కమాన్చౌరస్తా/ కొత్తపల్లి/ కరీంనగర్ రూరల్/ జమ్మికుంట/ వీణవంక/ మానకొండూర్ రూరల్/ శంకరపట్నం/ తిమ్మాపూర్/ గంగాధర/ హుజూరాబాద్టౌన్/ సైదాపూర్/ చొప్పదండి, ఫిబ్రవరి 23 : వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివచ్చారు. ఎత్తు బంగారం, ఎదుర్కోళ్లతో మొక్కులు చెల్లించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా, వైద్యాధికారులు శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయం కల్పించారు.
అయితే కొన్నిచోట్ల ట్రాఫిక్ నిలిచి పోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. రేకుర్తి సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంగణం జనంతో కిక్కిరిసి పోయింది. అమ్మవార్ల దర్శనానికి 3 నుంచి 4 గంటకుపైగానే క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. దర్శనం కోసం వచ్చే భక్తులకు తిప్పలు తప్పులేదు. క్యూలో భక్తులకు తాగు నీరుకూడా అందకపోవడంతో అవస్థలు పడ్డారు. పలువురు యువతులు ఉదయం సొమ్మసిల్లి పడిపోగా వైద్యులు అక్కడికి చేరుకుని సేవలందించారు. పలువురు పోలీసు అధికారులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, షెడ్ల వద్ద సేవలందించినా, గద్దెల వద్ద భక్తులను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ప్రసిద్ధి చెందిన రేకుర్తి ఆలయానికి దాదాపు 5 లక్షల వరకు భక్తులు తరలివచ్చినా ఉన్నతాధికారులు ఇటువైపు చూసీచూడనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, చింతకుంటలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 50 వేల పైచిలుకు భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క-సారలమ్మను ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్గౌడ్ దంపతులు దర్శించుకున్నారు. ఇక్కడ ఆలయ ఈవో అనిల్, ఎంపీటీసీ తిరుపతి నాయక్, నిర్వాహకుడు తిరుపతి, క్లర్క్ పాత మహేశ్ పాల్గొన్నారు.
రేకుర్తి సమ్మక్క, సారలమ్మను ఎంపీ బండి సంజయ్ కుమార్, మేయర్ వై సునీల్ రావు దంపతులు వేర్వేరుగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం జాతర ప్రాంగణానికి చేరుకున్న మేయర్ సునీల్ రావుకు స్థానిక కార్పొరేటర్లు సుదగోని మాధవీకృష్ణ గౌడ్, రాజశేఖర్, జాతర కమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు పొన్నం అనిల్కుమార్ గౌడ్, ఈవో మారుతి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే, నగరానికి చెందిన కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో జాతరకు హాజరై మొక్కులు చెల్లించారు.
రేకుర్తిలో సమ్మక్క, సారలమ్మ జాతర వద్ద పోలీసులు, సాన్వి, ఢిల్లీ డిఫెన్స్, తేజస్ అకాడమీ వలంటీర్లు పటిష్టంగా బందోబస్తు నిర్వహించారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు, గద్దెల వద్ద, పార్కింగ్ వద్ద వలంటీర్లు భక్తులకు అందుబాటులో ఉంటూ చేదోడుగా నిలిచారు. ఈ క్రమంలో కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల కోసం వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్కు చెందిన ముస్లిం వృద్ధురాలు రషీద బంగారంతో రేకుర్తి ఆలయానికి వచ్చి మొక్కు చెల్లించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆనవాయితీ ప్రకారం కుటుంబంతో కలిసి వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించినట్లు తెలిపింది. కరీంనగర్ మండలం నగునూర్, ఇరుకుల్ల, బొమ్మకల్ శివారులోని హౌసింగ్బోర్డు కాలనీలో సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంగణాలు భక్తులతో జనసంద్రంగా మారాయి. ఆయా చోట్ల మేడారం పూజారులు కృష్ణ, సమ్మయ్య అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
నగునూర్లో వనదేవతలను మాజీ ఎంపీ వినోద్కుమార్ దర్శించుకున్నారు. కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ దిలీప్గౌడ్, వెంకన్న, నెల్లి రాజేశం, కన్నమల్ల కొటేశ్వరు. బోగురి ఆంజనేయులు, బత్తిని విక్రమ్ గౌడ్, దాసరి రాజేశ్కన్న, బత్తిని అంజయ్య, రాజు, ఎంపీటీసీలు వినయ్సాగర్, అంకమల్ల శ్రీనివాస్ మొక్కులు చెల్లించారు.
ఇరుకుల్ల గ్రామంలో జాతర వద్ద భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను కమిటీ చైర్మన్ బుర్ర చంద్రయ్య గౌడ్, జగన్ మోహన్రెడ్డి, గంధం రమేశ్, బుర్ర రమేశ్, మల్లేశం గౌడ్, సమ్మయ్య, బాబు, ప్రసాద్ పర్యవేక్షించారు. బొమ్మకల్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో సమ్మక్క, సారలమ్మ జాతర ప్రత్యేకాధికారి, తహసీల్దార్ నవీన్కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఆర్ఐ రజినీకాంత్తోపాటు జాతర నిర్వాహకులు ముత్యం రమేశ్ గౌడ్, అనిల్,
మిర్యాల్కర్ నరేందర్, తోట మోహన్, ముత్యం తిరుపతిగౌడ్, సాగర్, బలం లింగమూర్తి, కిరణ్కుమార్, సాయిల శివయ్య, గోష్కి శంకర్, గాలిపెల్లి శ్రీనివాస్ పర్యవేక్షించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్, మండలంలోని తనుగుల గ్రామంలో వన దేవతలు సమ్మక్క-సారలమ్మ కొలువుదీరడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవార్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో కమిషనర్ ఎండీ ఆయాజ్, కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ సీఐ రవి బందోబస్తు ఏర్పాటు చేశారు.
