పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో మెడికల్ కాలేజీ బోధనకు రెడీ అయింది. సింగరేణికి చెందిన 21 ఎకరాల స్థలంలో 510కోట్లతో దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే మొదటి విడుత కంప్లీట్ కాగా, రెండో విడుత శరవేగంగా సాగుతున్నది. ఎంబీబీఎస్ ఫస్టియర్లో 150 సీట్లు కేటాయించగా, బుధవారం నుంచే సెకండ్ ఫేస్ కౌన్సెలింగ్ మొదలైంది. విడుతల వారీగా సీట్లు భర్తీ అయ్యే అవకాశముండగా, ఈ నెల 15 నుంచే తరగతులు ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇప్పటికే బోధనకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేయగా, విద్యార్థినీవిద్యార్థుల కోసం వేర్వేరుగా రెండు వసతి గృహాలను సిద్ధం చేసింది.
పెద్దపల్లి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రామగుండం మెడికల్ కాలేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూడు విడుతలుగా చేపడుతున్న పనుల్లో.. తొమ్మిదినెలల్లోనే తొలి విడుత పూర్తికాగా, రెండో విడుత శరవేగంగా సాగుతున్నాయి. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో 150 మంది సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు జాతీయ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇవ్వగా, ఈనెల 15 నుంచే బోధనకు యంత్రాం గం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. నూతన భవనం తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే 100 పడకలతో ఉన్న గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ దవాఖానను 330 పడకల స్థాయికి పెంచి, వైద్య కళాశాలను బోధనాస్పత్రిగా ప్రకటించారు. కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను నియమించారు.
510కోట్లతో నిర్మాణం
రామగుండం మెడికల్ కళాశాల నిర్మాణానికి సింగరేణి సంస్థ 21ఎకరాల స్థలం ఇచ్చింది. అందులో 510కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. మూడు విభాగాలుగా పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు శరవేగంగా చేస్తున్నారు. మొదటి దశ 66కోట్ల వ్యయంతో కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఫస్టియర్ తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం పూర్తి చేసుకునేలా ఈ మొదటి దశలో చేశారు. రెండో దశ 160కోట్లతో పనులు చేస్తున్నారు.
ఈ నెల 15 నుంచే తరగతులు..
మొదటి విడుత కౌన్సెలింగ్లో రామగుండం మెడికల్ కాలేజీకి అవకాశం దొరకలేదు. ఈనెల 2వ తేదీ నుంచే రెండో విడుత కౌన్సెలింగ్ మొదలైంది. వచ్చే నెల 14 వరకు విడుతల వారీగా సీట్ల భర్తీ జరగనున్నది. అయితే ఈనెల 15వ తేదీ నుంచే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.
బోధనకు సిద్ధంగా..
మొదటి విడుత పనులకు తుదిమెరుగులు అద్దుతున్నారు. ఆర్అండ్బీ డీఈఈ, గోదావరిఖని సెక్షన్ ఆఫీసర్ ఎం ఇజాఫర్, ఏఈ మహ్మద్ జావీద్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడుత గ్రౌండ్ ఫ్లోర్లో రెండు లెక్చరర్ హాల్స్, కార్యాలయం, అనాటమీ ల్యాబ్, డిసిక్షన్ హాల్, మ్యూజియం, లాకర్రూం, రెండు చైల్డ్కేర్ రూమ్స్, రెండు డెమో రూమ్స్, రెండు క్లినికల్ రూమ్స్, హిస్టాలజీ ల్యాబ్, నాన్టీచింగ్ స్టాఫ్ రూం, కోల్డ్ స్టోరేజ్ రూం నిర్మించారు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్టెన్షన్ బిల్డింగ్ పనులు చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో లైబ్రరీ రూం, ఫొటోకాపీ రూం, ఎలక్ట్రికల్ రూం, ఈ లైబ్రరీ, రీడింగ్రూం ఫ్యాకల్టీ, రీడింగ్ రూం రెసిడెన్సీస్, లైబ్రేరియన్, స్టాక్ రూం, కాలేజ్ కౌన్సిల్, సర్వర్రూం, స్టాఫ్రూం, అసిస్టెంట్ డైరెక్టర్రూం, వైస్ ప్రిన్సిపాల్ రూంలు మొత్తంగా 20 నిర్మించారు. థర్డ్ ఫ్లోర్లో తొమ్మిది స్కిల్ ల్యాబ్లు, హిస్ట్రో పైథాలజీ ల్యాబ్, జనరల్ ఫొటోగ్రఫీ సెక్షన్, సైఫో పైథాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. రెండో విడుతలో గ్రౌండ్ ఫ్లోర్లో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్, రెండు లెక్చర్ హాల్స్, ఫస్ట్ ఫ్లోర్లో మైక్రో బయాలజీ ల్యాబ్, వైరాలజీ సర్వీస్ ల్యాబ్, అమూలాలజీ సర్వీస్ ల్యాబ్, బ్యాక్రోనాలజీ, ప్యారాసిటాలజీ సర్వీస్ ల్యాబ్, సెరోలాజీ సర్వీస్ ల్యాబ్, సెకండ్ ఫ్లోర్లో ఫార్మాకాలేజీ డిపార్ట్మెంట్, క్లినికల్ ఫ్రామా కాలజీ ల్యాబ్, క్ంయపూటర్ అసిస్ట్ లర్నింగ్ ల్యాబ్, థర్డ్ ఫ్లోర్లో ఫోరెన్సిక్ మెడిసిన్ టెక్సాలజీ డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్, మెడికల్ మ్యూజియంలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి దశలో పూర్తయిన నిర్మాణాలతో ఎంబీబీఎస్ తరగతుల బోధనకు పూర్తి స్థాయి ఫర్నిచర్ను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
విద్యార్థినీవిద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి
రెండో దశలో మెడికోలకు సంబంధించిన హాస్టల్ నిర్మాణాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రైవేట్గా రెండు చోట్ల హాస్టల్ వసతి సౌకర్యాలను కల్పించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సింగరేణి అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు ప్రత్యేక చొరవతో వీటిని సమకూర్చారు. గోదావరిఖనిలోని జీఎం కార్యాలయం సమీపంలోని ట్రాన్సిట్ హాస్టల్ను బాలుర వసతి గృహానికి, శారదానగర్లోని మరో ట్రాన్సిట్ హాస్టల్ను బాలికల వసతి గృహానికి కేటాయిస్తూ అవసరమైన మరమ్మతులు చేసి వసతికి సిద్ధం చేశారు.
ప్రారంభానికి సిద్ధం చేస్తున్నాం,.
ఈనెల 15 నుంచి తరగతులు ప్రా రంభమయ్యే అవకాశమున్నది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే మొదటి విడుత పనులు పూర్తయ్యాయి. రెండో విడుత చకచకా సాగుతున్నాయి. వీలైనంత త్వరలోనే కళాశాల ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేస్తున్నాం.
– ఎం. ఇజాఫర్, ఆర్అండ్బీ డీఈఈ, గోదావరిఖని సెక్షన్ ఆఫీసర్
కార్మికుల బిడ్డలకు వరం
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి, ఇతర కార్మికుల బిడ్డలకు రామగుండం మెడికల్ కళాశాల వరంగా మారనున్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చి, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే కార్మికుల, కర్షకుల కన్నీరు తుడిచారు. సుపరిపాలనను అందించారు. రాష్ట్రంలోనే పారిశ్రామిక నియోజకవర్గమైన రామగుండంలో ఎవరూ.. ఎన్నడూ ఊహించని విధంగా మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. ఈ ప్రాంత కార్మికులు, కర్షకులకు అత్యంత మెరుగైన వైద్యం అందుతుంది. కార్మికుల బిడ్డలకు వైద్య విద్య చేరువవుతుంది. కార్మిక క్షేత్రానికి వైద్య కళాశాల ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే, రామగుండం.