మానకొండూర్, అక్టోబర్ 6: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ ఉదయం అల్పాహారాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకం బడి పిల్లల భవితకు వరమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ పిల్లల చదువుతోపాటు వారి శ్రేయస్సు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, వర్క్బుక్స్, నోట్బుక్స్ అందజేస్తున్న తెలంగాణ సర్కార్ ఇప్పుడు మానవీయ పథకమైన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’కు శ్రీకారం చుట్టిందన్నారు.
విద్యార్థుల్లో పౌష్ఠికాహార లోపాన్ని నిర్మూలించి, డ్రాపౌట్స్ సమస్య తగ్గించడంతోపాటు పిల్లల సామర్థ్యాన్ని మెరుగు పర్చడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడుతాయని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బ్రేక్ఫాస్ట్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, మానకొండూర్ సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, జడ్పీ సీఈవో పవన్కుమార్, ఐసీడీఎస్ సీడీపీవో సబిత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఇన్చార్జి ఎంపీడీవో రాజేశ్వర్రావు, బీఅర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.