Pending DA | సారంగాపూర్, ఫిబ్రవరి 23 : తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పాఠశాల సముదాయ సమావేశంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం సకాలంలో వీటిని చెల్లించకుండా వాయిదాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వల్ల వాయిదాల ద్వారా రావాలసిన మొత్తం సుమారు రూ.1200 కోట్లకు చేరడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతీ నెల విడుదల చేస్తున్న రూ.700 కోట్ల నిధులలో భాగంగా ఫిబ్రవరి నెల తప్పనిసరిగా సీపీఎస్ బకాయిల కోసం కేటాయించాలని కోరారు. గత ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్, శ్రీనివాస్, శంకర్, శ్రీనివాస్, ప్రవీణ్, ఉమేష్, మురళి, మునీందర్, రాజు, శ్రవణ్, నవీన్, వసంత, రేఖ, హేమలత, శ్రీలత, వాసవి తదితరులు పాల్గొన్నారు.