చుట్టూ అందమైన అద్దాలు.. లోపల అందమైన ఫర్నిచర్.. హంగూ ఆర్భాటాలతో ఆకర్షించే హోర్డింగ్లు.. తీరా లోపలికి వెళ్లి చూస్తే కుళ్లిపోయిన దుర్వాసన వస్తున్న పదార్థాలు. రెండు మూడు రోజుల కిందట వండిన చికెన్, మటన్.. ఒక రోజు కిందటి బిర్యానీ.. ఇదీ హుజూరాబాద్ పట్టణ నడిబొడ్డున వెలిసిన తాజ్ రెస్టారెంట్ బాగోతం.. మున్సిపల్ శానిటర్ అధికారులు మంగళవారం తాజ్ రెస్టారెంట్పై దాడి చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
-హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 13
హుజూరాబాద్ పట్టణంలోని తాజ్ రెస్టారెంట్పై మున్సిపల్ శానిటరీ అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా దాడి చేశారు. నిర్వాహకులు కూళ్లిన ఆహార పదార్థాలను అంటగడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే సమాచారం మేరకు మంగళవారం తనిఖీ చేశారు. హోటల్ లోపలికి వెళ్లిన అధికారులు.. నిర్వాహకుల బాగోతం చూసి విస్మయానికి గురయ్యారు. నిత్యం వందల మందికి ఆహార పదార్థాలు అందించే రెస్టారెంట్లో కుళ్లిపోయిన, పాడైపోయిన దుర్వాసన వస్తున్న పదార్థాలు దర్శనమివ్వడంతో ఒకసారిగా కంగుతిన్నారు. వారం క్రితం కర్రీ చేసేందుకు ఉప్పు, కారం కలిపిన రొయ్యలు, చేపలు.. రెండు మూడు రోజుల క్రితం వండిన చికెన్, మటన్.. ఒకరోజు ముందు వండిన బిర్యానీని ఫ్రిజ్లో పెట్టారు. కోడిగుడ్లు మురిగిపోయి తెల్ల పురుగులు పడి దుర్వాసన వస్తున్నాయి.
సోమవారం ఉదయం చేసిన బిర్యానీ మంగళవారం మధ్యాహ్నం వరకు ఫ్రిజ్లో కనిపించడంతో నిర్వాహకులు ఇప్పుడే పడేస్తామంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. చాలా వరకు ఆహార పదార్థాలు కూడా కుళ్లిపోవడమే కాదు ఫంగస్ వచ్చి కనిపించడంతో హోటల్ నిర్వహణ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పదార్థాలను కడిగి వినియోగిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే పాడైపోయిన ఆహార పదార్థాలను బయటకు తెచ్చి రోడ్డుపై పెట్టి అకడకు వచ్చిన ప్రజలకు చూపించారు. అనంతరం వాటని మున్సిపల్ చెత్త బండిలో పారవేసి హోటల్ నిర్వాహకులకు 25 వేల జరిమానా విధించారు. కుళ్లిన ఆహార పదార్థాలు అందిస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న హోటల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకనైనా నిలువ ఉంచిన పదార్థాలను ప్రజలకు విక్రయించద్దని, ఎలాంటి ఆహార కల్తీకి పాల్పడినా మున్సిపల్ చట్టం ప్రకారం జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా శానిటరీ ఇన్స్పెక్టర్ పీ అనిల్కుమార్, హెల్త్ అసిస్టెంట్ ఎం కిషన్రావు హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ వెంకన్న ఆధ్వర్యంలో పట్టణంలోని హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను, చికెన్, మటన్ సెంటర్ల నిర్వాహణను తరచూ తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈ తనిఖీలలో మున్సిపల్ శానిటరీ జవాన్లు పీ అనిల్కుమార్, ఆరెల్లి రమేశ్, ప్రతాప రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.