Iran vs US : ఇరాన్ (Iran) పై అమెరికా (USA) జరిపిన తాజా వైమానిక దాడుల (Airstrikes) కు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతం (Gulf region) లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ క్షిపణి (Missile), డ్రోన్ (Drone) దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఘర్షణల తర్వాత ఇదే తమ అతిపెద్ద ప్రతీకార ఆపరేషన్ అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది. అమెరికా దాడుల్లో బందర్ అబ్బాస్ (Bandar Abbas), ఖెష్మ్ ద్వీపం (Khesm Island) పరిసరాల్లోని క్షిపణి, వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా మారినట్లు సమాచారం.
కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. కువైట్లో అమెరికా పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వలను డ్రోన్లతో ధ్వంసం చేశామని తెలిపింది. అలాగే ఒమన్లోని డుక్మ్ పోర్టులో అమెరికా నౌకాదళానికి చెందిన సదుపాయాలు, బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్బేస్, ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్బేస్పై కూడా దాడులు చేసినట్లు పేర్కొన్నది. జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్లో ఇంధన ట్యాంకులు, మందుగుండు సామగ్రి నిల్వలకు నిప్పు అంటించినట్లు కూడా ప్రకటించింది.
దాడులు మళ్లీ జరిగితే మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని అమెరికాను హెచ్చరించింది. కాగా, యుద్ధ విమానాలు, నౌకలు, డ్రోన్లతో ఇరాన్లోని డజన్ల కొద్దీ లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది. వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్లు, క్షిపణి, డ్రోన్ మౌలిక సదుపాయాలు, చిన్న యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. హర్మూజ్ జలసంధిలో పౌర నౌకాయానానికి ముప్పు తగ్గించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సెంట్కామ్ తెలిపింది.