కార్పొరేషన్, అక్టోబర్ 30: కరీంనగర్ నుంచి ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పరుగులు పెట్టించి అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లో సాగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సోమవారం నగరంలోని పద్మనగర్లో కరీంనగర్ ఆటో డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథాగా మంత్రి గంగుల హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పేదల, ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ది, సంక్షేమం కొనసాగాలంటే తెలంగాణను సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉంచాలన్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీలు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ వస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. వారి హయాంలో సాగునీరు, కరెంటు, తాగునీటి కోసం అరిగోస పడ్డామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఎంతో అభివృద్ది చేసుకున్నామని తెలిపారు. రైతులకు సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, బీమా అందిస్తున్నామని తెలిపారు. ఆటో కార్మికులకు టాక్స్ లేకుండా చేశామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ఏడాదిలో పూర్తి అవుతుందని చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. ఇది పూర్తయితే విదేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తారన్నారు. దీంతో ఆటో కార్మికులకు పని దొరుకుతుందన్నారు.
ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాడెత్తేసిందన్నారు. అక్కడి ప్రజలు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేయవద్దని చెబుతున్నారని తెలిపారు.కాంగ్రెస్ నాయకులను నమ్మితే తెలంగాణ మళ్లీ గుడ్డిదీపం కావడం ఖాయమన్నారు. ఢిల్లీ చేతుల్లో తెలంగాణను పెడితే మళ్లీ ఆంధ్రలో కలిపేసే కుట్రలు సాగుతాయన్నారు. తెలంగాణ సంపదను దోచుకునేందుకు దొంగలంతా హైదరాబాద్లో అడ్డాపెట్టారని విమర్శించారు. కేసీఆర్ను ఓడించి తెలంగాణను ఆంధ్రలో కలిపి ఈ సంపద, నీరు, బొగ్గు, కరెంటను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు.
ఒక్క తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. మళ్లీ నీళ్లు, కరెంటు , ఉద్యోగాల కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలిచి, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. సమావేశంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్మిక విభాగం రాష్ట్ర నాయకుడు రూప్సింగ్, కరీంనగర్ ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు మద్దెల రాజేందర్, బండారి సంపత్, రాంగోపాల్రెడ్డి, తిరుపతి, నాగభూషణం, అయిలేశ్, శేఖర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.