స్వశక్తి మహిళలకు రుణాలు మంజూరు చేస్తూ.. ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా నిలుస్తున్న సర్కారు ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. సురక్ష-బీ పేరిట బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. స్వశక్తి సంఘాల సభ్యురాలు ఏడాదికి 547 ప్రీమియం చెల్లిస్తే భార్యాభర్తలకు ఈ స్కీం వర్తిస్తుంది. సభ్యురాలు మాత్రమే చేయించుకోవాలనుకుంటే 230 కడితే సరిపోతుంది. ఈ పథకంపై ఊరూరా స్త్రీనిధి యంత్రాంగం అవగాహన కల్పిస్తుండగా సర్వత్రా హర్షంవ్యక్తమవుతున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 25 : తెలంగాణ ప్రభుత్వం స్వశక్తి సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. స్త్రీ నిధి, పొదుపు రుణాలు అందిస్తూ ఆర్థిక భరోసానిస్తున్నది. ఈ క్రమంలో సభ్యులకు ప్రమాదాలు, వారి కుటుంబాల్లో విపత్కర పరిణామాలు చోటు చేసుకున్నపుడు ఆదుకునేందుకు సురక్ష బీ పథకం ద్వారా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. సంఘాల్లోని సభ్యులతో పాటు వారి భర్తలకు కూడా బీమా చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో రుణాలు తీసుకున్న సభ్యులకు మాత్రమే వర్తించే ఈ పథకంలో పలు మార్పు చేర్పులు చేసింది. సభ్యురాలికి మాత్రమే బీమా కావాలనుకుంటే ఏడాదికి 230 చెల్లించాలి, భార్యాభర్తలకు ఇద్దరికి అయితే అదనంగా మరో 317, మొత్తంగా 547 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పాటు బీమా వర్తించేలా మొదటి రకం ప్లాన్, 1641 చెల్లిస్తే మూడేండ్ల పాటు బీమా అమలులో ఉండేలా రెండో రకం ప్లాను రూపొందించి అమల్లోకి తెస్తున్నది.
బీమా తీసుకున్న సభ్యురాలు లేదా ఆమె భర్త అకాల మరణానికి గురైతే ఇచ్చే లక్ష పరిహారంలో అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా 5 వేలు, అనంతరం మరో 95 వేలు అందజేస్తారు. ఈ స్కీంపై సంఘాల్లోని మహిళలకు అంతగా అవగాహన లేకపోవడంతో స్త్రీనిధి యంత్రాంగం రంగంలోకి దిగింది. గ్రామాల్లో వీవోలు, మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నది. కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల్లో 13,702 సంఘాలుండగా, వీటిలో 1,47,989 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా సురక్ష-బీ పథకంలో చేరేందుకు అర్హులు కాగా, ఇప్పటికే మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పలు దఫాలుగా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పొదుపు సంఘాల్లోని మహిళలు సురక్ష-బీ బీమా పథకంలో చేరితే వారి కుటుంబాలకు రక్షణ కవచంగా ఉం టుంది. ఏదేని పరిస్థితుల్లో కుటుంబ పెద్దలు మరణిస్తే ఈ స్కీం ద్వారా భరోసా లభిస్తుంది. మహిళా సంఘాల్లో సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్త్రీ నిధి అధికారులు ఈ పథకం గురించి సమగ్రంగా అవగాహన కల్పిస్తున్నారు. -ఎల్ శ్రీలత, డీఆర్డీవో (కరీంనగర్)