Old Current Pole | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనేపల్లి గ్రామ శివారులోని సున్నం మాటు ఒర్రె ప్రాంతంలో 11 కేవీ విద్యుత్ స్తంభంపై ఇన్సులేటర్ పగిలి విద్యుత్ సరఫరా కావడంతో చామనపల్లి గ్రామానికి చెందిన 40 గొర్రెలు షాక్తో మరణించాయి. మరో 30 గొర్రెలు తీవ్ర అస్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి.
గొర్రెల కాపర్లు తెలిపిన వివరాల ప్రకారం.. చామనపల్లి గ్రామానికి చెందిన దాడి ఓదెలు, దాడి ఐలయ్య, నిట్టు ముజ్జయ్య, కడారి కొమురయ్య, నిట్టు లచ్చయ్య, ఆవుల భూమయ్య, బైర రాయలింగు, నిట్టు రాజు, నెట్టు మల్లయ్య, బొమ్మ లచ్చయ్యలకు చెందిన సుమారు 700 గొర్రెలు కటికనపల్లి గ్రామ శివారులో మేతకు వెళ్లాయి. ఆ సమయంలో సున్నం మాటు ఒర్రె మీదుగా ఏడుగురు గొర్రెల కాపలాదారులు గొర్రెల మందను దాటిస్తున్నారు. అయితే ఆ ఒర్రె వద్ద కొన్ని ఏళ్ల నాటి పాత విద్యుత్ స్తంభానికి తీగ మొక్కలు అల్లుకొని ఉండడంతో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు స్థంభంపై ఉన్న ఇన్సులేటర్ పగిలింది. దీంతో విద్యుత్ సరఫరా ఉండడంతో స్తంభం మీది నుంచి స్తంభం కింది వరకు విద్యుత్ సరఫరా జరిగి మంటలు వ్యాపించాయి.
నీళ్లకు కరెంట్ సరఫరా అయి..
ఒర్రెలో పారుతున్న నీటికి కూడా విద్యుత్ సరఫరా జరిగింది. ఆ సమయంలో నీరు తాగుతున్న 40 గొర్రెలు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించినట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. అయితే మిగతా గొర్రెల మందను ఒర్రెలోకి వెళ్లకుండా కాపలాదారులు వాటిని మళ్లించడంతో వాటికి ప్రాణాపాయం తప్పింది. కాగా మరో 30 గొర్రెలు తీవ్ర స్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయని గొర్రెల కాపలాదారులు పేర్కొన్నారు. గొర్రెల మృతితో సుమారు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మూగజీవాలు మరణించాయని వారు ఆరోపించారు. గొర్రెల మృతితో ఉపాధి కోల్పోయిన గొర్రెల కాపరుల కుటుంబ సభ్యులు.. మృత్యువాత పడిన మూగజీవాలను చూసి కన్నీరు మున్నీరయ్యారు. మరణించిన గొర్రెలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని గొర్రెల కాపరులు డిమాండ్ చేశారు.
సంఘటన స్థలానికి ధర్మారం ఎన్పీడీసీఎల్ ఏడీఈ విజయ్ గోపాల్ సింగ్, ధర్మారం ఏఈ ఎండీ ఖాసిం, ఆర్ ఐ -1 వరలక్ష్మి, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పుల నాగరాజు, గొర్రెల కాపరుల సొసైటీ మండల అధ్యక్షుడు జంగ మహేందర్ చేరుకున్నారు. ఎన్పీడీసీఎల్ తరఫున మృతి చెందిన మూగజీవాలకు పరిహారం అందించడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆ శాఖ ఏడీఈ విజయ గోపాల్ సింగ్, ఏఈ ఎండీ ఖాసిం తెలిపారు.