సమైక్య పాలనలో ఎటుచూసినా నెర్రెలు బారిన నేలలు.. ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు, కుంటలు, చుక్కనీరు లేక బొందలగడ్డగా మారిన వ్యవసాయ బావులు.. వంటి దృశ్యాలే కనిపించేవి. ఇండ్ల వద్ద ఉన్న బావులన్నీ పెంటబొందలయ్యాయి. జలవనరులు అడుగంటి పోవడంతో ఆ పల్లెలో సైతం నీటి ఊటలు లేకుండాపోయాయి. ఎండకాలం వస్తే చాలు అలుకు చల్లితే రూ.500 జరిమానా విధించే దౌర్భాగ్య పరిస్థితుల మధ్య బతికిన పోతారం గ్రామం స్వరాష్ట్రంలో తలెత్తుకున్నది. కాళేశ్వర జలాల రాక,SRSP Punarjeevan scheme పునర్జీవ పథకంతో ఊళ్లోని పెద్ద చెరువు ఊపిరిలూదుకొని జల తాండవం చేస్తున్నది. ఆరేండ్లుగా నిండుగా ఉంటూ, పంటలకు ప్రాణం పోస్తూ, రైతుకు భరోసా ఇస్తున్నది. సేద్యం పునర్జీవం పోసుకొని పచ్చని పొలాలు, చిక్కని బంధాలతో ఊరు కళకళలాడుతుండగా, పట్నం బాటపట్టిన ప్రజానీకం తిరిగి సొంతూరుకు చేరుతున్నది. అటు చెరువులో పుష్కలమైన జలాలతో ఊరంతా భూగర్భజలాలు పెరిగి, మత్స్యకారులకు చేతినిండా ఉపాధి దొరుకుతున్నది. ఇది ఈ ఒక్క పోతారం విజయగాథే కాదు.. వరద కాలువ పరీవాహకంలో ఏ ఊరుకు వెళ్లినా కనిపిస్తున్న కాళేశ్వరం జలం విప్లవ, పునర్జీవ ఫల దృశ్యం.
– జగిత్యాల, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ)
జగిత్యాల, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): పచ్చని పొలాలు.. చిక్కని బంధాలు. ఊరుపొంటే పొందిచ్చిన చెరువు.. పుష్కలంగా నీళ్లు. అందులో జీవరాశుల సప్పుడు. ఎటూ చూసినా ఆహ్లాదకర వాతావరణంతో విలసిల్లిన పల్లెలు సమైక్య రాష్ట్రంలో ఆనవాళ్లను కోల్పోయాయి. ఊరంతటికీ జీవనాధారమైన చెరువులు నాశనమయ్యాయి. చెరువుల్లోకి నీటిని తెచ్చే వాగులు, ఒర్రెలు కానరాకుండా పోయాయి. అరవై ఏండ్ల కింద పంటల కోసం ఎస్సారెస్పీ కట్టి, కాలువల ద్వారా నీరిచ్చినా ఆ గ్రామాలకు మాత్రం నీరందలేదు. చెరువుల్లో తడిలేక జల ఊటలు కానరాకుండా పోయాయి. ఇండ్లలో బావులన్నీ పెంటబొందలయ్యాయి. ఎండకాలం వస్తే చాలు ఆ గ్రామంలోని ఇండ్లలో అలుకు చల్లవద్దంటూ, చల్లితే రూ.500 జరిమానా విధించే దౌర్భాగ్య పరిస్థితులు కనిపించాయి. పది, పదిహేనేండ్ల పాటు ఆ ఊర్లే గణపతి పండుగ తర్వాత ప్రతిమలను నిమజ్జనం చేయలేక అలాగే వదిలిపెట్టివెళ్లిన చరిత్ర వారిది. అలాంటి గ్రామంలో నేడు జలసవ్వళ్లు తాండవం చేస్తున్నాయి. నీటి చుక్క లేక తుమ్మలు మొలిచిన 70 ఎకరాల చెరువు సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా మొదలు పెట్టిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో కొన్నేండ్లుగా నిండుకుండలా ఉంటోంది. దీంతో భూగర్భజలాలు పెరిగి బావులు ప్రాణం పోసుకున్నాయి. వాటిల్లో భూమికి సమాంతరంగా నీరు కనిపిస్తోంది. ఇక బతుకుదెరువు లేక పట్నం బాటపట్టిన గ్రామస్తులు వలసలు మాని తిరిగి తమ ఊర్లెకు చేరుకున్నారు. నిండుగర్భిణిలా మారిన చెరువులో నిత్యం మత్స్యకారులు చేపలవేట సాగిస్తూ బతుకుతున్నారు.
