కాకతీయుల కాలం నాటి అన్నారం శివ కేశవ వీరభద్ర స్వామి ఆలయానికి ప్రాణప్రతిష్ట ఎన్ఆర్ఐ పాకాల శ్రీకాంత్రెడ్డి దాతృత్వం
సర్కారు, గ్రామస్తుల సహకారం 80 లక్షలతో అద్భుతంగా పునర్నిర్మాణం
అట్టహాసంగా ప్రతిష్ఠాపనోత్సవాలు
శిథిలావస్థకు చేరి, ధూపదీప నైవేద్యాలకు నోచుకోక కళావిహీనంగా తయారైన పురాతన ఆలయానికి ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి పునరుజ్జీవం పోశారు. పుట్టి పెరిగిన అన్నారంలోని పురాతన శివకేశవ వీరభద్రస్వామి ఆలయానికి ప్రాణప్రతిష్ట చేసేందుకు ముందుకొచ్చారు. సొంతంగా 50 లక్షలు అందించి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు.
కమాన్ చౌరస్తా, మార్చి 28 : మానకొండూర్ మండలం అన్నారంలో కాకతీయుల కాలం నాటి శివ కేశవ వీరభద్ర స్వామి దేవాలయానికి చాలా గొప్ప విశిష్టత ఉన్నది. శివుడు, విష్ణుమూర్తి ఒకేచోట కొలువై ఉన్నందు వల్లే ఈ గుడి శివ కేశవ దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. దేశంలో ఎక్క డా లేనివిధంగా శివుడు (వీరభద్రస్వామి), విష్ణుమూర్తి కలిసి ఉండడం ఇక్కడే కనిపిస్తుంది. కానీ, ఆలయాన్ని మొన్నటివరకు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదు. శిథిలావస్థకు చేరడంతోపాటు గుడి మొత్తం చెట్లు, పొదలతో కళావిహీనంగా మారింది.
ఎన్ఆర్ఐ దాతృత్వం.. పూర్వ వైభవం
పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అన్నారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆలయాన్ని దత్తత తీసుకొని పూర్వవైభవం తెచ్చా రు. ప్రభుత్వం 20 లక్షలు, గ్రామస్తులు 10 లక్షలు ఇవ్వగా, ఆయన తన సొంతంగా 50 లక్షలు అందించారు. మొత్తం 80లక్షలతో ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. తానే స్వయంగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, అనుమతులు తెచ్చి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గుడికి రెండు ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయించారు. ఈ నెల నుంచి 26 నుంచి మూడు రోజులపాటు ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు, అర్చకుల పూజలతో మళ్లీ ఆలయంలో సందడి మొదలైంది. భక్తుల పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో కళకళలాడుతున్నది. ఇటువంటి అద్భుతమైన దేవాలయాన్ని పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా ఇస్తే అది సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ఎన్ఆర్ఐ శ్రీకాంత్రెడ్డి చెబుతున్నారు.
నా అదృష్టంగా భావిస్తున్నా..
కాకతీయుల కాలం నాటి ఆలయం కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. నా చిన్న నాటి నుంచి చూసిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దామనుకున్నా. మా నాన్న నర్సింహారెడ్డితోపాటు గ్రామస్తులు, ప్రభుత్వ సహకారం అందింది. అందుకే పాత విగ్రహాలతోనే ఆలయాన్ని పూర్తిగా పున్నర్నించాం. ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించాం. ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చాం. ఎంతో కష్టంతో కూడుకున్న పనే అయినా పట్టుదలతో ముందుకు సాగాం. అభివృద్ధి చేశాం. మా కుటుంబం ఇందులో భాగస్వామ్యం తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. – పాకాల శ్రీకాంత్ రెడ్డి, ఎన్ఆర్ఐ
ప్రభుత్వం సైతం గుర్తించింది..
ప్రభుత్వం, దాతలు, గ్రామస్తులు సహకారంతో శిథిలావస్థలో ఉన్న శివకేశవ ఆలయానికి కొత్తరూపు తీసుకువచ్చారు. ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతోపాటు స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గ్రామస్తులు ముందుకు వచ్చారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి కృపకు పాత్రులయ్యారు.