మల్యాల, జనవరి 5 : మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని ఎనిమిది నుంచి పది గ్రామాల విద్యార్థులు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4.30 వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే, పిల్లలు ఉదయమే వస్తుండడంతో చాలా వరకు లంచ్ బాక్స్ తెచ్చుకోవడం లేదు. దీంతో ఆకలికి తట్టుకోలేక సాయంత్రం దాకా పాఠాలు వినడం లేదు. మధ్యాహ్న సమయంలోనే తిరిగి ఇండ్లకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఇక్కడి అధ్యాపకులు ఔదార్యం చాటారు.
తమ కాలేజీకి వచ్చే 250 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తరహాలో అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బంది తమవంతు సహాయంగా కొంత నగదును సమకూర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచే ప్రారంభించారు. మొదటి రోజు వంద మంది విద్యార్థులకు భోజనం, మరో వంద మంది విద్యార్థులకు ఉప్మా అందించారు. అల్పాహారం కార్యక్రమాన్ని వార్షిక పరీక్షల (మార్చి ఒకటో తేదీ) వరకు కొనసాగిస్తామని ప్రిన్సిపాల్ శివరామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమలో అధ్యాపకులు అత్తినేని శ్రీనివాస్, శ్రీధర్, శ్రీనివాస్, రచన, పూర్ణిమ, సంధ్య, నరేశ్ పాల్గొన్నారు.