మెట్పల్లి, సెప్టెంబర్ 11 : ముత్యంపేటలోని నిజాం చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరవాలని అఖిల పక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకై గురువారం మెట్పల్లి పట్టణ శివారులోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ తుల రాజేందర్కుమార్, తెలంగాణ జన సమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్ష నాయకులు, చెరకు రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చక్కెర ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో చెరకు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చి, చక్కెర ఫ్యాక్టరీకి పూర్వవైభవం తేవాలని పలువురు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.
ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో కనీసం 15 వేల ఎకరాల్లో చెరకు నాటాలని, అందుకు ప్రభుత్వం తరఫున ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతులకు నమ్మకం కల్పించాలని తీర్మానించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రి శ్రీధర్బాబు కమిటీని మాజీ మంత్రి జీవన్రెడ్డి, స్థానిక నియోజకవర్గ అధికార పార్టీ నాయకుల ద్వారా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి వచ్చే సీజన్లోపు ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు వినతి పత్రం అందజేయాలని తీర్మానించారు. అదే విధంగా ఫ్యాక్టరీ పరిధిలోని అన్ని గ్రామాల్లో రైతులను కలిసి చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు అవగాహన కల్పించడంతో పాటు చెరకు రైతులతో సంఘాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో చెరకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు మామిడి నారాయణరెడ్డి, గోరుమంతుల ప్రవీణ్, చెన్నమనేని శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశ్, మారు సాయిరెడ్డి, సీపీఐ జిల్లా నాయకుడు చెన్న విశ్వనాథం, సమాజ్వాది పార్టీ నాయకుడు ముజాహిద్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు చింత భూమేశ్వర్, టీజేఎస్ జిల్లా కార్యదర్శి శంకర్, సాయికృష్ణ యాదవ్, లింబారెడ్డి, పాపన్న పాల్గొన్నారు.