జూలై మొదటి వారంలోనే నిండిన చెరువు
ఈ ఏడాది సైతం కాళేశ్వరం జలాలతోనే పోతారం పెద్ద చెరువు నిండిపోయింది. జూన్ గడిచి, జూలై వచ్చినా వర్షపు జాడ లేకపోవడంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి, వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జూలై 7 నుంచి కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడం మొదలు పెట్టారు. గాయత్రీ పంప్హౌస్ ద్వారా నీటిని వరద కాలువలోకి మళ్లించి అక్కడి నుంచి ఎగువకు నీటిని తరలించారు. ఈ క్రమంలోనే మల్యాల మండలంలోని పోతారం పెద్ద చెరువును కాళేశ్వరం నీటితో నింపివేశారు. నాలుగు రోజుల వ్యవధిలోనే చెరువు నిండిపోయి మత్తడి దూకింది. జగిత్యాల రూరల్ మండలంలోని మోతె చెరువును నింపింది. చెరువులు నిండడంతో పరిసరాల్లో వ్యవసాయ బావులన్నింటిలోను నీటి ఊటలు పెరిగిపోయాయి. చెరువు నీరుకు తోడు బావుల్లో నీరు భూ ఉపరితలానికి సమాంతరానికి చేరుకోవంతో గ్రామస్తులు రెట్టించిన ఉత్సాహంతో సేద్యంపనుల్లో నిమగ్నమైపోయారు.
జీవం పోసిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం
మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, మల్యాల నాన్కమాండ్ ఏరియాలుగా ఉండిపోయాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మించి, కాకతీయ కాలువ ద్వారా నీటిని సరఫరా చేసినా ఈ మండలాల్లోని కొన్ని గ్రామాలకు చుక్కనీరు అందని పరిస్థితి. 20 ఏండ్ల క్రితం ఎస్సారెస్పీకి అనుసంధానంగా వరద కాలువ నిర్మించినా, పరివాహంలోని కొన్ని గ్రామాలకు నీటి సౌకర్యం లేని దుస్థితి. వరద కాలువలకు తూములు పెట్టడానికి సమైక్య రాష్ట్రంలో పాలకులు అంగీకరించలేదు. దీంతో మల్యాల మండలం పోతారం, రాజారం, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. చెరువులకు నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడేది. అయితే, కాళేశ్వరం నిర్మించి, తర్వాత ఎస్సారెస్పీ వరద కాలువను అనుసంధానంగా చేసుకొని ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని మొదలు పెట్టడంతోపాటు వరద కాలువలకు 34 తూములను ఏర్పాటు చేశారు. చెరువులను నింపడం మొదలు పెట్టగా ఆ గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. జలకళ లేక కళావిహీనంగా మారిన పల్లెలు నేడు తిరిగి పూర్వవైభవాన్ని సాధించాయి. ఆరేండ్లుగా వరద కాలువ తూముల ద్వారా చెరువులు నింపుకుంటూ నేడు బంగారం పండిస్తున్నాయి. ఈ ఏడాది సైతం కాలం ఆలస్యం కావడం, వర్షపు చినుకు జాడలేని తరుణంలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి, వరద కాలువ ద్వారా చెరువుల్లోకి మళ్లించడంతో, చెరువులు పొంగిపొర్లాయి. వీటితో పాటు వాగులు వంకలు పారడంతో, గొలుసుకట్టు పద్ధతిలో పొందిచ్చిన చెరువులన్నీ నిండిపోయాయి. ఫలితంగా వాన జాడలేని సమయంలోనూ వరద కాలువ పరీవాహక ప్రాంతాల్లో సేద్యం జోరుగా సాగుతోంది.
