తలాపున గోదావరి పారినా.. పైన అతి పెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ఉన్నా.. ఆనాడు ఉమ్మడి జిల్లా ఎడారిని తలపించింది. సిరులు కురిపించే భూములున్నా.. సాగునీటి వసతి లేక పల్లేరు మొలిచింది. పచ్చని పంటలతో కళకళ లాడాల్సిన ఆ భూముల్లో దుబ్బలేచింది. ఎకరాల కొద్ది ఉన్నా ఎవుసం చేసే పరిస్థితులు లేక ఎంతో మంది రైతులు కన్నతల్లిలాంటి పల్లెలను విడిచి గల్ఫ్ బాట పట్టాల్సి వచ్చింది. మరెంతో మంది అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటే పోతే 2014కు ముందు.. కరీంనగర్ పూర్వ జిల్లా చరిత్ర ఒక కన్నీటి సంద్రమే. ఏ గడపనూ కదిలించినా కన్నీటి గాథలే.
తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆనాటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ సంకల్పబలంతో ఎవుసం పండుగలా మారింది. కేవలంలో మూడేళ్ల స్వల్పవ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ముఖచిత్రం మారిపోయింది. సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, పంట పెట్టుబడికి రైతు బంధు ఇవ్వడంతో సాగు విస్తీర్ణం లక్షలాది ఎకరాలకు చేరింది. అందులోనూ వరి సాగు ప్రతి జిల్లాలోనూ రెండు వందల శాతానికిపైగా పెరిగింది. నాడు దుబ్బరేగిన భూముల్లో నేడు పసిడి పంటలు పండుతుండగా, భూముల ధరలకు రెక్కలొచ్చి ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరా 25లక్షలపైనే పలుకుతున్నది. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో తొమ్మిదేళ్ల కిత్రం బాటలు వేసిన సీఎం కేసీఆర్, అనతి కాలంలో ఆచరణలో చేసి చూపించారు. ఇటు పంటలు, అటు భూముల విలువ పెరగడం వల్ల తాము కోటీశ్వరులమే అంటూ అన్నదాతలు సగర్వంగా చెప్పుకునే పరిస్థితిని తెచ్చారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవం నిర్వహిస్తుండగా, అందుకు జిల్లాల్లో సర్వం సిద్ధం చేశారు.
కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకె ళ్తు న్నారు. నాడు ఉద్యమనేతగా అన్నదాతల గోసను కండ్లారా చూసి న ఆయన, స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మా ర్చారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు, పథకాలకు శ్రీకారం చుట్టి, రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమా, 24గంటల కరెంట్ ఇలా 30కిపైగా పథకాలు అమలు చేస్తున్నారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలకు పునర్జీవం జీవం పోశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలోనే పూర్తి చేసి, బీడు భూములకు గోదావరి జలాలను పరుగులు పెట్టించారు. ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చి ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం చూపా రు. ఇలా సీఎం కేసీఆర్ ప్రతి క్షణం రైతుల సంక్షేమం కోసమే తపిస్తూ, వినూత్న పథకాలతో వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో పరుగెత్తిస్తున్నారు. రైతుల తలరాతలు మార్చి వారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు.
జిల్లా మీదుగా గోదావరి వెళ్తున్నా నాడు ప్రయోజనం లేదు. ఏటా వందలాది టీఎంసీలు సముద్రం పాలవుతున్నా వాటిని సాగుకు మళ్లించాలన్న ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి, మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశారు. గోదావరిపై లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ బరాజులను నిర్మించి, వంద కిలోమీటర్లకుపైగా గోదావరిని జలధారగా మార్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వరదకాలువను నాలుగు రిజర్వాయర్లుగా మార్చడమే కాకుండా, మధ్యమానేరు (ఎస్సారార్) నుంచి ఎగువమానేరు వరకు.. అలాగే దిగువమానేరు ప్రాజెక్టు ద్వారా కాకతీయ కాలువ చివరి ఆయకట్టు వరకు.. ఉమ్మడి జిల్లాలోని ప్రతి చెరువునూ కుంటనూ నింపారు. తద్వారా భూగర్భజలాలు పెరగడమే కాదు, సాగునీటి గోస తీరింది. సాగునీటి రంగంలో ఉమ్మడి జిల్లా ముఖ చిత్రం పూర్తిగా మారింది. ఇప్పుడు శ్రీరాజరాజేశ్వర జలాశయం వాటర్ హబ్లా మారింది.
నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి నాడు ఏడు గంటల విద్యుత్ను కేటాయించినా, కనీసం మూడు నాలుగు గంటలు కూడా సరిగ్గా ఇచ్చేవి కాదు. పంటలు ఎండి పోతున్నా పట్టించుకునేవారు కాదు. కానీ, స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర సర్కారు సాగుకు 24 గంటలపాటు ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో రైతులకు అవస్థలు తప్పాయి. రోజులో ఎప్పుడంటే అప్పుడు వెళ్లి నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగు విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరిగింది. తెలంగాణలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో 3.80 లక్షల పైచిలుకు కనెక్షన్లు ఉండగా, చెరువులు, కుంటలు, కాలువలు, పొలాలు వెంట కాళేశ్వరజలాలు ఎగిసి పడుంతుండడంతో భూగర్భజలాలు భారీగా పెరిగి నిరంతరం బోర్లు నడుస్తున్నాయి.
సిరిసిల్ల జిల్లా 2014కు ముందు చూస్తే.. అన్నదాతల పరిస్థితి దుర్భరంగా ఉండేది. చుక్కనీటికీ గోస పడాల్సిన వచ్చేది. వానకా లంలోనే పంటలు వదిలేయాల్సిన దుస్థితి ఉండేది. ఇక యాసంగి సీజన్లో అయితే భూములను బీళ్లుగా ఉంచేది. ఎండకాలం తాగునీటికీ గోస పడేది. కానీ, స్వరాష్ట్రంలో ఈ పరిస్థితి మారింది. శ్రీరాజరాజేశ్వర జలాశయం వాటర్హబ్లా మారడం, కాళేశ్వరం జలాలు పరుగులు తీయడంతో ఎగువమానేరుతోపాటు చెరువులు, కుంటలు మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకాయి. భూగర్భ జలాలు అమాంతం పెరిగాయి. ఏకంగా ఆరు మీటర్లుపైకి చేరాయి. భూగర్భజలాలు పెరిగిన తీరు సాగునీటిరంగం వంటి అనేక అంశాల్లో ఐఏఎస్లకే ఒక పాఠ్యాంశంగా మారడం, సీఎం కేసీఆర్ దూరదృష్టి, అంకిత భావానికి నిదర్శనం.
సాగునీటి రంగ ముఖచిత్రం పూర్తిగా మారడంతో భూముల ధరలకు రెక్కొలొచ్చాయి. పుష్కలంగా జలాలు రావడం, రైతుబంధు ఇవ్వడంతో అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరాకు తక్కువలో తక్కువగా 25లక్షలకు పైనే పలుకుతున్నది. 2014కు ముందు చూస్తే.. ఈ భూముల ధరలు రెండు నుంచి మూడు లక్షలు ఉండేవి. ఇప్పడైతే రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఎకరాకు 40 లక్షల నుంచి 50 లక్షలు పలుకుతున్నాయి. ఒక్క మాటలోచెప్పాలంటే.. మూడు నాలుగు ఎకరాలున్న ప్రతి రైతూ స్వరాష్ట్రంలో కోటీశ్వరుడిగా మారడాన్ని చెప్పవచ్చు. మరోవైపు కౌలు ధరలు కూడా పెరిగాయి. స్వరాష్ట్రంలో సాగునీటి రంగం అన్నదాతలకు పండుగైంది చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
జగిత్యాలకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక గ్రామం పొలాస. ఇక్కడ వ్యవసాయమే ప్రధానం ఆధారం. ఈ గ్రామంలో దాదాపు 5వేల ఎకరాలకుపైగా సాగు భూమి ఉన్నది. పొలాసను ఒక క్లస్టర్గా గుర్తించి ఇక్కడ ఒక ఏఈవోను నియమించారు. ఇటీవలే క్లస్టర్ పరిధిలో రైతువేదికను సైతం ఏర్పాటు చేశారు. పొలాసలో 4333 ఎకరాల్లో వరి, 148 ఎకరాల్లో మక్క, 28 ఎకరాల్లో పల్లి, 362 ఎకరాల్లో నువ్వు, 6 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఈ గ్రామ పరిధిలో ఉన్న రైతులందరికీ ఏఈవో మాధవ్ నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. గ్రామంలోని నేలలకు అనువుగా ఎలాంటి పంటలు సాగు చేయాలన్న విషయాన్ని వివరిస్తున్నాడు.
అలాగే పంట కాలంలో ఎప్పుడు ఎలాంటి సస్య రక్షణ చేపట్టాలన్న విషయంలోనూ సలహాలు సూచనలు అందిస్తున్నాడు. దీంతోపాటు పంటలకు నీటి యాజమాన్యం ఎంత ఉండాలన్న వివరాలను కూడా తెలియజేస్తున్నాడు. గ్రామంలో అర్హులైన రైతులందరినీ ఎడ్యుకేట్ చేసి, వారికి రైతు బంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి, ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాడు.
