బడిలో ఉండాల్సిన బాలలు కార్ఖానాలు, దుకాణాల్లో బందీలవుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో బాలకార్మికులుగా మారుతున్నారు. చదువుకోవాలనే కోరిక ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు సహకరించక బతుకుభారం మోస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించిన నాటి కేసీఆర్ సర్కారు ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ తెచ్చింది. వేలాది మంది బాల కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి ప్రసాదిస్తున్నది. తాజాగా జనవరి ఒకటి నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 1: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నాడు కేసీఆర్ సర్కారు నడుంబిగించింది. 2015 జనవరిలో ఆపరేషన్ స్మైల్కు శ్రీకారం చుట్టింది. అలాగే అదే ఏడాది జూలైలో ఆపరేషన్ ముస్కాన్ను ప్రారంభించింది. వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తొమ్మిది విడుతల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో 3388 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. తాజాగా జనవరి 1నుంచి 31వ తేదీ వరకు ‘ఆపరేషన్ స్మైల్-10’ పేరిట బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడం, పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు, పోలీసు శాఖ నుంచి ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, తహసీల్దార్, ఇతర సిబ్బందితో కలిసి మండల స్థాయిలో బృందాలుగా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వ్యాపార సంస్థలు ప్రధానంగా బట్టల దుకాణాలు, హోటళ్లు, కార్ఖానాలు, ఇటుక బట్టీలు, బస్టాండ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపడతారు. ముందుగా బాల కార్మికులు పనిచేసే ప్రాంతాలు గుర్తిస్తారు. ఈ ప్రక్రియను ఈనెల 8వరకు చేపడతారు.
ఈనెల 9నుంచి నెలాఖరువరకు రెస్క్యూ నిర్వహిస్తారు. బాధ్యులైన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారికి అప్పగిస్తారు. ప్రతి రోజు వారిని పాఠశాలలకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. అనాథలైన వారికి స్టేట్ హోం, చైల్డ్ హోమ్లలో ఆవాసం కల్పిస్తారు. సమీపంలో ఉండే విద్యా సంస్థల్లో వారిని చేర్పించి, విద్యాబోధన చేయించనున్నారు. పనుల్లో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేసి, వారిపై పెద్దమొత్తంలో జరిమానా కూడా విధిస్తారు. ఆమొత్తాన్ని పిల్లల పేరిట బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఈసారి కూడా పకడ్బంధీగా నిర్వహిస్తాం. చిన్నారులను పనిలో పెట్టుకునే వాణిజ్య, వ్యాపార సంస్థలు, కార్ఖానాల్లో యాజమానులపై జేజేబీ చట్ట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. రెస్క్యూలో పట్టుబడ్డ పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగిస్తాం.
– శాంత, ఐసీపీవో (కరీంనగర్)