వేతన పొదుపునకు ప్రభుత్వ భరోసా
మంత్రి కేటీఆర్ నిర్ణయం
మొత్తంగా 103 కోట్ల లబ్ధి
సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి 30 కోట్లు
తొలి విడుతగా 15 కోట్లు
మంజూరు చేసిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జూన్ 14 (నమస్తే తెలంగాణ) :ఆది నుంచి నేతన్నకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారు, అనేక కార్యక్రమాలతో బాసటగా నిలుస్తున్నది. కరోనా సంక్షోభంలోనూ చేయూత (పొదుపు) పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నది. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో ప్రకటించగా, రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకు 103కోట్ల లబ్ధికలుగనున్నది. అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రం అభివృద్ధికి 30 కోట్లు ఇస్తున్నట్లు హామీ ఇచ్చి, తొలివిడతగా 15కోట్లు మంజూరు చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కరోనా సంక్షోభంలోనూ నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేయూత (పొదుపు) పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని 25వేల మంది చేనేత, 10వేల మంది మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపా రు. పొదుపు పథకంలో నేతన్నలంతా విధిగా భా గస్వాములు కావాలని మంత్రి పిలుపు నిచ్చారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో చేనేత జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పొదుపు పథకంపై దిశా నిర్ధేశం చేశారు. చేయూత పథకం ద్వారా కరోనా కష్టకాలంలో నేతన్నలకు రూ.103 కోట్ల మేర లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. గతేడాది గడువుకు ముందే నిధులు పొందేలా నేతన్నలకు వెసులు బాటు కల్పించినట్లు పేర్కొన్నారు. చేయూత పథకం కొనసాగించడం వల్ల రాష్ట్రంలోని 25వేల మంది చేనేత, 10వేల మందికి పైగా మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇందులో చేనేత కార్మికుల వేతన వాటా 8 శాతానికి రెట్టిం పు, మరమగ్గాల కార్మికుల వాటా 8శాతానికి రెట్టింపు డబ్బులను ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందని తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ పథకం కేవలం చేనేత కార్మికులకే వర్తించేదని, తెలంగాణ వచ్చిన తర్వాత మరమగ్గాల కార్మికులకు వర్తింప చేసినట్లు తెలిపారు. చేనే త కార్మికుడితో పాటు డెయ్యర్స్, డిజనైర్స్, వీవ ర్లు, వైండర్లు, ఇతర నేత పనివారందరూ ఈ పథకంలో చేరవచ్చని సూచించారు. గత ప్రభుత్వం లో ఈ వాటా 8శాతమే ఉండగా, తెలంగాణ ప్ర భుత్వం కార్మికుడి వాటాతో కలిపి 16శాతానికి పెంచిందన్నారు. కరోనా కష్టకాలంలో చేయూత నిచ్చిన ఈ పథకాన్ని కొనసాగించాలని నేతన్నలు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని కొనసాగించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి రూ.30 కోట్లు
సిరిసిల్ల జిల్లా కేంద్రం అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇందులో తొలి విడతగా రూ.15 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. పట్టణ అభివృద్ధి కోసం పురపాలక సంఘానికి రూ.30 కోట్ల నిధులు కేటాయించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్లు మంత్రి కేటీఆర్ను కలిసి కోరారు. అందుకు సానుకూలంగా స్పందించి, తొలివిడతగా రూ.15 కోట్లు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాఫీని నేతలకు అందజేశారు. నిధులు విడుదల చేసినందుకు పురపాలక సంఘ సభ్యుల పక్షాన నేతలంతా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కరోన కష్టకాలంలో ప్రజలకు అండగా నిలువాలని మంత్రి నేతలకు సూచించారు. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులంతా చొరవ చూపాలన్నారు. అందుకు తనవంతు కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.