మానేరు నది స్వచ్ఛహారం తొడుగుకుంటున్నది. నివాస ప్రాంతాలు.. పరిశ్రమల నుంచి వెలువడే మురుగుతో నది కలుషితం కాకుండా సిరిసిల్లలో చేపట్టిన మురుగు నీటి శుద్ధీకరణ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణం వేగవంతంగా సాగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో బైపాస్రోడ్డులోని నర్సింగ్ కళాశాల సమీపాన ఆరెకరాల్లో 61.50 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ప్లాంట్, ఆరు నెలల్లోనే 65శాతం మేర పూర్తయింది. రోజుకు 3.19 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యంతో నెలకొల్పుతున్న ఈ కేంద్రాన్ని వచ్చే యేడాది అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా యంత్రాంగం ముందుకు సాగుతున్నది. ఇది పూర్తయితే పట్టణ ప్రజలు, రైతుల బాధ తీరనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలోని ఇండ్ల నుంచి వెలువడుతున్న మురుగు నీరు పెద్ద సమస్యగా మారింది. అన్ని వార్డుల నుంచి వచ్చే మురుగంతా ఒక చోట చేర్చేందుకు బైపాస్రోడ్డు పక్కనే రెండు కిలోమీటరు దూరంలో తుమ్మల కుంటను నిర్మించారు. కుంటలో నిండిన నీరంతా పక్కనే ఉన్న దామెర కుంట చేపల చెరువులోకి చేరుతున్నది. భారీ వర్షాలకు ఆ రెండు చెరువులు నిండి మానేరులోకి చేరి కలుషితమవుతున్నది. మానేరు నీటిని పంట చేలకు వినియోగిస్తున్నందున రైతులంతా కలిసి ఆమాత్యుడికి తమ గోడు విన్నవించుకున్నారు. మురుగు నీటితో మానేరు కలుషితం కాకుండా చూడాలని, తమ పంటలు దెబ్బతినకుండా చూడాలని రైతులు కోరారు. వెం టనే స్పందించిన మంత్రి కేటీఆర్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలని బల్దియాను ఆదేశించారు.
61.50కోట్లతో నిర్మాణం..
మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం కోసం బల్దియా గత మార్చిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పరిశీలించిన మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే 61.50కోట్లను మంజూరు చేశారు. ప్లాంట్ నిర్మాణం కోసం బైపాస్రోడ్డులోని అంబేద్కర్ భవన్, నర్సింగ్ కళాశాల సమీపంలో తొలుత 11 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. తర్వాత ఆరెకరాలు సరిపోతుందని అంచ నా వేసి, కేటాయించారు. ఆరునెలల క్రితం ప్రా రంభించిన ప్లాంట్ పనులు 65శాతం పూర్తయ్యా యి. వచ్చే సంవత్సరంలో ప్రారంభించాలన్న లక్ష్యంతో యంత్రాంగం ముందుకు పోతున్నది.
రోజుకు 3.19 మిలియన్ లీటర్ల శుద్ధి..
వస్త్ర కేంద్ర బిందువైన సిరిసిల్ల పట్టణ జనాభా 1.10లక్షలుండగా, 21,960 నివాసాలున్నాయి. ఇందులో ముఖ్యంగా మరమగ్గాలు, అద్దకం (డైయింగ్) పరిశ్రమలు, సైజింగ్లు, అనుబంధ, ఇతర పరిశ్రమలున్నాయి. నివాసాలు, పరిశ్రమల నుంచి రోజుకు 3.19మిలియన్ల మురుగు నీరు వెలువడుతున్నది. ఆ నీటినంతా శుద్ధి ఒకే రోజు శుద్ధి చేయనున్నారు. అయితే సిరిసిల్ల జిల్లా కేంద్రం వేగంగా విస్తరభవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 19.3 లీటర్ల శుద్ధి చేసే సామర్థ్యం గల ప్లాంట్ను నిర్మిస్తున్నారు.
శుద్ధి ఇలా..
ప్రస్తుతం నిర్మించే ప్లాంట్కు వందమీటర్ల దూరంలోని కాలువకు ఇన్లెట్ చాంబర్ (జాలీ)ని నిర్మిస్తున్నారు. మురుగు నీటిలో వచ్చే చెత్తాచెదారం జాలీ వద్ద ఆగిపోతుంది. నీటిని రాసీలెజ్ సంపులోకి మళ్లీస్తారు. 33 ఫీట్ల లోతు, సుమారు 100 ఫీట్ల వెడల్పుతో పెద్ద బావి (సంపు) నిర్మిస్తారు. మురుగు నీటిలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించేందుకు శుద్ధి చేసిన నీటిని మరో సంపులోకి పంపిస్తారు. పూర్తి స్థాయిలో శుద్ధి అయిన తర్వాత నీటిని మానేరులోకి వదిలేలా నిర్మాణం చేస్తున్నారు. పంట చేలకు, ఇతర అవసరాలకు వినియోగించుకునే విధంగా నీటిని శుద్ధిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ.
కార్మికక్షేత్ర అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పట్టణంలో నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్లాంట్ నిర్మాణ పనుల పర్యవేక్షణ పబ్లిక్ హెల్త్ శాఖకు అప్పగించారు. ప్రతి నెలకోసారి హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారుల బృందం వచ్చి పరిశీలిస్తున్నది. నిర్ధేశించిన లక్ష్యంలోగా ప్లాంట్ను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 65శాతం పనులు పూర్తి కాగా మిగిలిన 35శాతం రెండు నెలల్లో పూర్తి చేసి ట్రయల్ రన్కు సన్నాహాలు చేస్తున్నది. మురికి నీటి శుద్ధికరణ ప్లాంట్ అందుబాటులోకి వస్తే పట్టణ శివారులోని పంటచేలకు నీరందే అవకాశం ఉంది. మానేరు కాలుష్య కాకుండా నివారించ బడుతున్నందుకు రైతులు, పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శరవేగంగా చేస్తున్నాం..
మంత్రి కేటీఆర్ చొరవతో మంజూరైన మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 65 శాతం పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే సంవత్సరంలో ప్లాంట్ అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాలకవర్గం, ప్రజల కోరిక మేరకు నిధులు ఇచ్చిన మంత్రికి కృతజ్ఞతలు. ప్లాంట్ నిర్మాణంతో మురుగు నీటి ఇబ్బందులు తీరనున్నాయి.