వెల్గటూర్, నవంబర్ 26: ‘కాంగ్రెస్ నాయకులు ఎన్నికలప్పుడు రంగులు మార్చుకుంటూ ఏడుపులు, తుడుపులతో వస్తరు. ఏడ్చేవారిని నమ్మితే ఆగమైతరు. ఐదేండ్లు గోసపడుతరు. మీ భవిష్యత్ను తీర్చిదిద్ది బాధ్యతతో పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని’ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం వెల్గటూర్ మండలం రాజక్కపల్లి, కిషన్రావుపేట, సంకెనపల్లి, పైడిపల్లి గ్రామాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించగా, ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మలు, గంగపుత్రులు వలతో స్వాగతం పలికారు. కిషన్రావుపేటలో పంబాల కులస్తులు, యువకులు 100 బైక్లతో ర్యాలీగా వచ్చి స్వాగతం పలికారు.
ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తమ అవసరం కోసం ఆపద మొక్కులు మొక్కుకుంటూ అంగీలు చింపుకుని వచ్చి ఓట్లు అడుగుతారని, వారి మాటలు నమ్మితే అరి గోస పడుతారన్నారు. వారివన్నీ దొంగహామీలు, ఝూటా మాటలని మండిపడ్డారు. వారు పాలించిన కాలంలో భూమి శిస్తూ, నీటి పన్ను, బ్యాంక్లో అప్పుల కట్టకపోతే ఇంటి దర్వాజలు పీక్కపోయిన చరిత్ర వారిదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీటి పన్ను, బ్యాంక్ రుణాలు మాఫీ చేసి ఆదుకున్న గొప్ప మనసున్న నాయకుడు అని కొనియాడారు. ఓటు వజ్రాయుధం అని, మీ తల రాతను మార్చుతుందని, అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
కాంగ్రెస్ నాయకులు పదేండ్ల నుంచి అధికారానికి దూరం కావడంతో ఆవురావురంటూ దొంగ హామీలు , ఝూటా మాటలు చెప్పుతూ ఊర్ల మీద పడి దోచుకోవడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారి మాయ మాటలు నమ్మితే ఐదేండ్లు అరిగోస పడతామన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వద్దంటున్నారని, మూడు గంటలే చాలని, ఇంకా 10 హెచ్పీల మోటర్లు పెట్టుకోవాలని మాట్లాడుతున్నారన్నారు. మోటర్ల కాడ ఉండి గోసపడే రోజులు కావాలా..? కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంట్ కావాలా..? రైతులు ఆలోచించాలని సూచించారు. అలాంటి వారిని బంగాళఖాతంలో తోసేయాలని పిలుపునిచ్చారు.
మొక్కట్రావుపేట, రాంనూర్, తాళ్లకొత్తపేట, చెగ్యాం గ్రామాల్లో మిగిలిన ముప్పు సమస్యలను పరిష్కరించుకుందామని, మన తల్లీ లాంటి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి, మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కాంగ్రెస్వాళ్లు దళితులను ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప వారి అభివృద్ధి కోసం ఏనాడూ పనిచేయలేదన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు తీసుకువచ్చారని, తనను మరోసారి గెలిపిస్తే హుజూరాబాద్ తరహాలో నియోజకవర్గంలో అందరికీ ఒకేసారి దళితబంధు అందజేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి మాట ఇచ్చారంటే తప్పరని, మన బతుకులు మార్చుతారని, వెలుగు నిండుతాయన్నారు. వచ్చే ప్రభుత్వంలో తన చేతుల మీదుగానే దళితులందరికీ ప్రొసీడింగ్స్ అందజేస్తానని స్పష్టం చేశారు.