కొండగట్టు అంజన్న ఆదాయానికి ఓ ఉద్యోగే ఎసరుపెట్టాడు. షాపుల లీజుకు సంబంధించి వ్యాపారులు చెల్లించిన 37.90 లక్షలు స్వాహా చేశాడు. రెండు రోజుల క్రితం రికార్డుల పరిశీలనలో భాగంగా ఉన్నతాధికారులు గుర్తించి, సదరు ఉద్యోగికి మెమో ఇవ్వడంతో అసలు బాగోతం వెలుగుచూసింది. అయితే ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023-24కి సంబంధించి లీజుల గడువు ముగిసినా ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మల్యాల, ఫిబ్రవరి 23: కొండగట్టు అంజన్న దుకాణాల లీజుకు సంబంధించి గతేడాది జనవరిలో వేలంపాట నిర్వహించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి31 వరకు దుకాణాల హక్కు లు దక్కించుకున్న వ్యాపారులు, విడతల వారీగా చెల్లింపులు జరుపుతుంటారు. కొబ్బరికాయల విక్రయదారులకు ఆలయ ఆవరణలో పులి మల్లేశం 31.80లక్షలు, పూలు, పండ్లు విక్రయించే సుధగోని చిరంజీవి 3లక్షలు, కిరాణాషాపు నిర్వాహకుడు సుధగోని శ్రీధర్ 60వేలు, హోటల్ యజమాని జలంధర్ 50వేలు, సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడు నవీన్కుమార్ 2లక్షలు ఆలయంలో పనిచేసే టెండర్ సెక్షన్ ఇన్చార్జికి చెల్లించి చేసి రసీదులు పొందారు.
కానీ, సదరు ఉద్యోగి ఆ నగదును డీసీబీ (డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్) బుక్లో రాసినప్పటికీ.. ఆలయ పరిధిలో గానీ, బ్యాంక్లో గానీ జమ చేయలేదు. అలాగే వ్యాపారులకు నో డ్యూ ఇవ్వకుండా.. రసీదు ఇచ్చి సరిపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ చెల్లింపుల వివరాలను డీసీబీ బుక్లో రాసిన తర్వాత మరో ఉద్యోగి క్యాష్ బుక్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదీ జరగలేదని తెలుస్తున్నది. టెండర్ గడువు పూర్తయ్యే సమయానికైనా దీనిని గుర్తించి.. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సమాచారం ఇచ్చారా..? లేదా..? అన్నది కూడా తెలియదు.
రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించిన సమయంలో 37.90లక్షల స్వాహా బాగోతం బట్టబయలైంది. దీంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. కాగా, సదరు ఉద్యోగికి ఆలయ ఈవో టంకశాల వెంకటేశం శుక్రవారం మెమో జారీ చేశారు. అయితే స్వాహా వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి ఇదివరకు దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు మళ్లీ టెండర్ ప్రక్రియలో పాల్గొనాలంటే.. ఆలయ అధికారుల నుంచి తీసుకున్న నో డ్యూ సమర్పించాల్సి ఉంటుంది. గత జనవరిలో 2024-25కి సంబంధించి టెండర్లు నిర్వహించినప్పుడు నోడ్యూ సర్టిఫికెట్లు లేకపోవడాన్ని ఎవరూ గుర్తించకపోవడం సందేహాలకు తావిస్తున్నది. నగదు వివరాలను క్యాష్ బుక్లో నమోదు చేసే ఉద్యోగితోపాటు సెక్షన్ పర్యవేక్షకుడు సైతం లీజుల వసూలును ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఇతర అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆలయ అవసరాల కోసం ఇతర ఆలయాల నుంచి ఉద్యోగులను డిప్యూటేషన్ పద్ధతిన తీసుకువచ్చినా.. ఐదేళ్లకు మించి ఉండరాదనే నిబంధన ఉన్నది. కానీ, అంజన్న ఆలయంలో ఆ నిబంధనలు బేఖాతరు అవుతున్నట్టు తెలుస్తున్నది. కొందరు ఐదేళ్లు దాటినా ఇక్కడే ఉంటూ.. కీలక బాధ్యతలను వారి గుప్పిట్లో ఉంచుకొని చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తున్నది. ఆదాయ-వ్యయాలకు సంబంధించి వార్షిక ఆడిట్ను నిర్వహించకపోవడం వల్ల స్వాహా వ్యవహారాలను గుర్తించడం లేదనే విమర్శలున్నాయి. గతంలో ఓసారి ఆడిట్ చేసినప్పుడు లక్షలాది రూపాయలు సిబ్బంది పక్కదారి పట్టించినట్టు తేలింది.
అప్పుడు కొంతమంది తిరిగి చెల్లింపులు చేశారు. రెండేళ్ల నుంచి ఆడిట్ పెండింగ్లో ఉండగా, కొంత మంది తమకు ఏమి కాదనే ఉద్దేశ్యంతో ఆలయ పద్దులను సొంతానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈవో మెమో జారీ చేయడంతో అవి బలపడుతున్నాయి. అంజన్న ఆలయ లీజలు వసూలు నుంచి 37.90 లక్షలు స్వాహా చేసిన ఘటన వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ స్థాయిలో ఓ ప్రత్యేకాధికారిని నియమించి విచారణ చేపడితేనే పూర్తి స్థాయి విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి.
అంజన్న ఆలయ ప్రాంగణంలో ఉద్యోగుల అవినీతిని ఉపేక్షించేది లేదు. 37.90 లక్షల స్వాహా విషయంలో సదరు ఉద్యోగికి మెమో జారీ చేశాం. ఆలయ నగదును తిరిగి వసూలు చేస్తాం. పద్దు పుస్తకాలను పరిశీలించాక దేవాదాయ కమిషనర్కు నివేదించి తగిన చర్యలు తీసుకుంటాం.
– టంకశాల వెంకటేశం, ఆలయ ఈవో (కొండగట్టు)