జిల్లాలో వర్షం మళ్లీ జోరుగా కురిసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 62.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రోజు గెరువిచ్చిన వాన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నది. ఫలితంగా చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరుతున్నది. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. జిల్లాలోని మోయతుమ్మెద వాగు నుంచి ఎల్ఎండీ జలాశయంలోకి భారీ వరద వచ్చి చేరుతోంది. అక్కడక్కడా రోడ్లపై నుంచి వరద పారడంతో రవాణాకు ఆటంకం కలిగింది. గన్నేరువరం మండల కేంద్రంలో ఒక ఇంటిపై పిడుగుపడింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా అతలాకుతలం అవుతోంది. సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఉదయం 62.1 మిల్లీ మీటర్ల వర్షపా తం నమోదైంది. జమ్మికుంటలో అత్యధికంగా 100.2, ఇల్లందకుంటలో 98.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇటు గన్నేరువరంలో 86.0, చిగురుమామిడిలో 76.8, సైదాపూర్లో 73.4, హుజూరాబాద్లో 72.6, గంగాధరలో 39.4, రామడుగులో 39.2, చొప్పదండిలో 41.0, కొత్తపల్లిలో 35.2, కరీంనగర్లో 46.8, తిమ్మాపూర్లో 64.6 మిల్లీ మీటర్ల వ ర్షం కురిసింది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా జిల్లా ప్ర ణాళికా శాఖ అధికారులు వర్ష పాతం నమోదు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మానకొండూర్ మండలం పోచంపల్లిలో 49.0, కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడులో 40.5 అధిక వర్షం కురిసింది.
పొంగిన వాగులు, వంకలు
తిమ్మాపూర్, చిగురుమామిడి, తదితర మండలాల్లో విస్తరించి ఉన్న మోయతుమ్మెద వాగు ప్రవహిస్తోంది. ఈ వాగు ద్వారా 7,339 క్యూసెక్కుల వరద ఎల్ఎండీ రిజర్వాయర్లోకి వస్తోంది. ఇటు శ్రీరాజరాజేశ్వర జలాశయం ద్వారా 1,530 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం ఎల్ఎండీలో 13.072 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఇటు హుజూరాబాద్ పట్టణాన్ని ఆనుకుని ఉన్న చిలుక వాగు కూడా పొంగిపొర్లుతోంది. గుండ్ల చెరువు, మోడల్ చెరువు, ఇప్పల నర్సింగాపూర్ చెరువల్లోకి భారీ వరద వచ్చి చేరుతోంది. గంగాధర మం డలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ పూ ర్తి స్థాయిలో నిండింది. బూరుగుపల్లి, గట్టుభూత్కూర్, ర్యాలపల్లి చెరువులు పూర్తి స్థాయిలో నిండి మత్తళ్లు పడుతున్నాయి. గట్టుభూత్కూర్ చెరువుకు బుంగపడడంతో స్థానిక సర్పంచ్ దానిని అరికట్టించారు. గంగాధరలోని ఎల్లమ్మ చెరువుకు గండి పడింది. సైదాపూర్ మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాయికల్లోని జలపాతం పడుతోంది. వీణవంకలోని చెక్డ్యాంల మీదుగా పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తోంది.
కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో కురిసిన వర్షానికి తాహెర్ కొండాపూర్ మధ్యనున్న రోడ్డు డ్యాం మీదుగా విపరీతమైన వరద ప్రవహిస్తోంది. దుర్షేడులో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతా ల్లో వరద చేరింది. ఇరుకుల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తపల్లి మండలకేంద్రంలోని చెరువు మత్తడి పడుతుండటంతో రేకుర్తిలోని వాగు పొంగి పొర్లుతోంది. కొత్తపల్లి నుంచి రామగుడు మండలం కొక్కెరకుంట, వన్నారం గ్రామాలకు వెళ్లే రోడ్డు తెగిపోయింది. ఇటు కొత్తపల్లి నుంచి వెలిచాలకు వెళ్లే మార్గంలో విపరీతమైన వరద ప్రవహిస్తోంది. శంకరప ట్నం మండలం ముత్తారం రాజసముద్రం చెరువు మత్తడి పడుతుండటంలో విపరీతంగా వరద వస్తోంది. కాగా, గన్నేరువరం మండల కేంద్రంలో ఓ ఇంటిపై పిడుగు పడి ఇల్లు ధ్వం సమైంది. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, తదితర పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. భారీ వర్షాల నే పథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆ ర్వీ కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.