జగిత్యాల టౌన్, ఏప్రిల్ 9: ఈ ఏడాది మామిడి సాగు ఆరంభం నుంచి పూత ఆశాజనకం గా ఉన్నా పిందె పెరుగుదల దశలో రైతులను చీడపీడల సమస్య వెంటాడింది. దానికి తోడు అకాల వర్షం మరింత నష్టం చేసింది. వీటితో పాటు మామిడి కాయలపై మంగు (మామిడి కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడటం) సమస్య మరింత నష్టం చేస్తున్నది. దీం తో అన్నదాతల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే వీటి నివారణకు ముందు జాగ్రత్తలే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు.
మామిడి కాయలపై మచ్చలు ఏర్పడుట
తామర పురుగులు మామిడి తోటలో కింద ఉన్న కలుపు మొక్కలలో వాటి జీవిత చక్రం పూర్తి చేసుకొని మామిడికి పిందె, పూత రాగానే మామిడి చెట్ల మీదికి వచ్చి వాటిని గోకి చర్మం మీద మచ్చలు ఏర్పరుస్తాయి. కాయలపైన గుంపులుగా చేరి రసం పీల్చడం వల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే పూతపైన కూడా చేరి రసం పీల్చి పూత మాడిపోయేలా చేస్తాయి. తామర పురుగులను ముందునుండే అనగా పూత దశ నుంచే యాజమాన్యం మొదలు పెట్టడం ద్వారా నివారించవచ్చు.
కలుపు మొక్కలు తామర పురుగులకు వారధులు
తామర పురుగులు అదుపులో పెట్టేందుకు ప్రధానంగా మామిడి తోటల్లో కలుపు మొక్క లు లేకుండా చూసుకోవాలి. పూర్తిగా కలుపు లేని తోటల్లో తామర పురుగుల సమస్య వంద శాతం నివారించుకోవచ్చు. తామర పురుగులు కలుపు మొక్కల్లో తన జీవిత చరిత్రను పూర్తి చేసుకొని మామిడికి పూత వచ్చే సమయంలో చెట్టు పైకి చేరి పూతలోని రసాన్ని పీల్చి పూతను మాడ్చి వేస్తాయి. తర్వాత కాయ దశకు చేరుకున్న తర్వాత కూడా కాయపై నల్లటి మచ్చలుగా ఏర్పడతాయి.
రసాయన పద్ధతుల ద్వారా నివారణ
రసాయన పద్ధతుల ద్వారా తామర పురుగులను అదుపులో పెట్టడం అనేది కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ఈ పురుగులు చాలా రకా ల మందులకు తట్టుకునే శక్తి పొంది ఉంటాయి. పిందెలు రాకన్న ముందు పూత దశ నుండే యాజమాన్యం పాటించాలి. తామర పురుగుల ఉధృక్తత తక్కువ ఉన్నప్పుడే నివారించుకుంటే తేలికగా ఉంటుంది. మందులను పిచికారిని ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో చేయాలి. ఈ సమయంలో తామర పురుగులు ఎక్కువ ఉధృతితో ఉంటాయి. దాని వల్ల ఎ క్కువ శాతం పురుగులను అరికట్టవచ్చు. తోట ల్లో నీలి, పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. నీమ్ ఆయిల్ (2శాతం) మొదటి దశ తామర పురుగులను అరికట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంటే పూత దశలో ఉపయోగపడుతుంది. పురుగుల ఉధృక్తత ఎక్కువగా ఉన్నప్పుడు అంటే పిందె, కాయ దశలలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, ఇమిడాక్లోప్రిడ్ను 03 మిల్లీ లీటర్లు, స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు లీటరు నీటితో కలిపి మార్చి మార్చి పిందె దశలో ఒకసారి, కాయలు పెద్ద సైజులో ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే చేయాలి.
వీటికి మార్కెట్లో ధర నిల్
మామిడి రైతులకు అకాల వర్షాలతో పాటు చీడపీడల సమస్య కూడా వెంటాడుతున్నది. కాయ చేతికి వచ్చే దశలో తామర పురుగు ఆ శించడంతో వాటిని మార్కెట్లో రిజెక్ట్ చేస్తారు. దాన్ని మక్క పెట్టినా నల్లటి మచ్చ ప్రాంతంలో పుండుగా ఏర్పడి పురుగులు తయారవుతాయి. దాన్ని మార్కెట్లోకి తీసుకుపోలేమని, తినలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇ లాంటి మంగు సోకని కాయలతో ఉన్నా మం చివి కూడా చెడిపోయే ప్రమాదం ఉంది.
ముందు జాగ్రత్తలే మేలు
మామిడిలో మంగు సమస్య తామర పురుగుల ద్వారా సోకుతుంది. ఈ సమస్య జిల్లాలో 30 శాతం ఉంది. మచ్చలు ఏర్పడ్డ మామిడి కాయలను మార్కెట్లో రిజక్ట్ చేస్తారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ పురుగులు పిందె, పూత, కాయలపైన చేరి రసం పీల్చి వదలడం వల్ల పూత మాడిపోయి పడిపోతుంది. పిందె, కాయలపై మంగు మచ్చలు ఏర్పడటం వల్ల మార్కెట్లో ధర రాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతులు మామిడి తోటల్లో పూత దశ కంటే ముందు నుంచే యాజమాన్య చర్యలు తీసుకోవాలి. కాయ దశకు చేరుకున్నాక దాన్ని నివారించడం చాలా కష్టంతో కూడుకున్న పని కావడంతో రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు.
– ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి