రాజన్న సిరిసిల్ల, జూన్ 6( నమస్తే తెలంగాణ): మరి కొద్ది రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తమ వాహనాలు, స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు (సామర్థ్య పరీక్షలు) చేయించుకోవాలి. సంబంధిత ఆర్టీవో కార్యాలయం నుంచి ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యంతోపాటు ఉదాసీనంగా వ్యహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకున్నా.. ఫిట్నెస్ పరీక్ష చేయించుకోకపోతే వాహనాలను సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ముందుకు రాని యాజమాన్యాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 168 పాఠశాల, కళాశాల బస్సులు ఉన్నాయి. వీటిలో 5 బస్సులు 15 ఏళ్లు నిండినవి ఉన్నాయి. ఇప్పటి వరకు 87 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 81 బస్సులకు ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంది. 15 ఏళ్లు గడిచిన బస్సులకు సైతం ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. అయితే, కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సు ఫిట్నెస్ టెస్ట్ల విషయంలో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. చాలా మంది పాఠశాలలు విద్యా సంస్థల ప్రారంభానికి మూడు, నాలుగు రోజుల ముందు రవాణా శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి, ఆఘమేఘాల మీద ఫిట్నెస్ టెస్ట్ కోసం హడావిడి చేస్తుండడం పరిపాటిగా మారింది. గతంలో పాఠశాల బస్సులు అదుపు తప్పి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.

నిబంధనలు ఇవే..
15 ఏళ్లు నిండిన బస్సుల్లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లవద్దు.
విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు గత నెల 15తో ముగిసింది. ఈనెల 12లోగా తిరిగి ఫిట్నెస్ పరీక్ష చేయించాలి.
బీమా గడువు పరిశీలించి, తిరిగి పునరుద్ధరించుకోవాలి.
60 ఏళ్లలోపు ఉన్న వారిని డ్రైవర్గా నియమించాలి. ఐదేళ్ల అనుభవంతో పాటు హెవీ డ్రైవింగ్ లెసెన్స్ కలిగి ఉండాలి.
బస్సులో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దు. ప్రతి మూడు నెలలకొకసారి డ్రైవర్కు కంటిచూపు, రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేయించాలి
డ్రైవర్ వివరాలు బస్సుకు ఇరువైపులా, విద్యా సంస్థ పేరు, ఫోన్ నంబర్ కనిపించేలా ఏర్పాటు చేయాలి.
బస్సుకు కిటికీల ప్రాంతంలో ఇనుప ఊచలు బిగించడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచాలి. మందులు కూడా ఉంచాలి.
బస్సులో అటెండర్ ఉండాలి. బస్సులో విద్యార్థుల జాబితా అతికించాలి.
అగ్నిమాపక పరికరాలు అమర్చాలి. అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి.
విద్యార్థులకు ప్రత్యేకంగా మెట్లు ఏర్పాట్లు చేయాలి.
నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం
ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తమ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే సీజ్ చేస్తాం. అన్ని పత్రాలతోనే రోడ్డెక్కాలి. ఆటోలు, వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, (రాజన్న సిరిసిల్ల)