వీణవంకలో సుమారు లక్ష మంది భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకోగా, చల్లూరు, పోతిరెడ్డిపల్లి, కోర్కళ్లో లక్ష మంది వరకు మొక్కులు చెల్లించుకున్నారు. వీణవంకలో అమ్మవార్ల గద్దెల వద్ద రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెలించుకున్నారు. రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని, రైతులకు పంటలు పుష్కలంగా పండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్, యప్టీవీ సీఈవో ఉదయ్నందన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సమ్మిరెడ్డి, బాలకిషన్రావు, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ వనమాల-సాధవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ఉత్సవకమిటీ చైర్మన్లు పాడి రామకృష్ణారెడ్డి, గడ్డం కుమారస్వామి, పరిపాటి గోపాల్రెడ్డి, హరీణ్రెడ్డి, పవన్కుమార్రెడ్డి, సభ్యులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలంలోని కొండపల్కల, దేవంపల్లి, లింగాపూర్, వేగురుపల్లి-నీరుకుళ్ల గ్రామాల్లో సమక్క-సారలమ్మ జాతరకు ప్రముఖులు, అధికారులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కొండపల్కలలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. వీరి వెంట మాజీ సర్పంచులు రామంచ గోపాల్ రెడ్డి, రొడ్డ పృథ్వీరాజ్, ఎంపీటీసీ గట్టు రజిత-శ్రీధర్, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు అడప శ్రీనివాస్, నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, మాజీ ఎంపీటీసీ జనగామ శంకర్ గౌడ్, పార్టీ గ్రామాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, నాయకులు కడారి రమేశ్ తదితరులు ఉన్నారు. ఆయా జాతర కమిటీల చైర్మన్లు రేణికుంట శంకర్, కొత్తి శ్రీనివాస్ రెడ్డి, పొల్సాని దేవేందర్ రావు, చర్లపల్లి నర్సయ్య, సభ్యులు పాల్గొన్నారు.
శంకరపట్నం మండలం కేశవపట్నంతో పాటు ఆముదాలపల్లి, గద్దపాక గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల తాకిడితో కిక్కిరిసింది. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్జీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకరపట్నం, హుజూరాబాద్, మానకొండూర్, సైదాపూర్ మండలాలకు చెందిన పంచాయతీరాజ్కు చెందిన 75 మంది సిబ్బంది వాటర్ ట్యాంకర్లతో మూడు షిప్టుల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేసినట్లు ఎంపీడీవో శ్రీవాణి తెలిపారు. జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి, ఈవో మారుతీరావు, జాతర కమిటీ సభ్యులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ, నల్లగొండ, కొత్తపల్లి, వచ్చునూరు, సైదాపూర్ మండలం వెన్నెంపల్లి, సైదాపూర్ గ్రామాల్లో సమ్మక, సారలమ్మ జాతరలో భక్తులు పాల్గొని, వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్ఎండీ ఎస్ఐ చేరాలు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
గంగాధర మండలం బూరుగుపల్లిలో సమ్మక్క, సారలమ్మను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, జాతర కమిటీ నిర్వాహకులు వారికి సాదర స్వాగతం పలికారు. అలాగే బూరుగుపల్లి, మధురానగర్ గ్రామాల్లో అమ్మవార్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు.
హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద సమ్మక, సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పట్టణ సీఐ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏర్పాట్లను జాతర కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ గాలీబ్ కిరణ్ తదితరులు పర్యవేక్షించారు. కాగా, పట్టణంలోని ఓ కిరాణా షాపులో హరీశ్ అనే వ్యక్తి తన పెంపుడు కుకపిల్లకు ఎత్తు బంగారం తూకం వేయించి, మేడారం తీసుకెళ్లాడు. కుక్క పిల్లకు ఎత్తు బంగారం ఇవ్వడాన్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు.
చొప్పదండి, రాగంపేట, గుమ్లాపూర్, ఆర్నకొండ, సాంబయ్యపల్లెలో వనదేవతలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకమిటీ నిర్వాహకులు, కులసంఘాలు, యువజనసంఘాల సభ్యులు పాల్గొన్నారు. రామడుగు మండలంలోని గుండిలో వనదేవతలను మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి దర్శించుకున్నారు. వారి వెంట రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జితేందర్రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, ప్రవీణ్, శ్యాం తదితరులు ఉన్నారు.
హుజూరాబాద్, ఫిబ్రవరి 23: సమ్మక్క, సారలమ్మ గొప్ప వీరవనితలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కొనియాడారు. శుక్రవారం పట్టణపరిధిలోని రంగనాయకుల గుట్ట, మండలంలోని జూపాకలో సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల్లో వారు పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారిని జాతర కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి, డైరెక్టర్లు సన్మానించారు. ఇక్కడ కౌశిక్రెడ్డి సతీమణి శాలినీరెడ్డి, చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.