చిగురుమామిడి, జూలై 26 : రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేయించే ప్రక్రియ ఈ నెల 31తో ముగియనున్నది. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ అవసరం లేదు. ఐదు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లల్లో వేలిముద్రలు, ఐరిస్ వస్తే డీలర్ లేదా మీ సేవా కేంద్రాల్లో నమోదు చేయిస్తే సరిపోతుంది. ఈ-కేవైసీ చేయించుకోని వారికి బియ్యం తగ్గడం లేదా ఏమైనా ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నది. బయోమెట్రిక్, వేలిముద్రలు రాని లబ్ధిదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ను సమీపంలోని ఆధార్ కేంద్రంలో సవరించుకోవాలి.
వేలిముద్రలు, ఐరిస్ ద్వారా కూడా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. వన్ నేషన్.. వన్ రేషన్ ప్రక్రియ ద్వారా దేశమంతటా దీనిని అనుసంధానం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం విద్యాభ్యాసం కోసం ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు అకడి రేషన్ దుకాణాల ద్వారా ఈ-కేవైసీ చేయించుకునే అవకాశమున్నది. చివరి రోజుల్లో సర్వర్ బిజీగా ఉండనున్న నేపథ్యంలో త్వరగా పూర్తి చేసుకోవాలని చిగురుమామిడి తహసీల్దార్ కోడం కనుకయ్య సూచించారు. మండలంలో ఇప్పటి వరకు 87 శాతం పూర్తయినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.