గవర్నర్ తమిళిసై తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తమ ఎన్నో ఏండ్ల కల నెరవేరుతున్న తరుణంలో ఆమె ఆర్టీసీ విలీన బిల్లును మోకాలడ్డుతుండడంపై భగ్గుమంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించి ఆమోదానికి పంపినా.. ఆమె న్యాయ సలహా పేరిట కాలయాపన చేయడంపై మండిపడుతున్నారు. శనివారం కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల ఎదుట కార్మిక సంఘాల నేతలతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉదయం రెండు గంటలపాటు బస్సులు నిలిపి, తమిళిసై తీరును తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ 43 వేల మంది కార్మిక కుటుంబాల మేలు కోరుతుంటే.. ఆమె బిల్లును అడ్డుకొని రాజకీయం చేయడం తగదన్నారు. గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకొనేలా వ్యవహరిస్తే ఎలాంటి సమస్య ఉండదని.. రాజకీయాలకు దిగితే మాత్రం తాము కూడా సిద్ధమేనని కొందరు కార్మిక సంఘాల నాయకులు తేల్చిచెప్పారు.
– కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆ సంస్థ ఉద్యోగుల చిరకాల కోరిక. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ డిమాండ్పై ఆర్టీసీ ఉద్యోగులు అనేక సార్లు సమ్మెలు చేశారు. అప్పుడు వీరి గోడును పట్టించుకున్న వారు కరువయ్యారు. ఎన్ని ఉద్యమాలు చేసినా, సమ్మెలతో సంస్థను స్తంభింపచేసినా అప్పటి ప్రభుత్వాలకు చెవికెక్క లేదు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ 2014లో ఈ సంస్థ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలు పెరిగేలా చేశారు. అప్పటి నుంచి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తారనే ఆశతో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. అనుకున్నట్టే గత నెల 31న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లును పాస్ చేయాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అయితే, మంత్రివర్గ తీర్మానం మేరకు ముసాయిదా బిల్లు గవర్నర్ తమిళిసై ఆమోదానికి పంపించారు. న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాతనే ముసాయిదా బిల్లును ఆమోదిస్తానని గవర్నర్ ప్రకటించడం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ అందుబాటులో లేక పోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పాస్ చేయాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి కాగా, ఆర్టీసీ ఉద్యోగులు శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అంధకారంలోకి నెట్టొద్దు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది మా చిరకాల బలమైన కోరికని, తమ గోడును పట్టించుకుని ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలుపాలని గవర్నర్ తమిళిసైని టీఎంయూ నాయకులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కోరారు. అరకొర వేతనాలతో, తినీ తినక ఉద్యోగాలు చేస్తున్నామని, తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక పోతున్నామని, సరైన వైద్యం కూడా చేయించులేక పోతున్నామని, తమ సంస్థ ప్రభుత్వంలో విలీనమైతే ఈ బాధలన్నీ పోతాయన్న ఆత్మ విశ్వాసంతో తామంతా ఉన్నామని చెబుతున్నారు. వెంటనే ముసాయిదా బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. తమ పొట్టకొట్టే పని చేయొద్దని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టొద్దని కోరుతున్నారు. గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకొనేలా వ్యవహరిస్తే ఎలాంటి సమస్య ఉండదని.. రాజకీయాలకు దిగితే మాత్రం తాము కూడా సిద్ధమేనని కొందరు కార్మిక నాయకులు తేల్చిచెప్పారు.
డిపోల ఎదుట నిరసనలు
టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం థామస్రెడ్డి పిలుపు మేరకు శనివారం కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 11 డిపోల ఎదుట ఈ నిరసనలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బాడ్జీలు ధరించారు. ఉదయం 5.30 గంటలకు కరీంనగర్-1 డిపోకు పెద్ద సంఖ్యలో చేరుకొని, గేటుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు డిపో ఎదుట నిరసన వ్యక్తం చేసిన డ్రైవర్లు, కండక్టర్లు ఆ తర్వాత విధుల్లో చేరారు. టీఎంయూ డిపో కార్యదర్శి మనోహర్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు తెలిపారు. కరీంనగర్-2 ఎదుట ఎంఆర్ రెడ్డి, హుజూరాబాద్ డిపో ఎదుట పీఎల్ఎన్ రావు, ఎం రవీందర్ తదితరులు, మంథనిలో కేకే రెడ్డి, కోరుట్లలో ఈఆర్సీ రెడ్డి, జగిత్యాలలో పత్తిపాక రాములు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మహిళా కండక్టర్లు, మెకానిక్లు, కంట్రోలర్లు ఆందోళనల్లో పాల్గొన్నారు.
కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు
ఆర్టీసీనే నమ్ముకొని జీవితం గడుపుతున్న కార్మికులను గవర్నర్ ఇబ్బంది పెట్టొద్దు. పేద, మధ్య తరగతికి చెందిన వారే ఇందులో ఎక్కువగా ఉన్నరు. వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతామని ఎంతో అశతో ఎదురు చూస్తున్నరు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నిర్ణయం తీసుకున్నరు. తీరా న్యాయ సలహా పేరుతో గవర్నర్ బిల్లును ఆపడం బాధాకరంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా వేలాది కుటుంబాల్లో వెలుగు నింపే బిల్లును గవర్నర్ ఆమోదించాలి. కాలయాపన చేయడం సరికాదు.
– రవీందర్గౌడ్, చార్ట్ కంట్రోలర్, (కరీంనగర్ డిపో-1)
మానవతావాదిగా ఆమోదించాలి
ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న మహిళా కార్మికుల కష్టాన్ని గుర్తించి మానవతా వాదిగా గవర్నర్ ఆర్టీసీ బిల్లును ఆమోదించాలి. కార్మికుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు సంతోష పడం. సంబురాలు చేసుకున్నం. కుటుంబమంతా ఆనంద పడుతున్న సమయంలో గవర్నర్ ఈ బిల్లును ఆపడంతో షాక్ గురైనం. 43 వేల మంది కుటుంబాలకు సంబంధించిన బిల్లును ఆమోదించి, ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి.
– మాధవి, అసిస్టెంట్ డిపో క్లర్క్, (కరీంనగర్ డిపో-1)
గవర్నర్ తీరు బాధాకరం
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళిసై న్యాయ సలహా పేరుతో అడ్డుకోవడం బాధాకరం. ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్దే. కానీ, పేద, మధ్య తరగతి చెందిన కుటుంబాల జీవితాలతో ఆడుకోవడం సరికాదు. వీలైనంత తొందరగా బిల్లును అమోదించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా మారామని సంతోష పడుతున్న కార్మికులు ఆశలను వమ్ము చేయొద్దు.
– వీఎల్ నారాయణగౌడ్, కండక్టర్, (కరీంనగర్ డిపో-2)