ధాన్యం కొనుగోళ్లలోనూ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కానీ, రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అప్పుడు మండలానికి ఒక్కరూ కూడా ఉండేది కాదు. ఫలితంగా రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలు అందేది కాదు. అందుకే రాష్ట్ర సర్కారు రైతులకు సాగునీరు, విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, ఎరువులతోపాటు సేద్యంలో మెళకువల గురించి అవగాహన కల్పించినప్పుడే పంట బాగుంటుందని గుర్తించి, ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసింది. ఈ క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించింది. ఈ నిర్ణయంతో జగిత్యాల జిల్లాలో సేద్య రంగంలో మంచి మార్పులు వచ్చాయి. 18 మండలాల పరిధిలో 71 క్లస్టర్లను ఏర్పాటు చేసి, 71 మంది ఏఈవోలను నియమించింది. నాడు 2014లో 13 మంది ఏఈవోలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 71కు చేరింది. ఇప్పుడు ఏడాది పొడవునా రైతులకు సేద్యరంగంలో సలహాలు, సూచనలు అందుతూనే ఉన్నాయి.
..పక్క చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు ముస్కుల కిష్టారెడ్డి. చిగురుమామిడి మండలం సీతారాంపూర్లో తనకున్న 15 ఎకరాల భూమిలో నాలుగెకరాలను 2006లో ఎకరం 14 వేల చొప్పున అమ్ముకున్నడు. మిగిలిన భూమిని ఉంచుకున్నడు. సాగునీరు లేక వానకాలంలోనే నాలుగు, ఎక్కువకు ఎక్కువ ఐదెకరాలు సాగు చేసుకునేటోడు. వేసిన పంటలో సగానికిపైగా ఎండగా మిగిలింది చేతికి వచ్చేది. సాగునీరు లేక అప్పట్లో భూములకు విలువ ఉండేది కాదు. తన నాలుగెకరాలు 14 వేలకు ఎకరం చొప్పున అమ్మినప్పుడు ఏ మాత్రం బాధ పడలేదని, ఇపుడు మాత్రం చాలా బాధడుతున్నానని కిష్టారెడ్డి చెబుతున్నడు.
ఎందుకంటే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ ప్యాకేజీ-3 ద్వారా 2020 నుంచి కిష్టారెడ్డి గ్రామం సీతారాంపూర్కు కాళేశ్వరం జలాలు వస్తున్నాయి. ఇంకే ముంది ఈ ప్రాంతంలోని చిగురుమామిడి, రేకొండ, పీచుపల్లి, ముల్కనూర్, బొమ్మనపల్లి, ఇందుర్తి, ఓగులాపూర్, రామంచ తదితర గ్రామాల్లో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎకరం ధర 30 లక్షల నుంచి 40లక్షల దాకా పలుకుతున్నది. తాను 2006లో అమ్మిన నాలుగు ఎకరాల భూమికి ఇప్పుడు 40 లక్షలు ఇస్తామన్నా ఇవ్వడం లేదని కిష్టారెడ్డి చెబుతున్నడు. సీతారాంపూర్ గ్రామం మీదుగా వెళ్లే కరీంనగర్, హుస్నాబాద్ ప్రధాన రోడ్డులో మొదటి బిట్టు ధర ఎకరానికి కోటి పలుకుతున్నది.
