తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 11 : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల్లో ఇప్పటికే పెను మార్పులు తీసుకురాగా.. మరింత పారదర్శకంగా సేవలు అందేందుకు హెల్త్ ట్రాకింగ్ యాప్ను ఏర్పాటు చేసింది. పౌష్టికాహార వివరాలను ఎప్పటికప్పుడు ఎంట్రీ చేసేందుకు న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్) అనే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటి వరకు ఒక గర్భిణి లేదా చిన్నారిని అంగన్వాడీలో నమోదు చేయాలంటే చాలా రికార్డుల్లో రాయాల్సి వచ్చేది. దాంతోపాటు రోజూవారి, నెలవారి ఆహారాన్ని ఇచ్చిన సందర్భాల్లో సైతం రికార్డుల్లో రాసే పని ఉండేది. కానీ, ఈ యాప్ ద్వారా కాగి రహితంగా వివరాలు నమోదు చేసే అవకాశం ఏర్పడనున్నది. ప్రస్తుతం ఈ యాప్ అందుబాటులోకి వచ్చినా మరి కొన్ని రోజులు రికార్డుల్లోనూ నమోదు చేయనున్నారు. ప్రస్తుతం రికార్డులు రాయడానికే టీచర్లు ఎక్కువ సమయం కేటాయిస్తుండడంతో పూర్తి స్థాయిలో చిన్నారులకు సమయం కేటాయించలేకపోతున్నారు. ప్రస్తుతం యాప్ పూర్తిస్థాయిలో వాడకం మొదలైన తర్వాత అంగన్వాడీ టీచర్లకు పని భారం తగ్గనుంది.
కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీలు
జిల్లాలో 752 అంగన్వాడీ సెంటర్లు, 25 మినీ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా 5740 మంది గర్భిణులు, 4823 మంది బాలింతలు పోషకాహారం తీసుకుంటున్నారు. అలాగే, ఏడాదిలోపు చిన్నారులు 5263 మంది, మూడేళ్లలోపు చిన్నారులు 18,683 మంది, ఆరేండ్ల లోపు చిన్నారులు 10,456 మందికి పౌష్టికాహారం అందుతున్నది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా వీరందరి వివరాలు ఒకే చోట ఉండి చూడవచ్చు. ఇటు అంగన్వాడీలకు పనిభారం తగ్గడంతోపాటు అధికారుల పర్యవేక్షణ సులభతరం అవుతుంది.
అన్ని వివరాలు నిక్షిప్తం
ఈ యాప్లో చిన్నారికి అందిస్తున్న పోషకాహారంతోపాటు ఎత్తు, బరువు, ఎదుగుదల అన్ని నమోదు చేయాలి. చిన్నారులకు పోషకలోపం ఉంటే యాప్లోనే చూపిస్తుంది. దాంతో ప్రభుత్వం అలాంటి చిన్నారికి పోషకవిలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తుంది. వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు, ఎదుగుల అన్నీ నార్మల్గా ఉంటే చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు చూపిస్తుంది. దీంతో అంగన్వాడీ నుంచి లబ్ధి పొందుతున్న చిన్నారి వివరాలు యాప్లోనే నిక్షిప్తం అయి ఉంటాయి.
పూర్తయిన శిక్షణ
న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం యాప్ గురించిన శిక్షణ ఇప్పటికే పూర్తయింది. జిల్లాలోని అన్ని మండలాల అంగన్వాడీ టీచర్లకు ఎల్ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం రాతపూర్వకంగా రాస్తున్న 15 రికార్డులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఎలా నమోదు చేయాలో వివరించారు.
అధికారుల పర్యవేక్షణ రికార్డుల ద్వారా నమోదు అయితే ఉన్నతాధికారులు పర్యవేక్షణకు ప్రత్యేకంగా వస్తేనే ఒక అంగన్వాడీ సెంటర్లో సేవల గురించి తెలిసేది. కానీ, ప్రస్తుతం ఈ యాప్ ద్వారా కార్యాలయంలో కూర్చునే జిల్లా, మండలం, కేంద్రాల సేవలు ఉన్నతాధికారులు పర్యవేక్షించవచ్చు.
పని భారం తగ్గనుంది
ఈ యాప్ ద్వారా అంగన్వాడీ టీచర్లకు పనిభారం తగ్గనుంది. దీంతో పాటు సమయం ఆదా అవుతుంది. అలాగే సేవలు పారదర్శంగా అందుతాయి. ఒక చిన్నారి వివరాలు ఈ యాప్లో నమోదు అయితే చిన్నారికి సంబంధించిన ప్రతీ అంశాన్ని కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు పర్యవేక్షించవచ్చు. ఏ కేంద్రంలో ఎంత మంది ఉన్నారు, సేవలు తదితర అంశాలు పర్యవేక్షించవచ్చు.
– శ్రీలత, సూపర్వైజర్ (ఐసీడీఎస్)
యాప్ ద్వారా పర్యవేక్షించవచ్చు
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రత్యేక యాప్తో పర్యవేక్షణ మరింత పెరుగుతుంది. సేవల్లో పారదర్శకత ఉంటుంది. ఈ యాప్ను ఎలా వినియోగించాలో జిల్లాలోని సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. సిబ్బంది చిన్నారులకు, గర్భిణులకు పంపిణీ చేసే సరుకులు, పిల్లల గురించి సమస్త సమాచారం యాప్ ద్వారా పర్యవేక్షించవచ్చు. – సబితా కుమారి, జిల్లా సంక్షేమాధికారి (కరీంనగర్)