పెద్దపల్లి కమాన్/మల్యాల/ కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 10: రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు మెరిశారు. ఆరుగురు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇందులో పెద్దపల్లికి చెందిన నలుగురు, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. జనవరి 27, 28 తేదీల్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్స్పైర్ పోటీల్లో 37 మంది విద్యార్థులు పాల్గొనగా ఆరుగురు ఉత్తమ ప్రా జెక్టులను ప్రదర్శించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పాల్గొనగా, ముగ్గురు విద్యార్థులు డీ. హర్షిత (7వ తరగతి), పీ స్నేహిత (9వ), సాయి నివాస్ (10వ), సుల్తానాబాద్ అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. పూజితశ్రీ (7వ) పోటీ ల్లో రాణించారని వివరించారు. జిల్లాకు ఖ్యా తి తెచ్చిన విద్యార్థులను డీఈవో మాధవి, జి ల్లా సైన్స్ అధికారి రవీందర్రావు అభినందించారు. అలాగే మల్యాల కస్తూర్బా స్కూల్కు చెందిన నక్క అరుంధతి ఎంపికయ్యారని పాఠశాల ప్రత్యేకాధికారి స్రవంతి తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ జడ్పీస్కూల్లో పదో తరగతి చదువుతున్న బత్తిని మౌనిక జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ హెల్మెట్..
చందనపూర్ జడ్పీ స్కూల్కు చెందిన ఏడో తరగతి విద్యార్థిని డీ హర్షిత కామన్మ్యాన్ ఫ్రెండ్లీ హెల్మెట్ను గైడ్ టీచర్ టీ సంపత్కుమార్ సహకారంతో రూపొందించింది. ఆమెది మంథని మండం దుబ్బపల్లి గ్రామం.. తల్లిదండ్రులు దాసరి స్వప్నా శ్రీనివాస్. వారు వ్యవసాయ కూలీలు. హర్షిత మామ వెల్డింగ్ దుకాణంలో పనిచేసేవాడు. అతడు పడుతు న్న కష్టాలను చూసే ఫ్రెండ్లీ హెల్మెట్ను రూ పొందించింది. దీని తయారీ కోసం హెల్మెట్, రెండు ఫ్యాన్లు, పొగను గుర్తించే సెన్సార్, బ్యాటరీని వాడింది. ఈ హెల్మెట్తో దుమ్ము లేదా పొగ మన దరి చేరగానే సెన్సార్ దానిని గుర్తించి హెల్మెట్పైన ఉన్న ఫ్యాన్లను వేగంగా తిప్పుతుంది. దీంతో దుమ్ము దూరంగా వెళ్లిపోతుంది. ఇది రైతులు, వెల్డర్లు, కార్పెంటర్లు, ట్రాఫిక్ పోలీసులకు ఉపయోగపడుతుంది.
ఆక్సెల్ సీసీ కెమెరా..
సుల్తానాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్కు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఎం పూజశ్రీది ఓదెల మండలం కొలనూర్ గ్రామం. తల్లిదండ్రులు మస్త్యాల అనిత- శ్రీనివాస్. వీరు వ్యవసాయం చేసుకొని జీవిస్తారు. పూజశ్రీ స్కూల్ బస్ ఆక్సాల్కు సీసీ కెమెరాను అమర్చే ప్రాజెక్టును రూ పొందించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అతి తక్కువ ఖర్చుతో ఒక చిన్న బస్సు బొమ్మకు సీసీ కెమెరాను బిగించింది. ఈ పరికరం రాత్రివేళల్లో బస్సు డ్రైవర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. బస్సు కదులుతున్న సమయంలో ఎవరైనా బస్సు కింద, పక్కకు ఉన్నట్లయితే డ్రైవర్ సీటు దగ్గర అమర్చిన మొబైల్ ఫోన్, స్క్రీన్లో స్పష్టంగా కనబడుతుంది. ఈ పరికరాన్ని బస్సులతో పాటు ఇతర వాహనాలకు కూడా అమర్చుకుని ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు.
