Jagityal | జగిత్యాల, జులై 3 : నవమాసాలు మోసిన ఓ తల్లిని వృద్ధాప్యంలో సాదాల్సిన కొడుకు కర్కషంగా ప్రవర్తించి ఇంటి నుండి గెంటేశాడు. ఈ కర్కష ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో కొత్త పేట గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తపేట గ్రామానికి చెందిన గంగధరి లక్ష్మి ( 85)అనే వృద్ధురాలిని తన కన్న కొడుకు రాజేశం ఇంట్లోంచి గెంటి వేశాడని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ను శుక్రవారం ఆశ్రయించింది. ఈ మేరకు ఆ వృద్ధ తల్లితో హరి అశోక్ కుమార్ ఆర్డీవో కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి కోట వసంతకు ఫిర్యాదు చేయించారు. దీంతో తల్లి దండ్రుల రక్షణ పోషణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అ వృద్ధ తల్లి ఆర్డీవో కార్యాలయ ఆవరణలో విలేకరులకు తన గోడు వినిపిస్తూ రోదించారు. తన ఐదో కొడుకు రాజేశం తాను స్వయంగా నిర్మించుకున్న ఇంట్లోంచి బలవంతం గా వెళ్ల గొట్టాడని, తన పోషణ కూడా చూసుకోకుండా తన పేరిట ఉన్న పట్టాభూములను కొడుకు పేరిట పట్టా చేయాలని హింసిస్తున్నాడని వాపోయింది.
తాను దత్తత ఇచ్చిన కుమారుడు సురేందర్, కూతురు ప్రమీల తన గోస చూసి ఆశ్రయమిస్తే తనను సంరక్షణ చేయవద్దని వారిని బెదిరిస్తున్నాడని రోదించింది. తనను ఇంట్లోంచి కొట్టి వెళ్ల గొట్టిన కొడుకు రాజేశంను తన ఇంటి నుంచి వెళ్ల గొట్టి తనను ఆ ఇంటిలోనే ఉంచాలని వేడుకుంది. తన ముగ్గురు కొడుకులైన ప్రతాప్, రవీందర్, రాజేశం తనకు పోషణ ఖర్చుల కింద ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.5 వేలు చొప్పున ఇప్పించాలని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది హరి అశోక్ కుమార్, వారి బృందం సహకారంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.తనను ఇంటిలో నుంచి వెళ్లగొట్టిన కొడుకు రాజేశంపై ఎస్పీ కి ఫిర్యాదు చేశానని ఆ వృద్ధురాలు ఏడుస్తూ విలపించింది. వృద్ధురాలి వెంట సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది హరి అశోక్ కుమార్, వృద్ధుల సంరక్షణ కాన్సిలియేషన్ అధికారి పీసీ హన్మంత్ రెడ్డి, వృద్ధురాలి కూతురు ప్రమీల, సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.