జెల ఆనందరావు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుల్తాన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లత తదితరులు పాల్గొన్నారు.