కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు
పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి గంగుల కుటుంబ సభ్యులు
నేడు కల్యాణోత్సవానికి తాళ్లపాక హరినారాయణాచార్యుల రాక
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 9: జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో పంచమ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందు లో భాగంగా బుధవారం నిర్వహించిన ఎదుర్కోలుత్సవం కనుల పండువగా సాగింది. అంతకు ముందు సర్వాలంకార భూషితుడైన స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగగా, భక్తులు నీరాజనాలు పలికారు. పద్మశాలీ సమాజం ఆధ్వర్యంలో పద్మావతీదేవి, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే 50వ డివిజన్, గణేశ్నగర్ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం తరఫున శ్రీవారి భక్త సమాజం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సారె అందజేశారు.
భక్తజన నీరాజనం..
కల్యాణోత్సవంలో భాగంగా జ్యోతినగర్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కల్యాణ పట్టు వస్త్రాలు, సుగంధ శోభిత ద్రవ్యాలను మంత్రి కుటుంబసభ్యులు లాంఛనాలుగా సమర్పించారు. అనంతరం అశ్వ, గజ వాహనాల్లో ఉత్సవ మూ ర్తులను మంగళవాయిద్యాలు, హారతులు, కోలాట, శాస్త్రీయ నృత్యాలు, భజనల నడుమ శోభాయాత్రగా ఆలయానికి ఊరేగింపుగా తీసుకురాగా, భక్తులు తమ ఇండ్ల ఎదుట మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
టీఈఐఏ రాష్ట్ర కార్యదర్శి గోగుల ప్రసాద్ నేతృత్వంలో ఉదయం శ్రీవేంకటేశ్వర, శ్రీరాధాకృష్ణ భజన మండళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమాలు అలరించాయి. గీతా భక్త సమాజం, ఉషా బృందం పారాయణ కార్యక్రమం భక్తిభావాన్ని చాటింది. సాయంత్రం రతన్కుమార్ శిష్యబృందం ప్రదర్శించిన పేరిణిలాస్యం, ఆలయ నృత్యం, మాధవి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, సుధీర్రావు బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. స్వరాలయ బృందం, పావని బృందం, మధు, లక్ష్మీరెడ్డి, సంధ్య ఆలపించిన భక్తి కీర్తనలు, మోహనస్వామి, మహేందర్రాజు, శ్రీనివాస్ పాడిన ఘంటసాల భక్తి గీతాలు అలరించాయి.
నేడు కల్యాణం..
పంచమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం యాగశాలలో నిత్యపూర్ణాహుతి సమర్పిస్తారు. అనంతరం తాళ్లపాక అన్నమయ్య 12వ తరం వారసుడు తాళ్లపాక హరినారాయణాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం గరుడవాహన సేవ, తీర్థప్రసాదగోష్ఠి ఉంటాయి. శ్రీవారి పక్షాన మంత్రి కుటుంబసభ్యులు వ్యవహరించనుండగా, కన్యాదాతగా తాళ్లపాక హరినారాయణాచార్యులు హాజరవుతారు.