పెద్దపల్లి, జూన్ 23(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాకు మరో డిగ్రీ కళాశాల వచ్చింది. ఇప్పటికే మూడు డిగ్రీ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఉండగా, తాజాగా శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోనే ఇది తొలి కళాశాల కానున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జ్యోతిరావు ఫూలే బీసీ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల గతేడాది ప్రారంభం కాగా, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే బాయ్స్ డిగ్రీ కళాళాలలు ప్రారంభమయ్యాయి.
కాగా, తాజాగా మంజూరైన కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందులో డిగ్రీ మొదటి సంవత్సరంలో 160 మందికి సీట్లు దక్కనున్నాయి. ఇందుకు ఇప్పటికే ప్రవేశ పరీక్షలు నిర్వహించగా పెద్దపల్లి జిల్లా నుంచి 160 మంది రాశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులను బట్టి ఇక్కడ సీట్లను పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు డిగ్రీలో ఉన్న బీఏ, బీకాం, బీజడ్సీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, ఇంకా ఇతర కంప్యూటర్ అనుబంధ విభాగాలు, మరిన్ని ఉపాధి అవకాశాలు గల కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
జిల్లాలో ఇప్పటికే రామగుండంలో 2, పెద్దపల్లిలో 1, సుల్తానాబాద్లో 1 మహాత్మాజ్యోతిరావు ఫూలే గర్ల్స్ జూనియర్ కళాశాలలు ఉండగా, ప్రతీ సంవత్సరం ఈ కళాశాలల నుంచి 560 మంది వరకు విద్యార్థులు డిగ్రీ ప్రథమ సంవత్సరంలోకి వచ్చే అవకాశం ఉన్నది. దీంతో జిల్లాలోని ఆయా గురుకులాల్లో చదివే విద్యార్థులు ఇక బయటి కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ కళాశాలను జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మహాత్మాజ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాల ఆర్సీఓ గౌతం రెడ్డి తెలిపారు.