జమ్మికుంట, జనవరి 26 : ప్రమాదమో.. ఆత్మహత్యో తెలియదు కానీ.. కాజీపేట టౌన్ సమీపంలో అండమాన్ సూపర్ఫాస్ట్ రైలు కింద పడి ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకుని మృతి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి మృతదేహాన్ని జమ్మికుంట వరకు అంటే 36 కిలో మీటర్లు ట్రైన్ ఈడ్చుకెళ్లింది. జమ్మికుంటలో రైలును ఆపిన అధికారు లు, మృతదేహాన్ని తీయించారు. ఈ ఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా కేంద్రం నయీంనగర్కు చెందిన గద్వాల ఉప్పలయ్య (70) మున్సిపల్ కార్పొరేషన్ జవాన్గా పనిచేసి రిటైర్డ్ అయ్యా డు. ఉప్పలయ్యకు భార్య ఉపేంద్ర, కొడుకు, కూతురు ఉన్నారు.
కొన్నేళ్ల క్రితం కొడుకు మృతి చెందాడు. అయితే, ఉప్పలయ్య గురువారం సా యంత్రం కాజీపేట టౌన్ వద్ద పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదమో.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడో..? తెలియదు కానీ, అతని శరీరం అండమాన్ రైలు ఇంజిన్ ముందు భాగంలో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఎస్ క్యాబిన్ ఉద్యోగి గుర్తించారు. హసన్పర్తి రోడ్, ఉప్పల్ స్టేషన్లలో రైలుకు లైన్ క్లియర్ చేసిన అధికారులు, జమ్మికుంట స్టేషన్కు సమాచారం అందించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్లో రైలుకు హాల్టింగ్ ఇచ్చారు. అప్పటికే అప్రమత్తమైన అధికారులు, సిబ్బందితో ఇంజిన్లో చిక్కుకున్న మృతదేహాన్ని గంటసేపు శ్రమించి తొలగించారు.
ట్రైన్కు లైన్ క్లియర్ చేశా రు. అయితే ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అనే చీటి మృతదేహం దుస్తుల్లో దొరికనట్లు స్థానికులు తెలిపారు. అతడి జేబులో దొరికిన ఆధారాల ప్రకారం హన్మకొండలోని బంధువులకు సమాచారం అందించారు. ఉప్పలయ్య మృతిపై వివరణ కోరగా.. ‘ఎలా చనిపోయాడో.. మాకు కూడా తెలియదు’ అని బంధువులు చెప్పుకొచ్చారు.