నకాశి కళాకారులంటే మొదట గుర్తుకు వచ్చేది నిర్మల్. అయితే, తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ కనిపిస్తుంటారు. జగిత్యాలలోనూ మూడు కుటుంబాలు వందల ఏండ్ల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాయి. ఇంటిల్లిపాది ఉదయం లేచింది మొదలు చీకటిపడేదాకా చెక్కలపై చక్కని బొమ్మలను తయారుచేస్తుంటారు. కుంచెతో ప్రకృతి సిద్ధమైన రంగులు వేసి ప్రతిమలకు ప్రాణంపోస్తుంటారు. ప్రధాన రహదారులు, సమీపంలోని మార్కెట్లలో విక్రయిస్తూ జీవనాన్ని వెళ్లదీస్తున్నారు.
800 ఏండ్ల క్రితం తెలంగాణకు..
నకాశి కళాకారులు వాస్తవానికి మరాట్వాడ (మహారాష్ట్ర) ప్రాంతానికి చెందిన వారు.. సుమారు 800 ఏండ్ల క్రితం కాకతీయుల సామతుండు నిమ్మనాయుడు వీరిని తెలంగాణకు రప్పించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కళాకారుల కుటుంబాలు నిర్మల్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిద్దిపేట, చేర్యాల, తదితర చోట్ల స్థిరపడ్డారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిల్లోనూ వీరి కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కాలక్రమేణా చాలామంది ఈ కళను వదిలి ఇతర వృత్తులను ఎంచుకున్నారు. ప్రస్తుతం జగిత్యాల తీన్ఖని సమీపంలో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాయి.
పొనికి కర్ర.. కళాకారులకు జీవగర్ర..
కళాకారులు బొమ్మల తయారీకి పొనికి కర్రను మాత్రమే వాడతారు. ఈ కర్ర చాలా తేలికగా మెత్తగా ఉంటుంది. వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కర్రను కాస్త ఎండబెట్టి తాము అనుకున్న బొమ్మ ఆకృతిలోకి మారుస్తారు. తర్వాత చింతగింజల పొడిని పూసి ఎండబెట్టి సహజమైన రంగులు అద్ది విక్రయిస్తారు. అయితే కొన్నేళ్లుగా అడవులు అంతరించిపోవడంతో పొనికి చెట్లు కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో పొనికి కర్రకు బదులు ప్లాస్టర్ఆఫ్ ప్యారిస్ను వినియోగిస్తున్నారు.
రెండు రకాల ప్రతిమలు..
నకాశి కళాఖండాలు రెండు రకాలు. ఒకటి సహజమైన రంగులు వినియోగించి వేసే చిత్రాలు, రెండోది కర్రతో బొమ్మల తయారీ. జగిత్యాలలోని కళాకారులు మొదట రెండు రకాలుగా బొమ్మలను రూపొందించేవారు. అయితే, ప్రస్తుతం మాత్రం చెక్కపై బొమ్మలు తయారు చేస్తున్నారు. అయితే. కొంతమేర మానవ ప్రధానమైన చిత్రాలు కాకుండా, ఇతర చిత్రాలను మాత్రం వేస్తున్నారు..
గ్రామ దేవాలయాల్లో చిత్రాలు…
నిర్మల్, చేర్యాలలోని కళాకారులు ఇతిహాసాలు, చారిత్రక అంశాల ఆధారంగా చిత్రాలు వేస్తూ ఉంటారు. జగిత్యాల నకాశి కళాకారులు క్రమేణా ఈ పద్ధతిని మార్చుకున్నారు. ప్రస్తుతం గ్రామ దేవతలైన పోచమ్మ, మడేలయ్య, మైసమ్మ, కట్ట మైసమ్మ ఆలయాల్లో చిత్రాలను గీస్తున్నారు. పోచమ్మ, మైసమ్మ ఆలయాలపై పెద్దపులి, నాగుపాము, అమ్మతల్లి బొమ్మలను వేస్తున్నారు. అలాగే, అమ్మవారి బలి కార్యక్రమం, ఎదుర్కోళ్లు తదితర ఇతివృత్తాలతో బొమ్మలు వేస్తున్నారు.
గుర్రాలు, చిల్కల బొమ్మలతోనే రాబడి..
ఒకప్పుడు పొనికి కర్రతో అన్ని రకాల బొమ్మలు చేసేవాళ్లం. ఇప్పుడు ఈ కర్ర దొరకడం లేదు. దీంతో కొన్నింటినే రూపొందిస్తున్నం. పీరీల పండుగ సమయంలో పెద్దపులి పుర్రెలు, మిగిలిన రోజుల్లో గుర్రం, పెద్దపులి పెద్దమ్మ, చిల్కల బొమ్మలు చేసుకుంటున్నాం. గ్రామ దేవతల వద్ద గుర్రం, చిల్కల బొమ్మలు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ప్రతిరోజు గుర్రం బొమ్మలు, చిల్కల బొమ్మలకు గిరాకీ ఉంటుంది. రూ.100 – రూ.300 వరకు ఒకొక్క బొమ్మకు వస్తాయి. ఇక బట్టతో చేసే చిల్క బొమ్మలు, తొట్లెలు సైతం తయారు చేస్తాం. మా తరం వరకు ఈ వృత్తిని కొనసాగిస్తాం.
