ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల్లో పూజలు చేసి, వేలాది మంది అభిమానులు, కార్యకర్తల మధ్య నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ ఆఫీసులకు ర్యాలీగా బయలుదేరారు. కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుస్నాబాద్లో ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పండుగ వాతావరణంలో నామినేషన్లు వేశారు. చొప్పదండి, హుస్నాబాద్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో అభ్యర్థులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. మంథని, కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు పుట్ట మధూకర్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సాదాసీదాగా నామినేషన్ వేశారు. కాగా, ఐదు రోజుల్లో మొత్తం 209 నామినేషన్లు దాఖలవగా, గురు, శుక్రవారాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
“నేను ఎన్నికల కోసం మాట్లాడే వాడిని కాదు. మన పిల్లల భవిష్యత్తు, భావి తరాల కోసం ఆరాటపడే వాడిని. నిత్యం ప్రజల్లోనే ఉండి, ప్రజల కోసం కష్టపడే వ్యక్తిని. మరోసారి నన్ను దీవిస్తే మీతో ఉండి మీ సంక్షేమం, అభివద్ధి కోసం ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తా. బీఆర్ఎస్ అభివద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటుంటే.. బీజేపీ మాత్రం విధ్వంసాన్ని, విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. కాంగ్రెస్ భూకబ్జాదారులను ప్రోత్సహిస్తున్నది. ఎవరు కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలే. రాష్ట్రం మరింత అభివద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్ను బలపర్చండి. ఇక్కడికి వచ్చిన లక్ష మంది జనం వచ్చే 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేస్తే ప్రత్యర్థుల గుండెలు అదిరి పోవాలి.
– గంగుల కమలాకర్, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయం. స్థానికుడినైన నన్ను గతంలో ఆదరించి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు రుణపడి ఉంటా. గతంలో గెలిచిన నాయకులు నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధిని పట్టించుకోలేదు. నేను మేజర్ పంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి రూ.100 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తున్న. స్థానిక బిడ్డను. నేను లోకల్. ఇక్కడే పుట్టిన బిడ్డను కాబట్టే ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తున్నా. స్థానికేతరులు వచ్చి ఇక్కడ ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్లీ వచ్చి ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నరు. ప్రజలు ఆలోచించాలి. మీకోసం పని చేసే కేసీఆర్ను ముచ్చటగా ముడోసారి ముఖ్యమంత్రిని చేయాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి
కరీంనగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో ఈ నెల 3(శుక్రవారం) కీలక ఘట్టానికి తెరలేచింది. ఆ వెంటే నామినేషన్ల పర్వం మొదలైంది. దాఖలుకు రేపటి (శుక్రవారం) వరకు గడువు ఇవ్వగా, ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల దాకా నియోజకవర్గకేంద్రాల్లోని రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించారు. అయితే మొదటి రెండు మూడు రోజులు పెద్దగా స్పందన లేకున్నా.. రెండు రోజుల నుంచి వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు చేస్తున్నారు. ఈ ఆరు రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 209 వేశారు.
అయితే రేపటి మధ్యాహ్నం 3గంటలతో స్వీకరణ ప్రక్రియ ముగియనుండగా, నేడు, రేపు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ నామినేషన్లను ఈ నెల 13న పరిశీలిస్తారు. ఫాంలు సరిగ్గా నింపకున్నా, సరైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకున్నా, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు రుజువైనా.. మరేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని తిరస్కరిస్తారు. అన్ని సరిగ్గా ఉంటేనే పోటీలో ఉండేందుకు అనుమతిస్తారు. ఒకవేళ ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటే ఈ నెల15న ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. సాయంత్రం వరకు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వారికి ఓటరు జాబితాలను అందిస్తారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండిలో సుంకె రవిశంకర్, హు స్నాబాద్లో వొడితల సతీశ్కుమార్ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీలు తీసి, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.
మంథని, నవంబర్ 8: మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ బుధవారం సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు. భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కుల శ్రీహర్షిణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, బీఆర్ఎస్ సీనియర్ నేత మాదాడీ శ్రీనివాస్రెడ్డి, ప్రముఖ న్యాయవాది శశిభూషణ్కాచేతో కలిసి మంథనిలోని రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్వో హనుమాన్నాయక్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, మంథని ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. గెలిపిస్తే ఇక్కడి ప్రజలను కుటుంబసభ్యుల్లా భావించి సేవ చేస్తానని ప్రకటించారు. కాగా, నామినేషన్ దాఖలు చేసిన ఆయనకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నామినేషన్ సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో పట్టణం గులాబీ మయమైంది. ముందుగా సుంకె రవిశంకర్ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నామినేషన్ పత్రాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తిరిగి ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల, బోయినపల్లి, గంగాధర, రామడుగు మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఆలయం నుంచి చొప్పదండికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పట్టణంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి ర్యాలీలో పాల్గొనగా.. మహిళలు బోనాలు, బతుకమ్మలు, మంగళ హారుతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ చౌరస్తా నుంచి సుమారు ఐదు వేల మందితో కలిసి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అంతకు ముందు చొప్పదండి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వినోద్కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, తదితరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రపుల్ దేశాయ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలి వచ్చారు. కరీంనగర్లోని అన్ని డివిజన్లు, కరీంనగర్రూరల్, కొత్తపల్లి మండలాల నుంచి మహిళలు, పురుషులు తండోప తండాలుగా కదిలారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే మైదానంలో జమైన జనం అక్కడి నుంచి తెలంగాణచౌక్కు చేరుకుని చాలా సేపు సంబురాలు చేసుకున్నారు. డప్పు వాయిద్యాలు, ఒగ్గుడోలు ప్రదర్శనలతోపాటు మహిళలు బతుకమ్మలు, బోనాలతో ర్యాలీలో కలిసి వచ్చారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మంత్రి తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుని స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి, యజ్ఞవరాహస్వామి ఆలయాల్లో సతీమణి రజిత, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
కోరుట్ల/ మారుతీనగర్, నవంబర్ 8: కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముందుగా మెట్పల్లి పట్టణంలోని శ్రీ పంచముఖి ఆంజనేయ అయ్యప్ప స్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో తన తండ్రి ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, తల్లి సరోజన, భార్య దీప్తి, కూతురు షాషా, సోదరి డాక్టర్ సమతతో కలిసి పూజలు చేశారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు తన కుటుంబసభ్యులతో కలిసి సాదాసీదాగా కోరుట్ల ఆర్డీవో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం బయటకు వచ్చిన సంజయ్కి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ నామినేషన్ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఉదయం తన స్వగ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హుస్నాబాద్లోని శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయంలో సతీమణి డాక్టర్ షమిత, తల్లి సరోజినీదేవి, కొడుకు ఇంద్రనీల్బాబు, కుటుంబ సభ్యులు, బంధువులు, ముఖ్య నాయకులతో కలిసి పూజలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో తన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. గాంధీచౌక్, మల్లెచెట్టు చౌరస్తా, మెయిన్రోడ్డు ద్వారా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగగా, డప్పు చప్పుళ్లు.. మహిళల నృత్యాలు.. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో పట్టణం మార్మోగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఐవోసీ భవనంలోని ఆర్వో కార్యాలయంలో వొడితల తన నామినేషన్ను దాఖలు చేశారు. వందలాదిగా తరలివచ్చిన జనంతో హుస్నాబాద్ పట్టణం జనసంధ్రమైంది. పట్టణం మొత్తం గులాబీమయమైంది.