పోతారమే నిదర్శనం
పోతారం. మల్యాల మండలంలోని ఒక ఊరు. జగిత్యాల-కరీంనగర్ రహదారిపై, జగిత్యాల జిల్లా కేంద్రానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో, ఎస్సారెస్పీ ప్రధాన కాలువ అయిన కాకతీయ కెనాల్కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే, కాలువ కంటే ఈ గ్రామం ఎగువన ఉండడంతో ఊరు నాన్ కమాండ్ ఏరియాలోకి వెళ్లిపోయింది. గ్రామానికి పెద్ద చెరువు ఉంది. పూర్వకాలంలో చెరువు నిండితే గ్రామస్తులకు సేద్యంతో పాటు తాగునీటికి, చేపల పెంపకానికి ఎంతో దోహదపడేది. చెరువు కింద 230 ఎకరాల ఆయకట్టు ఉంది. గొలుసు కట్టు చెరువుల్లో ఒకటైన పోతారం చెరువు నిండి అలుగు పారితే గోపాలకుంట, రాజారం చెరువు మీదుగా జగిత్యాల రూరల్ మండలంలోని మోతె చెరువుకు చేరుతాయి. అయితే, చెరువులపై పట్టింపు లేకపోవడం, వాతావరణంలో విపరీతమైన మార్పుల నేపథ్యంలో 50 ఏండ్లుగా పోతారం చెరువు పూడుకుపోయింది. దీనికి తోడు వర్షాలు సరిగా కురవకపోవడం, చెరువులు నింపేందుకు వేరే మార్గం లేకపోవడంతో తుమ్మలు మొలిసి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇక గ్రామంలో చెరువుపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలకు సైతం ఉపాధి లేకుండా పోయింది.
కాకతీయ కాలువ ద్వారా చెరువును నింపాలని గ్రామస్తులు కోరినా పాలకులు పట్టించుకోలేదు. 20 ఏండ్ల క్రితం పోతారం నుంచే ఎస్సారెస్పీ వరద కాలువ తవ్వారు. ఈ కాలువకు సైతం గ్రామస్తులు భూమిని ఇచ్చారు. కాలువ తవ్వితేనైనా తమ గ్రామానికి నీళ్లు వస్తాయని, చెరువు నిండుతుందని భావించారు. అయినా, ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటి ప్రభుత్వాలు వరద కాలువకు తూములు పెట్టి చెరువులు నింపేందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. బోర్లు వేసుకొని వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. నాన్ కమాండ్ ఏరియా కావడంతో భూగర్భజలాలు సైతం పాతాళానికి చేరుకోవడంతో బోర్లపై వ్యవసాయం చేయడం పెద్ద ఇబ్బందికరంగా మారిపోయింది. చెరువులో నీళ్లు లేకపోవడం, సేద్యం లేకపోవడంతో చాలా మంది వలసబాట పట్టారు.
గ్రామంలో నీళ్లు లేక బతుకమ్మ, వినాయక చవితి పండుగల తర్వాత వాటిని నిమజ్జనం చేయడానికి సైతం ఇబ్బందులు పడ్డారు. అయితే, స్వరాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. వరద కాలువకు ముందుగా 6 మీటర్ల ఎత్తులో 1.5 మీటర్ల వ్యాసార్థంతో తూములను ఏర్పాటు చేశారు. అయితే, కాలువలో 6 మీటర్లకు పైగా నీటి ప్రవాహం ఉన్నప్పుడే ఈ తూము నుంచి నీరు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో వరద కాలువ పరీవాహక ప్రాంత ప్రజలకు ఈ తూములు పెద్దగా ఉపయోగపడలేదు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభ్వుత్వం 2 నుంచి 4 మీటర్ల లోపులో, 3 మీటర్ల వ్యాసార్థంతో మరో 18 తూములను ఏర్పాటు చేసింది. దీంతో వరద కాలువ ఎగువ నుంచి ప్రవాహం వచ్చినప్పుడు, కాలం కాని పరిస్థితుల్లో కాళేశ్వరం ద్వారా పునర్జీవ పథకంతో ఎస్సారెస్పీలోకి నీటిని తరలిస్తున్న సమయంలో తూములు తెరిచి చెరువులు నింపుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ చర్యతో వరద కాలువ పరీవాహకంలో ఉన్న పోతారం వంటి గ్రామాల జీవన విధానమే మారిపోయింది. ఆరేండ్లుగా పోతారం చెరువు ఏడాది పొడవునా నిండుగానే కనిపిస్తోంది. ఒకప్పుడు ఉపాధి లేకుండా పోయిన 200 మత్స్యకార కుటుంబాలకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతున్నది. గ్రామంలో భూగర్భజలాలు పెరిగాయి. ఏండ్లనాటి తాగునీటి గోస కూడా తీరింది.
