భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం ఏడైందంటే చాలు నింగి నుంచి నేలపై నిప్పులు చెరుగుతున్నాడు. మే నెలలోని ఉష్టోగ్రతలు ఏప్రిల్లోనే నమోదవుతుండడంతో, ప్రజలు బెంబేలెత్తుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉపాధి హామీ కూలీలు మాత్రం పనులకు వెళ్తూనే ఉండగా, ఉపాధి హామీ చట్టం ప్రకారం వారికి వేసవి నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కానరాకపోవడంతో, ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండల్లో కూలీలు మలమలలాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కలెక్టరేట్, ఏప్రిల్ 6: జిల్లాలో 1,24,001 జాబ్కార్డులుండగా, వీటి ద్వారా 2,32,569 మంది కూలీలుగా నమోదయ్యారు. నిత్యం 14 వేల నుంచి 15.5వేల మంది జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం యాసంగి సాగు దగ్గరపడుతుండగా వ్యవసాయ పనులు తగ్గిన నేపథ్యంలో, రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతున్నది.
వీరిలో మహిళల శాతమే అధికంగా ఉండగా, 50 ఏళ్ల పైబడ్డ వారే ఎక్కువ మంది వెళ్తున్నట్లు అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ఉపాధి హామీ చట్టం ప్రకారం వీరికి వీరికి అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే కాగా, క్షేత్రస్థాయిలో నామ్కే వాస్తేగా ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజన సమయంలో అవసరమైన టెంట్లు, పనులు చేసేందుకు కావాల్సిన పనిముట్లు కూడా అందజేయాల్సి ఉంటుంది.
కూలీల వెతలు వర్ణణాతీతం
పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించపోవడంతో కూలీల వెతలు వర్ణణాతీతంగా మారాయి. తాగునీరు కూడా తమ ఇళ్ల నుంచే తీసుకెళ్తున్నామని, పని ప్రదేశాల్లో అవసరమైన పనిముట్లు సైతం ఎవరివి వారే తెచ్చుకుంటున్నామని, చెట్ల నీడనే ఆసరా చేసుకునే మధ్యాహ్న భోజనాలు ముగిస్తున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనానంతరం సేదదీరడం కూడా ఇబ్బందికరంగా మారుతుండగా, ఉపాధి పనులకు వెళ్తున్న అనేకమంది డీ హైడ్రేషన్కు గురై వడదెబ్బ బారిన పడి, సకాలంలో వైద్య చికిత్స అందక, మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కూలీల సమస్యలు పక్కనబెట్టి అధికారులు, కేవలం పనిదినాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని మండిపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య చికిత్స అందించే కిట్లు కూడా అందుబాటులో లేకపోవడంతో, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూలీలు వాపోతున్నారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అయోడిన్, ప్రమాదాల బారిన పడి గాయాలైతే, శుభ్రం చేసేందుకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటి కనీస మందులు కూడా తమ వెంట ఉంచడం లేదని వాపోతున్నారు. ఈసారి ముందుగానే ఎండలు ముదరడంతో, ఈ ప్రభావం కూలీలపై అధికంగా పడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూలీల నుంచి వ్యక్తమవుతున్నాయి. శతకోటి సమస్యలతో సావాసం చేస్తూ ఉపాధి పనులకు వెళ్తున్నా, ఉపాధి చట్టం ప్రకారం ఏటా వేసవిలో చెల్లించాల్సిన అదనపు భత్యం కూడా అటకెక్కించారని ధ్వజమెత్తుతున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటున్నం
వేసవిలో ఎండలు మండిపోతుండగా, పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నం. వారికి అవసరమైన వైద్య సామగ్రిని సమీపంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా సమకూర్చేలా క్షేత్ర సహాయకులను ఆదేశించాం. నిబంధనలకనుగుణంగా కూలీలకు అవసరమైన వసతులు కల్పిస్తున్నం.
-శ్రీధర్, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
కూలీల సంక్షేమంపై పట్టింపేది
ఫిబ్రవరి, మార్చి నెలల్లో 15శాతం, ఏప్రిల్లో 20 శాతం, మే నెలలో 30 శాతం అదనపు భత్యంగా అందించాల్సి ఉంటుంది. టీఏ, డీఏతో పాటు గడ్డపారకు రూ.10, తట్టకు రూ.5, మంచినీటికి రూ.5, ఐదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే కూలీలకు రూ.20 చొప్పున వారి ఖాతాల్లో జమచేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే, గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ నిలిపివేయడంతో కూలీల బాధలు వర్ణణాతీతంగా మారాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి కూలీల కోసం అనేక సంక్షేమ చర్యలు తీసుకోగా, పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ప్రస్తుత ప్రభుత్వం గత రెండు సీజన్ల నుంచి కూలీలపట్ల ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో తాము ఇక్కట్ల పాలవుతున్నామని మండిపడుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని తాము వడదెబ్బ బారిన పడ్డా, అనుకోని ప్రమాదాలకు గురైనా తమ కుటుంబాల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పని ప్రదేశాల్లో చట్టం ప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.