హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో ఉన్న కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర రక్షణ శాఖను కోరారు. భూమి అప్పగిస్తే రోడ్డు విస్తరణతోపాటు ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనువుగా ఉంటుందని, తద్వారా హైదరాబాద్కు వచ్చీపోయే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తొలగిపోతుందని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినోద్ కుమార్ లేఖ రాశారు.
కరీంనగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్-కరీంనగర్ ఉమ్మడి జిల్లా మార్గంలో ఉన్న కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం కంటోన్మెంట్ భూమిని అప్పగిస్తే రోడ్డు విస్తరణతోపాటు ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనువుగా ఉంటుందని, తద్వారా హైదరాబాద్కు వచ్చీపోయే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ట్రాఫిక్ సమస్య తొలగిపోయి ప్రయాణం సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినోద్ కుమార్ లేఖ రాశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు రోడ్డు మార్గాన హైదరాబాద్కు వచ్చేపోయే క్రమంలో హకింపేట నుంచి మొదలయ్యే ట్రాఫిక్ బొల్లారం, అల్వాల్, లోతుకుంట, లాల్ బజార్, తిరుమలగిరి, కార్ఖానా, జేబీఎస్. జింఖానా గ్రౌండ్స్ దాకా ఉంటున్నదని వివరించారు. కరీంనగర్ నుంచి ఓఆర్ఆర్ దాకా ప్రయాణానికి పట్టే సమయం ఒక ఎత్తయితే శివారు నుంచి హైదరాబాద్ నగరంలోకి చేరుకునే సమయం మరో ఎత్తుగా ఉంటుందన్నారు. ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్ ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. హకీంపేట – బొల్లారం – అల్వాల్ – తిరుమలగిరి – కార్ఖానా – జింఖానా గ్రౌండ్ మధ్యలో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోనే పరిష్కారమవుతుందని, ఇందుకు సీఎం కేసీఆర్ కూడా సుముఖంగా ఉన్నారని తెలిపారు.
ఈ క్రమంలో కంటోన్మెంట్ రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరం నుంచి వరంగల్కు వెళ్లే దారిలో 6 నంబర్ జంక్షన్ నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించారని, మెహిదీపట్నం నుంచి ఎయిర్ పోర్ట్ సహా మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లేందుకు పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్వే ఉందని, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లేందుకు ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ట్రాఫిక్ నుంచి బయట పడి ప్రయాణం కొనసాగించేందుకు మాత్రం ప్రత్యేకంగా మరో దారి లేదని వినోద్ కుమార్ వివరించారు. ఈ మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు, ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.