చెరువు నిండింది.. పొలాలు పండాయి
మా ఊరి చెరువు నిండింది. మా పొలాలన్నీ పండుతున్నాయి. పదేండ్ల కింద సూత్తె, చెర్ల నీళ్లు లేవు. మా కండ్లల్ల కూడా నీళ్లు లేవన్నట్టుండేది. 1970-80 మధ్య మస్కట్కు పోయి సంపాదించిన పైసలతోటి నాలుగెకరాల భూమి కొన్న. చెర్ల నీళ్లే లేకపాయె. ఎప్పుడు సక్కగ సాగు చేసింది లేదు. బీడు పడే ఉండేది. బావుల్లో నీళ్లు లేకుండా పోయినయి. బోర్లు ఏసినా పాయిదా లేదు. మస్తు తిప్పలువడ్డం. వరద కాలువ తవ్వినా మాకు మేలు జరగలేదు. సీఎం కేసీఆర్ సార్ అచ్చినంక, వరద కాలువకు రెండు తూములు పెట్టి, మా చెర్లకు నీళ్లు అచ్చెటట్టు చేసినంక మా ఊరు నసీబ్ మారిపోయింది. ఇప్పుడు చెర్ల ఏడాదంతా నీళ్లుంటున్నయి. చెర్ల నీళ్ల కంటే ఎక్కువ బావుల్లో నీళ్లుంటున్నయి. ఇప్పుడు నా నాలుగెకరాలు సాగు చేస్తున్న. మునుపటికి ఇప్పటికీ రూపాయికి పంద్రాణ మందం మార్పు వచ్చింది. కాలంగాకున్నా 20 రోజుల కింద వరద కాలువ నుంచి నీళ్లు తెచ్చి మా చెరువు నింపిండ్రు. ఆ నీళ్లతోటే మేం ఎవుసం చేస్తున్నం. ఇదంతా సీఎం సార్ వల్లనే జరిగింది.
– పొన్న బమ్మయ్య, నాలుగెకరాల ఎకరాల రైతు, పోతారం, (మల్యాల మండలం)
ఒకప్పుడు బతుకమ్మలు వేసే పరిస్థితి లేని దైన్యం మాది
మొన్నటి దాకా బతుకమ్మలు, గణపతి విగ్రహాలు వేసేందుకు నీళ్లు లేని దీన పరిస్థితి మా ఊరోళ్లది. ఒక మాటలో చెప్పాలంటే బహిర్భూమికి పోతే కడుక్కునేందుకు నీళ్లు లేని దుస్థితి మాది. వరద కాలువ ఉన్నా లాభం లేదు. కాకతీయ కాలువ నుంచి నీళ్లు రావు. ఇగ చెరువు నిండదు. ఊరు బాగుపడదు అనుకున్నాం. అయితే దేవుని లెక్క సీఎం కేసీఆర్ సార్ వరద కాలువకు తూములు పెట్టి, కాళేశ్వరం నుంచి నీటిని తరలించి, వరద కాలువ ద్వారా చెరువులోకి పంపే ఏర్పాట్లు చేసిండు. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు చెరువు కింద వ్యవసాయం చేయాలంటే రైతులు చాలా ఖర్చు చేయాల్సి వచ్చేది. కనీసం ఒక్క రైతు ఏడాదికి లక్షన్నర ఖర్చు పెట్టేది. కంప్రెషర్లకు, బావుల్లో పూడిక తీయడానికి, సైడ్ బోర్లు వేసుకునేందుకు ప్రయత్నాలు చేసేది. అయినా ప్రయోజనం కలిగిన సందర్బాలు చాలా తక్కువ. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పంట సాగు చేసుకోవడానికి రైతు ఒక్క రూపాయి ఖర్చు చేయడం లేదు. ఏడాది పొడవునా నీళ్లే.. నీళ్లు. మా ఊరి కల నెరవేరింది. ఇదంతా సీఎం కేసీఆర్ దయతోనే సాధ్యమైంది.
