టీఆర్ఎస్ తరఫున రెండు ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలు చేసిన టీ భానుప్రసాద్, ఎల్ రమణ
మంత్రి కొప్పుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ హాజరు
పాల్గొన్న ఎంపీ వెంకటేశ్నేతకాని, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు
రెండు స్థానాల్లో గెలుపు మాదే : ఈశ్వర్
కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ పూర్వ జిల్లా పరిధిలో రెండు స్థానాలు ఉండగా, పెద్దపల్లి జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్ రావు, జగిత్యాలకు చెందిన మాజీ మంత్రి ఎల్ రమణ తమ నామినేషన్ పత్రాలు కరీంనగర్లో సమర్పించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
స్థానిక సంస్థల కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు టీ భానుప్రసాదరావు, ఎల్ రమణ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, పాడి కౌశిక్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నాలుగు జిల్లాల్లో జడ్పీ, మండల పరిషత్ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేల సమక్షంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకున్నారు. గెలుపు టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులు భానుప్రసాద్ రావు, రమణ తమ నామినేషన్ పత్రాలను అక్కడే పూరించారు. ఆ తర్వాత అభ్యర్థులు మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి భారీ వాహన ర్యాలీతో కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సీహెచ్ రమేశ్బాబు, వొడితల సతీశ్కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, జడ్పీ అధ్యక్షులు కనుమల్ల విజయ, పుట్ట మధూకర్, దావ వసంత, సిద్దిపేట జడ్పీ ఉపాధ్యక్షులు ఆర్ రాజిరెడ్డి, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
గెలుపు మాదే : మంత్రి ఈశ్వర్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ రెండు స్థానాలకు భానుప్రసాద్ రావు, ఎల్ రమణను అభ్యర్థులుగా ప్రకటించారని చెప్పారు. వీరి గెలుపు కోసం పక్కా ప్రణాళికా ప్రకారంగా ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అందరూ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారని, తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ప్రజాప్రతినిధి ఉన్నారని చెప్పారు. పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించామన్నారు. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో 1,326 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, అందులో 996 మంది టీఆర్ఎస్కు చెందిన వారేనని అన్నారు. 21ఏండ్లుగా టీఆర్ఎస్ ఎన్నో ఉద్యమాలు చేసిందని, ఇలాంటి ఎన్నో ఎన్నికలను ఎదుర్కొని విజయాలను సాధించిందన్నారు. రాష్ట్రంలోని 33జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో 95 శాతం ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ నుంచే గెలుపొందినవాళ్లు ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.
క్యాంపులకు తరలిన ప్రజాప్రతినిధులు..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ మంగళవారం సాయంత్రం ప్రత్యేక బస్సుల్లో క్యాంపునకు తరలివెళ్లారు. అంతకుముందు స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఎమ్మెల్యేల సమక్షంలో నియోజకవర్గాల వారీగా అంతర్గత సమావేశాలు నిర్వహించుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకోవాలని విన్నవించారు. కాగా ఈరోజు మరోసారి సమావేశాలు నిర్వహించుకుని, భోజనాలు కూడా ఇక్కడే చేసి ప్రత్యేక బస్సుల్లో క్యాంపులకు తరలివెళ్లారు.