ఈ గ్రామంలో లోపలి భూములకే ఇపుడు 50లక్షల 60లక్షలు చెబుతున్నారంటే కాళేశ్వరం జలాలతో భూములకు ఎంత విలువ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పంటలు పుష్కలంగా పండుతున్న కారణంగా కౌలు ధరలు కూడా పెరిగిపోయాయి. ఏడాది కింద ఎకరానికి 5 వేల నుంచి 6 వేలు ఉన్న కౌలు ఇప్పుడు 20వేల నుంచి 25 వేలు పలుకుతున్నది. హుజూరాబాద్ మండలం నుంచి వచ్చిన కొందరు రైతులు సీతారాంపూర్లో కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఒకప్పుడు నీళ్లు లేక విచ్చల విడిగా వేసిన బోర్లు, తవ్వించిన బావుల్లో ఇపుడు పుష్కలమైన నీళ్లు ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో 25 నుంచి 30 మీటర్ల లోతుకు ఏ బావి తక్కువ ఉండదు. అపుడు చూద్దామన్నా చుక్క నీరుండని ఆ బావుల్లో ఇప్పుడు చేయి బావిలోకి చాస్తే తాకే స్థితిలో ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లు చేసిన మేలుతో రెండేళ్లుగా ఈ ప్రాంత రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
నాది పాలకుర్తి గ్రామం. ఊళ్లే నాకు నాలుగెకరాల భూమి ఉంది. రెండెకరాలు వరి, మరో రెండెకరాలల్ల పత్తి సాగు చేస్తున్న. గతంల పెట్టుబడులు ఎల్లక ఏటా పెద్దపల్లిలోనే ఫెర్టిలైజర్ దుకానంల ఎరువులు, పురుగు మందులు ఉద్దెర మీద తెచ్చుకునేటోన్ని. పంట చేతికచ్చినంక లెక్క లేదు పత్రం లేదు. వాళ్లు చెప్పిందే ధర. వాళ్లు చెప్పిందే ఖాతాగా కింద కట్టేది. ఇప్పుడా బాధ మాకు లేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చలవతో మాకు మంచిరోజులు వచ్చాయి. రైతుబంధు కింద ఎకరానికి రూ.5వేలు పెట్టుబడి సాయం ఇస్తండు. నాకు పసలుకు రూ.20వేలు వస్తున్నయ్. ఇప్పుడు నాకు నచ్చిన దుకాణంల, ఎక్కడ తక్కువకు ఇస్తే అక్కడ ఎరువులు కొనుక్కుంటున్న. ఏ రంది లేకుంట రెండు పంటలు సాగు చేసుకుంటున్న.
– మాదాసు భూమయ్య, రైతు (పాలకుర్తి)
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ప్రతి క్లస్టర్లో వేడుకలు నిర్వహిస్తున్నాం. పెరిగిన సాగు, దిగుబడి, రైతులకు అందుతున్న పథకాల గురించి ప్రతి చర్చిస్తాం. సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సందేశాలను చదివి వినిపిస్తాం. ప్రతి క్లస్టర్లో వెయ్యి మంది రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణకు సంబంధించి పాటలు, ఆటలతో ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ద్వారా గ్రామాల నుంచి రైతు వేదికల వరకు ర్యాలీలు తీస్తాం. ఏఈవోలు, ఆర్బీఎస్ కన్వీనర్లు, సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశాం.
– వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో (కరీంనగర్)
మాది రుద్రంగి. మాకు రెండెకరాల 33 గుంటల భూమి ఉన్నది. నాభర్త శీలం రాములు 18 నెల్ల కింద పొలంలో పని చేస్తుండగా కరెంట్ షాకచ్చి చనిపోయిండు. నా బిడ్డ శ్రేన్య (15) పదో తరగతి, కొడుకు మనిదీప్(13) ఏడో తరగతి చదువుతున్నరు. పెద్ద దిక్కు కోల్పోయిన నేను పిల్లలను ఎట్ల పెద్ద చేసుడన్న రంది పడ్డ. ఎంపీపీ గంగం స్వరూపరాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య మా ఇంటికొచ్చి ‘కేసీఆర్ సార్ ఉండంగా రందీ ఎందుకు పడుతున్నవ్. రైతు బీమా 5లక్షలు వస్తద’ని చెప్పిన్రు. నాలుగు రోజులకు వ్యవసాయ శాఖ సార్లతో మా ఇంటికచ్చి బీమా ప్రోసిడింగ్ కాపీ ఇచ్చిన్రు. రెండు రోజులకు బ్యాంకుకు పోతే ఖాత పైసలు పడ్డయని బ్యాంకోళ్లు చెప్పిన్రు. సర్కారు ఇచ్చిన బీమా పైసలను నాబిడ్డ పెండ్లి కోసం ఆమె పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసిన. నేను పొలం పనిచేసుకుంటున్న. వచ్చిన వడ్ల పైసలతో పొట్టకు ఎల్ల దీత్తున్న. రైతు బీమాతోని మేం ధీమాగున్నం. సీఎం సారు పెద్దన్నలా ఆదుకున్నడు. అందరిలో మంచిగా బతికేందుకు మంచి ధైర్యమిచ్చిండు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
-శీలం పద్మ, రుద్రంగి
రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం నిర్వహిస్తారు. ప్రాంగణాల్లో, హాలులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, పథకాల విశిష్టతను తెలియజేసేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉంటాయి. రైతుబంధు సమితి నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, హార్టికల్చర్, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరిస్తారు. అనంతరం రైతులందరితో సహపంక్తి భోజనం ఉంటుంది. వ్యవసాయ కళాశాలల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.