వీణవంక, జూలై 10 : ఉత్తమ సేవలతో చల్లూరు పీహెచ్సీ మూడు సార్లు అవార్డులు సాధించిందని, అలాంటి దవాఖాన ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అరకొర సిబ్బందితో పూర్తి స్థాయిలో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీణవంక మండలం చల్లూరు గ్రామస్తులు పీహెచ్సీలో సరైన వైద్యం అందడంలేదని ఫిర్యాదు చేయగా, శుక్రవారం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దవాఖానలో ఓపీ రిజిస్టర్, మెడికల్ షాపు, ల్యాబ్, తదితర విభాగాలను పరిశీలించి, డాక్టర్ సంతోష్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, దవాఖానకు మొత్తం 12 పోస్టులు మంజూరై ఉన్నా.. అందులో ఆరుగురు డిప్యుటేషన్పై వెళ్లిపోయారన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో వెంకటరమణతో ఫోన్లో మాట్లాడి, డిప్యుటేషన్పై వెళ్లిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్రావు, మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, సర్పంచ్ సంపత్రెడ్డి, ఉపసర్పంచ్ ఫసియొద్దీన్ ఉన్నారు.