– ధనూరి సత్యనారాయణ, కళాకారుడు
ప్రాణం పోసుకునే బొమ్మలు ఇవే..
జగిత్యాలలో ధనూరి లక్ష్మీనారాయణ, ఆయన ముగ్గురు కొడుకులు శ్రీనివాస్, లింబాద్రి, గోపి, లక్ష్మీనారాయణ సోదరుడి కొడుకు సత్యనారాయణ, సత్తయ్య, ఆయన కొడుకు వినయ్ నకాశి బొమ్మలను తయారు చేస్తూ జీవిస్తున్నారు. మన సంస్కృతిలో భక్తులు పోచమ్మ, నర్సింహస్వామి, మల్లికార్జున స్వామి ఆలయాల్లో గుర్రం బొమ్మలను పెట్టడం ఆనవాయితీ. ఈ విధానమే కళాకారులకు ప్రధాన ఆదాయవనరుగా మారింది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో గుర్రం బొమ్మలతో పాటు పెద్దపుల్లి పెద్దమ్మ, చిలుకల బొమ్మలు సైతం తయారు చేస్తుంటారు. బట్టతో చిలుకల బొమ్మలు, తొట్లె (ఉయ్యాల)లను తయారు చేస్తున్నారు. అలాగే దసరాకు వీరు తయారు చేసే నవరాత్రి ఉత్సవ విగ్రహాలు ఉత్తర తెలంగాణలో పేరుగాంచాయి. దేవుడు ఊరేగే సూర్య వాహనం, చంద్రప్రభ, హన్మంత, గజ, హంస ఇలా తొమ్మిది రోజుల పాటు స్వామివారు ఊరేగే వాహనాలను తయారు చేస్తున్నారు.
జగిత్యాల బ్రాండ్.. పెద్దపులి పుర్రెల తయారీ..
జగిత్యాల కళాకారులకు కొంత ప్రత్యేకత ఉన్నది. పీరీల పండుగ సందర్భంగా పులివేషగాళ్లు ధరించే పెద్దపులి, సింహం పుర్రెల తయారు చేసే ఏకైక కేంద్రంగా జగిత్యాల నిలుస్తోంది. పెద్దపులి పుర్రె తయారీకి 20 నుంచి 25 రోజులు పడుతుందంటున్నారు కళాకారులు. మొహర్రానికి మూడు నెలల ముందు నుంచే పెద్దపులి పుర్రెల తయారీలో నిమగ్నమవుతారు. ముందుగా మట్టితో పుర్రె ఆకారాన్ని తయారు చేస్తారు. కొద్దిరోజులు ఎండబెట్టిన తర్వాత ఆకృతులపై వచ్చే పగుళ్లను సరి చేసి దానికి చింతపొడి, కట్టెపొడి, బంక పూసి మరికొన్ని రోజులు ఎండ బెడుతారు. పుర్రెలకు పొనికి కట్టెతో చేసిన చెవులను అమరుస్తారు. ఎండిన ఆకృతులకు మూడుసార్లు పసుపు రంగు, మూడుమార్లు ఎరుపు, నలుపు రంగులు పూసి, పెద్దపులి పుర్రెలను తయారు చేస్తారు. ఒకేసారి 50 నుంచి 100 పుర్రెల తయారీ మొదలు పెడుతామంటున్నారు. ఒక్కోదానికి రూ.1200 – రూ.1400 తీసుకుంటామంటున్నారు. పెద్దపులి పుర్రెల తయారీ అత్యంత కఠినమైందని, రాష్ట్రంలో జగిత్యాలలో తస్ప ఎక్కడా తయారు కావని పేర్కొంటున్నారు.
తరతరాలుగా ఇదే వృత్తి..
తరతరాలుగా.. మా తాతముత్తాతల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం. నా ముగ్గురు కొడుకులు, మా అన్న కొడుకులు ఇదే కళను నమ్ముకున్నారు. అయితే పూర్వపు కాలంలో కళాకారులకు మంచి గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు ఆదరణ తగ్గింది. చాలా మంది కళను వదిలి ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. అయితే మేం మాత్రం ఇంకా చేస్తూనే ఉన్నాం. అయితే పొనికి చెట్లు లేకపోవడంతో కర్రలతో బొమ్మలు చేయడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగిస్తున్నాం. భవిష్యత్తులో నకాశి వృత్తి అంతరించే ప్రమాదం ఉన్నది. కళను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– ధనూరి లక్ష్మీనారాయణ, నకాశి కళాకారుడు