మట్టి పాత్రలతో ఆవిరి యంత్రం
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ జడ్పీ స్కూల్కు చెందిన మౌనిక స్కూల్ టీచర్ అరుణ సహకారంతో మట్టి పాత్రలతో ఆవిరి పరికరాన్ని రూపొందించింది. రెండు మట్టిపాత్రలు, రంధ్రాలతో కూడిన మూత, వాటర్ హీటర్ను వినియోగించి దీనిని తయారు చేసింది. కింద ఉండే మట్టిపాత్రలో నీరుపోసి దానిపై రంధ్రాలతో కూడిన మూతను కప్పి ఉంచుతారు. దానిపై రెండో పాత్రను పెడుతారు. వాటర్ హీటర్ ద్వారా నీటిని మరిగించగా పాత్రలగుండా ఆవిర్లు వెలువడుతాయి. వీటిని పీల్చుకొని శ్వాససంబంధ వ్యాధులు గలవారు ఉపశమనం పొందవచ్చు.
ఈ-ఊతకర్ర
చందనపూర్ జడ్పీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న స్నేహితది రామగిరి మండ లం చందనాపూర్. తల్లిదండ్రులు పద్మ- శంకర్ నిరుపేదలు. తండ్రి భవన నిర్మాణ కూలీ. వి ద్యార్థిని వృద్ధులు, వికలాంగుల కోసం ఈ-ఊతకర్రను గైడ్టీచర్ సంపత్కుమార్ సహకారంతో తయారు చేసింది. దీనిని రూపొందించేందుకు ఊత కర్ర, 9వీ బ్యాటరీలు, సెన్సార్, ఎల్ఈడీ బల్బు, బజర్ వాడింది. ఈ పరికరం చేతి ఊతకర్రగా, మలవిసర్జన చేసుకునేందుకు వీలయ్యే కుర్చీగా, మెడిసిన్ గుర్తు చేసేదిగా, టార్చ్లైట్గా, కిందపడినడప్పుడు ఇం ట్లో వారికి సమాచారం ఇచ్చే అలారంగా పని చేస్తుంది. 600 గ్రాముల బరువు కలిగిన ఈ-కర్ర 90కిలో బరువు వరకు మోయగలదు.
గాలి శుద్ధి చేసే యంత్రం
చందనపూర్ జడ్పీ స్కూల్లో 10వ తర గతి విద్యార్థి ఎం సాయి నివాస్ది మంథని మండలం బెస్తపల్లి. తల్లిదండ్రులు మేడి రాజేశ్వరి- శ్రీనివాస్, విద్యార్థి తండ్రి కిరాణదుకాణం నడిపే చిరువ్యాపారి. సాయి నివాస్ కరోనా వైరస్ ఉన్న గాలిని శుద్ధి చేసే యంత్రాన్ని గైడ్టీచర్ సంపత్కుమార్ సహకారంతో రూపొందించాడు. తయారీ కోసం స్తూపాకారపు లోహపు పాత్ర, ఎగ్జాస్ట్ ఫ్యాన్, యూవీ లైట్స్, రెండు 60వాట్స్ బల్బులను ఉపయోగించాడు. దీనిద్వారా కరోనా బాధితులు తుమ్మిన, దగ్గినా గాలిలోకి వైరస్ విడుదలై గదిలోని ఇతరులకు సోకే అవకాశముంటుంది. ఈ పరికరాన్ని గదిలో ఉంచితే దీనికి అమర్చిన.. వేగంగా తిరగడం వల్ల శూన్యం ఏర్పడి రూమ్లోని గాలిని పీల్చుకుంటుంది. ఇందులో ఉన్న యూవీ బల్బుల వల్ల గాలిలోని వైరస్ మరణిస్తుంది. ముందున్న బల్బుతో వేడిపుట్టి, ఆ వేడికి గాలిలోని ఇతర బ్యాక్టీరియా కూడా చనిపోయి, గాలి మరింత శుభ్రమవుతుంది.