అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకుడి షష్ఠ్యమ బ్రహ్మోత్సవాలకు వేళయింది. నగరంలోని మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర దేవాలయంలో వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. సోమవారం అధ్యయనోత్సవంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, పది రోజులపాటు నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరియనున్నది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఆలయ ఈవో ఉడుతల వెంకన్న, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, ఇప్పటికే వేడుకల కోసం ఆలయ పరిసర ప్రాంగణమంతా సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలు, స్వామి వారి కటౌట్లు, స్వాగత తోరణాలతో ప్రధాన దారులు, కూడళ్లను ముస్తాబు చేశారు.
కరీంనగర్ ప్రధాన మార్కెట్ రోడ్డులో నిత్య పూజలందుకుంటున్న వేంకటేశ్వరుడి దేవస్థానానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఏక శిలపై వెలసిన ఈ ఆలయంలోని విగ్రహానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ప్రస్తుత వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రదేశమంతా ఒకప్పుడు అటవీ ప్రాంతం. ఆనాడు కరీంనగర్ ఎలగందుల ఖిల్లాగా బాసిల్లింది. అటవీ ప్రాంతంలో రాతిపై స్వామివారి మూల విరాట్టు స్వయంగా వెలిసినట్లుగా తెలుస్తున్నది. ఆ సమయంలో ఉన్న ముస్లిం అధికారికి స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగిందని, పంచరాత్ర ఆగమం ప్రకారం ఆలయ నిర్మాణం జరిపించినట్లు పట్టణ పెద్దలు చెబుతున్నారు. కాలక్రమేణా గుడి ప్రాశస్త్యం పెరుగుతూ వచ్చింది. 1974లో ఆలయ ఆవరణలో త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్స్వామి చేతుల మీదుగా శ్రీ విష్ణుమూర్తి స్వామి వేద స్తూప ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత 1990లో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ముఖ మండపం, మధ్య మండలం, గర్భాలయం, గరుడాలయాన్ని నిర్మించారు. అలాగే ఆలయానికి ఉత్తరం వైపున నవగ్రహ మండపం నిర్మించారు. నైరుతి మూల అధికంగా ఉండడంతో గణపతి విగ్రహం ప్రతిష్ఠించారు. 1996లో అప్పటి చైర్మన్ చకిలం ఆగయ్య, అధికారులు కలిసి తొమ్మిది రోజులు పూజలు చేసి చక్ర ధ్వజస్తంభం, గరుడ, నవగ్రహ, గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనుబంధంగా లక్ష్మీనారాయణ ఆలయాన్ని నిర్మించారు. నగరం నడిబొడ్డున ఉండడంతో వేంకటేశ్వర కల్యాణం, శ్రీరామనవమి, ఏకాదశి రోజుల్లో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
ఉత్సవాల వివరాలు..
ఎంతో విశిష్టత ఉన్న ఈ బ్రహ్మాండ నాయకుడికి మొదటిసారిగా 2018 ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన రాగా, తర్వాతి నుంచి ఏటా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుతున్నారు. ఈ సారి కూడా రేపటి నుంచే ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. సోమవారం అధ్యయనోత్సవాలు ప్రారంభమై 25న ముగిస్తాయి. 26న సహస్ర కళశాభిషేకం, సహస్ర దీపాలంకరణ, 27న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, సాయంత్రం శేష వాహన సేవ ఉంటుంది. 28న యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 29న అన్నకూటోత్సవం, కల్పవక్ష వాహన సేవ, సాయంత్రం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఎదురోళ్ల ఉత్సవం, 30న శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణుల కల్యాణ మహోత్సవం జరుగనున్నది. సాయంత్రం ‘గరుడ వాహన సేవ’ ఉంటుంది. 31న మంగళవారం హనుమత్ వాహన సేవ, సింహవాహన సేవ ఉంటుంది. ఫిబ్రవరి 1న మహాపూర్ణహుతి, చక్రతీర్థం, వసంతోత్సవం, పుష్పయాగం, ద్వాదశారాధన, ధ్వజారోహణ, ఏకాంతసేవ, ఫిబ్రవరి 2న మార్క్ఫెడ్ మైదానం నుంచి ఆలయం వరకు ‘శోభాయాత్ర’ ఉంటుంది.
అదృష్టంగా భావిస్తున్నా..
వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆరోసారి షష్ఠమ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నా. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నం. ప్రతి రోజూ అన్నప్రసాద వితరణ, భక్తులకు మంచినీరు, షామియానాలు ఏర్పాటు చేయించాం. ఇప్పటికే ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి.
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం
వేంకటేశ్వరస్వామి షష్ఠమ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాలకు దేవాదాయశాఖ తరఫున సేవలందిస్తున్నాం. మంత్రి గంగుల కమలాకర్, పాలకవర్గం సూచనల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రసాద కౌంటర్లు, క్యూలైన్లు, శోభాయాత్ర నిర్వహించే రహదారులు విద్యుద్దీపాలతో అలంకరించాం.
– ఉడుతల వెంకన్న, ఆలయ ఈవో