రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ర్టాలకు తరలుతున్నది. ఈ దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. లబ్ధిదారుల నుంచి తక్కువ రేట్కే రావడం, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా నడుస్తున్నది. కొందరు ఇల్లిల్లూ తిరుగుతూ రైస్ను సేకరిస్తుండగా, మరికొందరు డీలర్ల సహకారంతో నేరుగా రేషన్ దుకాణాల నుంచే దారి మళ్లిస్తుండడం విస్తుగొలుపుతున్నది. అధికారులు దాడులు చేస్తున్నా, పూర్తి కట్టడిలో మాత్రం శాఖల మధ్య సమన్వయ లోపాన్ని కండ్లకుగడుతున్నది.
పెద్దపల్లి, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో ప్రతి నెలా ఈ అక్రమ దందా జోరుగా సాగుతున్నది. పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులే ఈ దందాను జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి, వాటిని సుల్తానాబాద్లోని మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి మహారాష్ట్రలోని గోండియాకు తరలిస్తున్నట్లు సమాచారం. మంథనిలో ముగ్గురు అక్రమార్కులు గ్రామాల నుంచి సేకరిస్తూ హద్దులు దాటిస్తున్నట్లు తెలిసింది.
ఇక రామగిరి మండలానికి చెందిన మరోవ్యక్తి ముత్తారం, కమాన్పూర్ మండలాల నుంచి బియ్యాన్ని సేకరించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. మంథని పట్టణానికి చెందిన ఓ అక్రమార్కుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాటారం, మహాముత్తారం, మల్హార్, పలిమెల, మహదేవ్పూర్ మండలాల నుంచి సేకరిస్తూ మహారాష్ట్రకు తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నట్లు తెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే అక్రమారులు రెచ్చిపోతుండగా, విషయం తెలిసినా యంత్రాంగం కట్టడి చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వాహనాన్ని మంథని నుంచి గోదావరిఖని వైపు రేషన్ బియ్యం తరలిస్తుండగా మంథని బస్సు డిపో వద్ద పట్టణానికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ట్రాలీలో దాదాపుగా 30 క్వింటాళ్ల బియ్యపు సంచులు ఉన్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యం రీసైక్లింగ్ పలువురు అక్రమార్కులకు లాభసాటి వ్యాపారంగా మారింది. దీంతో పలువురు మిల్లర్లు తమ అక్రమ దందా బాగోతం బయటపడకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. రేషన్ దుకాణాల నుంచి దొడ్డిదారిన వచ్చిన బియ్యాన్ని ఆగమేఘాలపై ప్రభుత్వ సంచుల్లోకి (ఎఫ్సీఐ సంచుల్లోకి) మార్చేయడంతోపాటు రికార్డులను తారుమారు చేస్తున్నారు. లబ్థిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని తిరిగి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో 30శాతం జరిగిన రీసైక్లింగ్ దందా నేడు రెట్టింపులోకి చేరడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. అయితే బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు, పోలీసుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అక్రమారులకు కలిసివస్తోంది.
జిల్లాలో ప్రధానంగా దందా రెండు రకాలుగా జరుగుతున్నది. ఒకటి లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని ఇంటింటికీ తిరిగి కొంతమంది సేకరిస్తుండగా, రెండోది రేషన్ దుకాణాల నుంచే పక్కదారి పట్టించడం. ఇందులో రేషన్ డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని, వారికి బియ్యం బదులు డబ్బులు ఇస్తూ, బియ్యాన్ని అక్రమార్కులకు అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అధికారులు పలు రేషన్ దుకాణాల్లో జరిపిన తనిఖీల్లో కేటాయించిన బియ్యం నిల్వలు, పంపిణీకి మధ్య భారీ వ్యత్యాసాలు ఉండడమే నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ క్రమంలో డీలర్లకు నోటీసులు కూడా జారీ చేశారు.
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. దాడులు ఉధృతంగా చేస్తున్నాం. టాస్క్ఫోర్స్ సిబ్బందితో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తున్నాం. జనవరి నుంచి ఇప్పటివరకు 349.75 క్వింటాళ్ల రైస్ను పట్టుకొని 56 మందిని అరెస్ట్ చేశాం. బియ్యం పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. దీనికి పూర్తిగా చెక్పెట్టేందుకు ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా గ్రామం నుంచి డివిజన్ స్థాయి దాకా బృందాలను ఏర్పాటు చేస్తున్నాం.
– ప్రేంకుమార్, డీఎస్వో పెద్దపల్లి
ఈ ఫొటోలో కనిపిస్తున్న వాహనంలో రేషన్ బియ్యం ఉన్నాయి. మంథని మండలంలోని నిరుపేదల కోసం కేటాయించిన ఈ రైస్ను ఎంఎల్ఎల్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు చేరిన తర్వాత లబ్ధిదారులకు పంచాలి. కానీ, ఈ నెల 9న మంచిర్యాలకు తరలిస్తుండగా మంథనిలోనే ప్రధాన రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ సంచుల్లోనే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండడాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. ఈ రైస్ నేరుగా రేషన్ దుకాణం నుంచే బయటికి రావడం దందా ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.