చొప్పదండి, డిసెంబర్ 3: విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేసి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. మండలంలోని రుక్మాపూర్ సైనిక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జవహర్లాల్ నెహ్రూ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐజాక్ న్యూటన్ సూత్రాల ద్వారానే సైన్స్ వెలుగులోకి వచ్చిందని, న్యూటన్ సూత్రాల ఆధారంగానే రాకెట్ను తయారు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సైన్స్తోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు. దేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుస్థానంలో నిలిపే బాధ్యత నేటి విద్యార్థుల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. గురువులు మార్కుల కోసం కాకుండా సమూల మార్పు కోసం విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉపయోగపడే భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
రుక్మాపూర్ సైనిక్ పాఠశాలలో జిల్లాస్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన రెండోసారి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, విద్యార్థులు అబ్దుల్కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని, ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం సైనిక్ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించిన సైనిక్ పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్లను అభినందించారు. జిల్లా విద్యాధికారి జనార్దన్రావు మాట్లాడుతూ, వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా నుంచి 172 ప్రభుత్వ, 260 ప్రైవేట్ పాఠశాలల నుంచి 900 మంది విద్యార్థులు పాల్గొని 465 ప్రాజెక్ట్లను ప్రదర్శించినట్లు తెలిపారు.
అనంతరం ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీచైర్పర్సన్, కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, సర్పంచులు చిలుక లింగయ్య, పెద్ది శంకర్, సురేశ్, గుంట రవి, లింగంపల్లి లావణ్య, తులసమ్మ, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూప, ఎంఈవో వేణుకుమార్, డీసీఈబీ కార్యదర్శి స్వదేశ్ కుమార్, కోట లక్ష్మారెడ్డి, సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, అకడామిక్ కో-ఆర్డినేటర్ అనంతచార్య, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏనుగుస్వామిరెడ్డి, దీటి మధు, మారం యువరాజు, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ గన్ను శ్రీనివాస్రెడ్డి, నాయకులు బందారపు అజయ్కుమార్గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, నెరుమట్ల మల్లేశం, గాండ్ల లక్ష్మణ్, సీపెల్లి గంగయ్య, వెంకటేశ్, స్వామి, రాజు, రావన్, మావురం మహేశ్, చోటు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.