ఓదెల, నవంబర్ 14:ఒకప్పుడు ఆంధ్రా, ఉత్తర తెలంగాణకే పరిమితమైన బొప్పాయి సేద్యం మన దగ్గరా పండుతున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట కావడంతో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నది. ముఖ్యంగా రాష్ట్ర సర్కారు ఇచ్చిన పంట మార్పిడి పిలుపును అందుకొని ఉద్యాన పంటలు, ప్రధానంగా పపాయ సాగు చేస్తున్నది. ఒకసారి మొక్కలు నాటితే ఏడాదిన్నర పాటు నిరంతరాయంగా దిగుబడిని ఇచ్చే పంట కాగా, ఓదెల మండలం మడకకు చెందిన రిటైర్డ్ లైబ్రేరియన్ అంబటి కరుణాకర్రెడ్డి సహా జిల్లాలోని పలువురు రైతులు 33 ఎకరాల్లో పండిస్తున్నారు. ఎకరాకు కేవలం 60వేల -70వేల పెట్టుబడితో 2 లక్షలకుపైగా ఆదాయాన్ని పొందుతూ ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నారు.
బొప్పాయితో ప్రయోజనాలు..
బొప్పాయి రుచిలోనే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ తినే పండ్లలో పపాయ తప్పనిసరిగా ఉంటుంది. ఆపిల్, జామ, సీతాఫలం, అరటి పండ్ల కంటే ఇందులోనే ప్రొటీన్లు అధికం. విటమిన్ సీ, ఈ, మినరల్స్ పుష్కలంగా ఉండి మనిషిని ఆర్యోగంగా ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. గుండెకు రక్షణ ఇస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లు రాకుండా చూస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. పోషకాల పరంగానే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆకుల్లో కార్వీస్ అనే పదార్థం ఉండడం వల్ల ఆకులను వేడి చేసి కట్టుకడితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఆకుల రసాన్ని పుక్కిలించి ఉమ్మితే నోటి పూతతో పాటు టాన్సిల్స్ తగ్గిపోతాయి.
ప్రభుత్వ సబ్సిడీ..
బొప్పాయి సాగుకు రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం ఇస్తున్నది. మల్చింగ్, డ్రిప్ పద్ధతి ద్వారా సాగు జరుగుతుంది. డ్రిప్ ఏర్పాటుకు 2లక్షలు కాగా, ప్రభుత్వం 1.5 లక్షల సబ్సిడీ ఇస్తుంది. డ్రిప్ ద్వారా నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే మల్చింగ్ పద్ధతిలో గడ్డి నివారణ సులువుగా ఉంటుంది.
సేంద్రియ పద్ధతే మేలు..
బొప్పాయిని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తే మంచి దిగుబడిని ఇస్తుంది. కాయ సైజ్ పెరుగుతుంది. ఇతర ప్రాంతాల రకాల కంటే తైవాన్ రెడ్లెడ్ రకానికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. వ్యాపారులు రైతుల తోట వద్ద కిలోకు 15 -20కు సేకరించి, బహిరంగ మార్కెట్లో మాత్రం కిలోకు 40 నుంచి 50 వరకు విక్రయిస్తుంటారు. నేరుగా మార్కెటింగ్ చేస్తే రైతుకు మరింత లాభం జరుగుతుంది.
సాగులో ‘తైవాన్ రెడ్లెడ్’ బెస్ట్..
బొప్పాయిలో తైవాన్ రెడ్లెడ్ రకం మంచి దిగుబడిని ఇస్తుంది. సాగు చేసిన రైతులకు లాభాలు కురిపిస్తుంది. ఈ మొక్కల్లో 90 శాతం బతుకుతాయి. తొమ్మిది నెలల్లో కాతకు వస్తాయి. ఈ రకం కాయ గట్టిగా ఉంటుంది. కోసిన వారం రోజుల వరకు కూడా మెత్త పడకుండా నాణ్యతగా ఉంటుంది.
మంచి లాభాలున్నయి..
రైతులందరూ ఒకే పంట వేస్తే లాభం ఉండదు. మార్కెట్లో డిమాండ్ ఏది ఉందో తెలుసుకొని వేస్తే మంచిది. అందుకే నేను ఉద్యోగ విరమణ తర్వాత రెండెకరాల్లో బొప్పాయి సాగు చేసిన. ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ సిస్టం మంజూరు చేసింది. మొక్కలకు కూడా సబ్సిడీ ఉంది. గతంలో ఒక సారి బొప్పాయి సాగు చేసి లాభాలు పొందిన. అందుకే మళ్లీ సాగు చేసిన.