– ఐల్నేని సాగర్రావు, సింగిల్విండో చైర్మన్, పోతారం
మా కుటుంబానికి అన్నం దొరికింది
నా పేరు కట్కూరి నర్సయ్య. నిరుపేద కుటుంబం నాది. కస్కెడు భూమి లేదు. మునుపు కౌలు తీసుకొని ఎవుసం చేసేది. అయితే చెరువుల నీళ్లు లేకపోవడంతోటి ఉప్పరి పనికి పోవాల్సి వచ్చింది. నాకు, నాకుటుంబానికి తిండికి తిప్పలయ్యేది. ఏం బతుకులురా..? అని అనుకునేది. ఆరేండ్ల నుంచి మా చెరువులకు నీళ్లు వస్తున్నయి. దీంతో బావుల్లో నీళ్లు చేరడంతోటి మళ్ల ఎవుసం పచ్చబడ్డది. గతంలో బీడు పెట్టిపోయిన కొందరు మళ్లీ ఎవుసం చేయాలన్నరు. వాళ్ల దగ్గర ఆరెకరాల కౌలు తీసుకొని చేత్తున్న. చెరువు నిండడంతోటి నాకు, నాకుటుంబానికి ఇంత అన్నం దొరికింది. కాళేశ్వరం నీళ్లు లేకుంటే మా ఊరికి వేరే దిక్కులేదు. దివానం లేదు. కాళేశ్వరం కట్టి, నీళ్లను మా ఊరి చెరువు దాక తెచ్చిన కేసీఆర్ సార్కు అందరు రుణపడి ఉన్నాం.
– కట్కూరి నర్సయ్య, కౌలు రైతు, పోతారం (మల్యాల మండలం)
బొంబాయికి రాంరాం చెప్పేశాం
కాళేశ్వరం నీళ్లతోటి మా ఊరు నిండింది. మొదటి సారి ఎప్పుడైతే చెరువులకు నీళ్లచ్చినయో అప్పుడే బొంబాయికి రాంరాం చెప్పేశాం. మా ఊళ్లే బెస్తవారి కుటుంబాలు 200 దాకా ఉన్నాయి. 600 మంది ఓటర్లే ఉన్నారు. మా అందరికీ ఊరి చెరువే ఉపాధినిచ్చేది. అయితే చెరువు ఎండిపోవడంతోటి గతిలేని పరిస్థితుల్లో దాదాపు 50 కుటుంబాల వాళ్లం బతుకుదెరువు కోసం బొంబాయి పోయినం. అక్కడ దనవంతుల ఇండ్లల్లో పనిమనుషులుగా పనిచేసుకుంటూ బతికినం. రెండుమూడేండ్లకు ఒక్కసారి అచ్చి, చెరువు నిండిందా..? అని ఆశగా చూసిపోయేది. మా చెరువు నిండుతది అన్న ఆశ వదులుకున్నాం. అయితే సీఎం కేసీఆర్ సార్ మా ఆశలకు ప్రాణం పోసిండు. కాళేశ్వరం కట్టి, అక్కడి నుంచి నీటిని మళ్లీ వెనక్కి తెచ్చి మా చెరువులాంటి ఎన్నో చెర్లను నింపే సౌలత్ చేశాడు. ఆరేండ్ల సంది మా చెరువు నిండుతోంది. చెరువు నిండుడు ఎప్పుడైతే మొదలైందో మేం బొంబాయికి పోవుడు బంద్ చేసినం. ఇక్కడే చేపలు పడుతూ బతుకుతున్నాం. చేపల సీజన్ లేనప్పుడు వ్యవసాయ పనులకు కూలికి పోతున్నాం. పుట్టిన ఊర్లే ఇంత గౌరవంగా బతుకుతున్నాం. ఇదంతా సీఎం కేసీఆర్ చలువే.
– పల్లికొండ రాజయ్య, మత్స్యకారుడు, పోతారం