పెద్దపల్లి, జూన్ 25(నమస్తే తెలంగాణ)/కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి సిగలో మరో నగ వచ్చి చేరనుంది. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండ లం కూనారం వ్యవసాయ పరిశోధన స్థానంలో డిప్లమా ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, పౌల్ట్రీ, డెయిరీ టెక్నాలజీ కోర్సులతో ‘వ్యవసాయ కళాశాల’ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డిని కలిసి విషయాన్ని తెలియజేయడంతో మంత్రి వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కూనారం వ్యవసాయ కశాశాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టాలని, వెంటనే ప్రాసెస్ను స్టార్ట్ చేయాలని, త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే జిల్లాలో వ్యవసాయ కళాశాల ప్రారంభం కానుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో వ్యవసాయ కళాశాల ఉండగా పెద్దపల్లి రెండో కళాశాల కానుంది. వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న పెద్దపల్లిలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానంలో డిప్లమో ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫౌల్ట్రీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కోర్సులతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు ఏర్పాటు కానుంది. కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామ శివారులో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో 2007వ సంవత్సంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి చేతుల మీదుగా కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి నూతన వరివంగడాలపై ఇక్కడ వివిధ రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయి. కేఎన్ఎం 118, కేఎన్ఎం 733, కేఎన్ఎం 1638 అనే నూతన వరి వంగడాలను ఇక్కడి శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటైతే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది యువతకు మరింత ప్రయోజనం చేకూరనుంది. కళాశాల ఏర్పాటుకు ఆదేశాల జారీ చేసిన సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పెద్దపల్లి ప్రాంత యువత పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.