చిరుపొట్ట దశలో ఉన్న వరి పంటను సుడి దోమ కాటేస్తున్నది. వర్షాలతోపాటు చల్లటి వాతావరణం, పురుగు మందులను విచక్షణ రహితంగా పిచికారీ చేయడంతో విజృంభిస్తున్నది. సుడిబారుతున్న పొలాలను చూసి రైతాంగం ఆందోళన చెందుతున్నది. అయితే నివారణే మంచి మార్గమని, తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే నష్టాన్ని గణనీయంగా నివారించవచ్చని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తెల్ల వీపు మచ్చ దోమ
ఇవి గోధుమరంగు దోమ కంటే చిన్నవిగా ఉంటాయి. తెల్ల పురుగుల ముందు రెక్కలు కలిసే చోట చివర నల్లటి మచ్చ, రెక్కల ముందు భాగంలో తెల్లటి మచ్చ ఉంటుంది. ఇవి వరి దుబ్బుల మొదళ్ల దగ్గర ఆకు తొడిమ లోపలి కణజాలంలో 6-8 గుడ్లను పెడతాయి. ఈ గుడ్లు విడివిడిగా ఉంటాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉండి, 8-28 రోజుల్లో పెద్దవిగా మారుతాయి. ఈ దోమ వరి పిలకలు వేసే దశలో ఆశిస్తుంది.
గోధుమ రంగు దోమ
ఆడ దోమలు మగ వాటికంటే పెద్దవిగా ఉంటాయి. సుడి దోమలు రెక్కలున్నవి లేనివి ఉంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రెక్కలున్న దోమలు వృద్ధి చెందుతాయి. తల్లిదోమ 300-500 గుడ్లను ఆకు తొడిమలో గాని లేదా, మధ్య ఈనె లో గాని పెడుతుంది. 2 నుంచి 12 గుడ్లను ఒకదానిపక్కన ఒకటిపెట్టి, వాటి చివరలను ఒకదానితో ఒకటి కలిపి గుంపుగా చేస్తుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పెద్దవిగా మారుతాయి. ఇవి ముఖ్యంగా వరి పొట్ట దశలో ఆశిస్తాయి.
నష్టపరిచే విధానం
రెక్కలున్న సుడిదోమలు పిలకలు వేసే దశలో వరిని ఆశిస్తాయి. ఇవి మూడు నాలుగు వారాల్లో రెక్కలు లేని దోమల్ని (మొదటి సంతతి)ఉత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత ఇవి రెండో సంతతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ దశలో పిల్ల తల్లి పురుగులు వరిని తీవ్రంగా నష్ట పరుస్తాయి. మనం ఈ దశలోనే పురుగుల్ని గుర్తించగలుగుతాం. ఈ సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే రెక్కలున్న మూడో రకం పురుగులు వృద్ధి చెంది పంటకు తీవ్ర నష్టం చేస్తాయి. ఈ సుడి దోమలు వరి దుబ్బుల మొదళ్లను ఆశించి నష్ట పరుస్తాయి. దీంతో మొక్కలు గిడసబారి, పోషకాలు అందక పసుపురంగులోకి మారి సుడులు సుడులుగా ఎండిపోతుంది. వీటి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. సుడి దోమలు ఆకులపై విసర్జించే తేనేలాంటి జిగురు పదార్థం వలన మసి తెగులు సోకుతుంది. సుడి దోమలు గ్రాసిస్టంట్ వంటి వైరస్ తెగుళ్లు కూడా వ్యాప్తి చేస్తాయి.
వరి పైరులో సుడి దోమ విజృంభిస్తున్నది. పొట్ట దశలో ఉన్న పంటను ఆశిస్తుండడంతో అపార నష్టం సంభవించే ముప్పు ఉన్నది. సస్యరక్షణ చర్యలు చేపడితే వ్యాధి బారి నుంచి పంటను కాపాడుకునే అవకాశముంటుంది. అన్నదాతలు అప్రమత్తమై పొలాల్లో కాలిబాటలు తీయాలని కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు దేవ అనిల్, సిద్ధి శ్రీధర్ సూచిస్తున్నారు. తగిన మోతాదులో పురుగుల మందులను పిచికారీ చేయాలని చెబుతున్నారు.
– కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 13
అనుకూల పరిస్థితులు
నివారణ ఇలా..