Dasari Manohar Reddy | జూలపల్లి, సెప్టెంబర్ 3 : 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో తెచ్చిన కష్టాలను ప్రతీ ఒక్కరూ యాదికి తెచ్చుకోవాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు’లో భాగంగా రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి పాలనలో కరెంటు కోతలు, సాగునీటి కొరతతో వ్యవసాయ రంగం కుదేలైందని తెలిపారు. యూరియా బస్తాల కోసం రైతులు రోజంతా క్యూలైన్లో చెప్పులు పెట్టి ఎదురు చూశారని గుర్తు చేశారు. అట్లాంటి పరిస్థితి ఈ రైతుకు రావొద్దని అడగకుండానే కేసీఆర్ వినూత్న రీతిలో రైతు సంక్షేమ పథకాలు చేపట్టి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రజలు నమ్మించి అధికారులకు వచ్చి 420 హామీలు ఇచ్చి మోసం చేస్తుందని విమర్శించారు. గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యవంతం చేయాలని పేర్కొన్నారు.1000 రోజుల పాలనలో ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ ఎంపీపీ వీసారపు వెంకటేశం, వైస్ ఎంపీపీ మొగురం రమేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్, వైస్ చైర్మన్ లోక రవీందర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తొగరు శ్రీనివాస్, కుమ్మరి కుంట మాజీ ఎంపీటీసీ సభ్యుడు తమ్మడవేని మల్లేశం, నాయకులు లాల్ మహ్మద్, అంకూస్, పొలగాని సతీష్, మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.