Smart Ration Cards | బోయినపల్లి రూరల్, ఆగస్టు 28 : స్మార్ట్ రేషన్ కార్డు పై ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకుల ఫొటోలు ముద్రించడం అంటే రాజకీయ ప్రచారమేనని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కనపల్లి కరుణాకర్ విమర్శించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకర్ మాట్లాడారు. రేషన్ కార్డు ప్రజల హక్కు అని, ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడు వ్యక్తిగతంగా ఇచ్చిన కానుక కాదన్నారు.
ప్రభుత్వాలు శాశ్వత కాదనీ, ప్రభుత్వం మారిన ప్రతీసారీ ఫొటోలు మార్చి కొత్త కార్డులు ముద్రిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ వాటిపై రాజకీయ నాయకుల ఫొటోలను ప్రచారం కోసం ముద్రించలేదన్నారు. రైతే రాజు అని మాటల్లో చెప్పడం కాదు రైతు కష్టాన్ని గుర్తించే విధంగా రేషన్ కార్డుపై రైతు చిత్రం ముద్రించి గౌరవమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుంటి శంకర్, బత్తిని కమల్ గౌడ్, కన్నం సాగర్, కట్ట లింగయ్య తదితరులు పాల్గొన్నారు.