సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 28: ‘సారు.. మీరు దేవునిలెక్క మమ్ముల ఆదుకున్నరు. మా కోసం బాగా కష్టపడ్డరు. పైసలు పెట్టిన్రు. మా కోసం నేపాల్ వెళ్లిన్రు. దుబాయ్కి వచ్చిన్రు. మమ్ముల్ని ఇడిపించిన్రు. మీ మేలు ఈ జన్మలో మరువం’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్కు శివరాత్రి మల్లేశం, రవి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. పెద్దూరులోని తమ నివాసానికి వచ్చిన కేటీఆర్ను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు. చెమ్మగిల్లిన కండ్లతో తమ బాధలు, జైలులో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
తాము కేసులో ఇరుక్కొని చాలా కష్టాలు పడ్డామని, జైలు నుంచి ఇక బయటికి రాలేమని అనుకున్నామని, కానీ, మీ ప్రయత్నాలతో తమలో ఒక నమ్మకం ఏర్పడిందని, ఆ ధైర్యం బతికి బయటికి వచ్చామని శివరాత్రి మల్లేశం, రవి ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ అంటే చాలా రాష్ర్టాలు, దేశాలకు చెందిన వ్యక్తులు ఇష్టపడతారని చెప్పారు. తాము ఉన్నప్పుడు జైలులో కేటీఆర్ సార్ ప్రయత్నం చేస్తున్నారని, మీకేం కాదని తోటి ఖైదీలు ధైర్యం చెప్పేవారని గుర్తు చేశారు. మీ సాయం లేకపోతే మా కుటుంబాలను తిరిగి కండ్ల చూడలేకపోయే వాళ్లమని కన్నీళ్లు కార్చారు.
దీనికి కేటీఆర్ స్పందించారు. ‘మీరు అదృష్టవంతులు. ఈ విషయాన్ని జర్నలిస్టు నాగభూషణం మొదట తన దృష్టికి తెచ్చారు. తర్వాత కాయితీ బాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవాడు. మీ కోసం కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు చాలా కష్టపడ్డరు. సిరిసిల్లలో నేను ఏ కార్యక్రమానికి వచ్చినా చందుర్తికి చెందిన ఎల్లమ్మ నన్ను కలిసేది’ అని గుర్తు చేశారు. తమ పద్దెనిమిదేండ్ల గల్ఫ్ జీవితం, జైలు, అక్కడ కార్మికుల పరిస్థితులపై యువతను చైతన్యం చేశేలా సినిమా తీయాలని అని మల్లేశం విన్నవించగా, ‘ముందు మీ బతుకు బండి పట్టాలెక్కిన తర్వాత సినిమా గురించి ఆలోచిద్దాద్దాం’ అని కేటీఆర్ సూచించారు.
‘పద్దెనిమిదేండ్ల తర్వాత ఇక్కడికి వచ్చారు కదా..? ఈ ప్రాంతం ఎలా ఉన్నది? ఏమనిపిస్తున్నది?’ అని కేటీఆర్ ప్రశ్నించగా, ‘సార్ చాలా అభివృద్ధి జరిగింది. నిజంగా మా సిరిసిల్లనేనా..?’ అని అనిపించిందని మల్లేశం, రవి చెప్పారు. తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ, పదేళ్లలోనే సిరిసిల్ల రూపురేఖలు మార్చామని, ఇక్కడ వ్యవసాయ, మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలు, పెద్ద దవాఖానలు వచ్చాయని, అన్ని విధాలా అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్కు ఇతర రాష్ర్టాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో వరి నాట్లకు సైతం వలస వస్తున్నారని తెలిపారు.
‘మనవాళ్లు ఇక్కడే పని చేసుకుంటే బాగుంటుంది? కదా.. గల్ఫ్లో బాధలు ఎలా ఉంటాయో..? మీరు ఇక్కడి కుటుంబాలకు వివరించాలి’ అని సూచించగా, సార్ తప్పకుండా చెప్తామని వారు పేర్కొన్నారు. ఇంకా మీలా ఎంత మంది ఉన్నారని కేటీఆర్ వారిని అడుగగా, నిజామాబాద్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల వారు ఉన్నారని మల్లేశం చెప్పారు. ప్రభుత్వం నుంచి అందే సాయంతోపాటు వ్యక్తిగతంగా తాను రెండు, మూడు నెల్లలో సాయం అందిస్తానని భరోసానిచ్చారు. ఇంకా అక్కడ ఉన్న వారి కోసం పెద్దసారు కేసీఆర్, నేను, పార్టీ అంతా ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం అందేలా చూస్తామన్నారు.