సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల తేదీ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇప్పటికే బరిలో నిలిచిన 13 సంఘాలకు గుర్తులు కేటాయించగా, సోమవారం జరిగిన సమావేశంలో ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల ప్రత్యేకాధికారి, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్ కార్మికుల ఓటరు లిస్టును అందించగా, యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. నేటి నుంచి కార్మిక సంఘాల నాయకులు రంగంలోకి దిగనుండగా, కోల్బెల్ట్లో ప్రచారం హోరెత్తనున్నది.
– గోదావరిఖని, డిసెంబర్ 4
గోదావరిఖని, డిసెంబర్ 4 : అక్టోబర్ 28న సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ ఇచ్చారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించారు. 10న పరిశీలించి, 13 కార్మిక సంఘాలు బరిలో ఉంటున్నట్టు డిప్యూటీ లేబర్ కమిషనర్, ఎన్నికల అధికారి శ్రీనివాసులు ప్రకటించారు. గుర్తులు కూడా కేటాయించారు. కానీ, అప్పటికే (అక్టోబర్ 9న) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడంతో సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని యాజమాన్యంతోపాటు మెజార్టీ కార్మిక సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ ఇలాగే ఉంటుందని, డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించుకోవాలని అక్టోబర్ 11న స్పష్టం చేసింది.
ఈ నెల 3న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కావడంతో ఎన్నికల ప్రత్యేకాధికారి, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు సోమవారం 13 కార్మిక సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్లోని రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నిలిచి పోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గుర్తింపు ఎన్నికల కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి సింగరేణి అధికారులు అంగీకారం తెలిపారు. నవంబర్ 30లోగా పదకొండు ఏరియాల పరిధుల్లో విధుల్లో ఉండే 39,748 మందితో ఉన్న కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల ప్రత్యేకాధికారికి అందజేశారు. ఆ తర్వాత కార్మిక సంఘాల ప్రతినిధులకు ఓటరు లిస్ట్ను డీవైసీఎల్సీ అందించారు.
27న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఏరియాల వారీగా ఓట్లు లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి కార్మిక సంఘాల నాయకులు ప్రచారంలో మునిగి తేలనున్నారు. డీవైసీఎల్సీతో జరిపిన చర్చల్లో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఆహ్మద్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో 27న జరిగే ఎన్నికల్లో 39,832 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు కార్మిక సంఘాలకు ఓటరు లిస్టును డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు అందజేశారు. బెల్లంపల్లి డివిజన్లో 985 మంది, మందమర్రిలో 4876 మంది, శ్రీరాంపూర్లో 9124 మంది, కొత్తగూడెం కార్పొరేట్లో 1192 మంది, కొత్తగూడెం డివిజన్లో 2370, మణుగూరులో 2414 మంది, ఇల్లందులో 603 మంది, ఒడిషాలో నైని బ్లాకులో కేవలం ఇద్దరు ఓటర్లు, భూపాలపల్లిలో 5350 మంది, రామగుండం-1లో 5430 మంది, ఆర్జీ-2లో 3479 మంది, ఆర్జీ-3లో 3063, ఏపీఏలో 944 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.