కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 28: నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణనాథుడికి ఉమ్మడి జిల్లావాసులు రెండో రోజు గురువారం ఘన వీడ్కోలు పలికారు. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించారు. సాయంత్రం విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో ప్రతిమలను ఉంచి, కన్నుల పండువగా శోభాయాత్రలు తీశారు.
వైభవంగా సాగిన ఈ యాత్రలకు జనం నీరాజనం పట్టారు. దారి పొడవునా ‘జై గణేశా.. జై జై గణేశా..’, ‘గణపతి బొప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా..’ నినాదాలు మిన్నంటగా, డప్పు చప్పుళ్ల హోరు.. అతివల కోలాటాలు.. యువతీయువకుల నృత్యాలు, చిన్నారుల కేరింతల నడుమ లంబోదరుడిని తరలించారు. చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేసి, ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ సాగనంపారు.